వీరమరణమే విజయం!
(పాకిస్తాన్ దాడిలో
తెలుగు తేజం అస్తమయం)
పాకిస్తాన్ సైన్యం జమ్ము కాశ్మీర్ సరిహద్దుల్లో జరిపిన దాడిలో
మన జవాను మురళీ నాయక్
వీరమరణం పొందాడు.మురళీ నాయక్ సత్యసాయి జిల్లా
కల్లితండా గ్రామానికి చెందిన వీరయోధుడు..ఇరవై ఆరేళ్ల నాయక్ భౌతిక కాయం శనివారం నాటికి స్వగ్రామం చేరుతుంది.ఆయనకు ప్రభుత్వ లాంచనాలతో అంత్యక్రియలు
జరిపిస్తామని మంత్రి నారా లోకేష్ ప్రకటించారు.
ఈ సందర్భంగా మురళీ నాయక్ కు నివాళి అర్పిస్తూ
ఓ చిన్న కవిత..
యుద్ధంలో నేను మరణిస్తే…
నా భౌతికకాయం
ఇమిడే మందసం..
నా మోమున
చెదరని మందహాసం..!
మా ఊళ్ళో
అమ్మ దగ్గరికి చేర్చాక..
అక్కడ మా ఇంట్లో
నన్ను జాగ్రత్తగా అమర్చాక..
అమ్మకు నా మాటగా చెప్పండి
దేశం కోసం
చేయగలిగినంతా
చేశానని.
Also Read పాకిస్తాన్ ఆయుధ సంపత్తిని తుత్తునియలు చేసే బ్రహ్మాస్త్రం

నాన్నకు నివేదించండి..
నా కోసం
దిగులు పడవద్దని..
అన్నట్టు మా ఊరి జనం..
నా మిత్రులు..బంధువులు..
అందరికీ చెప్పండి..
బాధపడవద్దని..
ఇంతదనుక
పరాక్రమించిన మురళి ఇప్పుడు శాశ్వత నిద్రకు ఉపక్రమించాడని ఊరడించండి..
నాకు విద్య నేర్పిన గురువులకు
నా ప్రత్యేక మన్నన ..
మీరు నేర్పిన పాఠాలే..
నరనరానా నింపిన
దేశభక్తే నా విజయప్రస్థానానికి
బాటలు వేశాయని..
నా రుధిరంతోనే
నా చరిత్రను గర్వంగా
రాసుకునేలా చేశాయని..
చివరగా నా దేశానికి
ఓ విన్నపం..
నా లోపం లేదు..
నా మరణం నీ శోకానికి కారణం కారాదు..
నాకు తెలుసు..
జవాను లక్ష్యం
విజయమో.. వీరమరణమో..
ప్రతి సైనికుడి లక్ష్యం అదేనని..!
జై జవాన్..జై హింద్..
🫡🫡🫡🫡🫡🫡🫡🫡
ఎలిశెట్టి సురేష్ కుమార్
విజయనగరం
9948546286