పాక్ ఆక్రమత కాశ్మీర్ లో ఉగ్రస్థావరాలపైసర్జికల్ స్ట్రైక్స్
పహల్గాం ఉగ్రదాడి అనంతరం కవ్వింపు చర్యలతో రెచ్చగొట్టిన పాకిస్తాన్ భారత్ ధీటైన సమాధానం ఇచ్చింది.
పహల్గామ్ ఉగ్రదాడికి ప్రతీకారంగా బుధవారం తెల్లవారు జామున “ఆపరేషన్ సిందూర్” పాక్లో ఉగ్రస్థావరాలపై భారత్ దాడులు నిర్వహించింది.
న్యూఢిల్లీ, మే 7: పహల్గామ్ ఉగ్రదాడికి భారత సైన్యం ధీటుగా ప్రతీకారం తీర్చుకుంది. “ఆపరేషన్ సిందూర్” పేరిట బుధవారం తెల్లవారుజామున పాకిస్థాన్ మరియు పాకిస్థాన్ ఆక్రమిత కశ్మీర్లో ఉన్న ఉగ్రవాద స్థావరాలపై భారత వైమానిక దళం సర్జికల్ స్ట్రైక్స్ చేసింది. మొత్తం 9 ఉగ్రవాద శిబిరాలను లక్ష్యంగా చేసుకుని ఈ దాడులు జరిగాయి. భారీగా ఉగ్రవాదులు హతమయ్యారని అధికారులు తెలిపారు.
పాక్ ఆక్రమిత కాశ్మీర్లోని కోట్లి, ముజఫరాబాద్, బహవల్పూర్ ప్రాంతాల్లో దాడులు జరిగాయని పాకిస్థాన్ సైన్యం కూడా అధికారికంగా ధ్రువీకరించింది.
ఈ దాడులపై పలువురు కేంద్ర మంత్రులు, ఎంపీలు, ప్రజలు సోషల్ మీడియాలో స్పందిస్తూ “భారత్ మాతా కీ జై” అంటూ సందేశాలు పోస్టు చేస్తున్నారు. భారత రక్షణ శాఖ త్వరలో ఈ దాడులకు సంబంధించిన పూర్తి వివరాలు ప్రకటించనుందని తెలిపింది. భారత సైన్యం “న్యాయం జరిగింది” అంటూ అధికారికంగా పేర్కొంది.
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు స్పందన
ఆపరేషన్ సిందూర్ పై ఆంధ్రప్రదేశ్ సీఎం చంద్రబాబు నాయుడు స్పందించారు. “జైహింద్” అంటూ ట్వీట్ చేస్తూ భారత సైన్యానికి మద్దతు తెలిపారు.
శహీద్ శుభం ద్వివేది భార్య హృదయవిదారక స్పందన
పహల్గామ్ దాడిలో ప్రాణాలు కోల్పోయిన శుభం ద్వివేది భార్య మీడియాతో మాట్లాడుతూ – “నా భర్త మరణానికి భారత్ ప్రతీకారం తీర్చుకుంది. మోదీగారికి ధన్యవాదాలు. మా కుటుంబానికి ఆయనపై నమ్మకముంది. ఇది నా భర్తకు నిజమైన నివాళి” అని ఉద్వేగంతో మీడియాతో స్పందించారు.
పాక్ స్పందన – హెచ్చరికలు
భారత దాడులను పాక్ సైన్యం అధికారికంగా అంగీకరించింది. పాక్ ఆర్మీ అధికార ప్రతినిధి లెఫ్టినెంట్ జనరల్ అహ్మద్ షరీఫ్ చౌదరి ప్రకారం – “దాడుల్లో ముగ్గురు మరణించగా, 12 మందికి గాయాలయ్యాయి. భారత్ తాత్కాలిక విజయం పొందినా, దీని కోసం శాశ్వత నష్టం ఎదుర్కోవాల్సి వస్తుంది” అని హెచ్చరించారు.
పాక్ ప్రధాని తీవ్ర వ్యాఖ్యలు
పాకిస్థాన్ ప్రధాని షెహబాజ్ షరీఫ్ భారత్పై మండిపడ్డారు. “భారత్ ఐదు ప్రాంతాల్లో దాడి చేసింది. పాక్ దీన్ని సహించదు. దేశం మొత్తం సైన్యంతో కలసి శత్రువును ఎదుర్కొంటుంది” అని తెలిపారు.
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఇలా…
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ స్పందిస్తూ ఇది హేయమైన చర్యగా అభివర్ణించాడు.– “ఇండియా-పాకిస్థాన్ మధ్య ఉద్రిక్తతలు ఆందోళనకరంగా ఉన్నాయి. ఇరు దేశాలు సంయమనం పాటించాలి” అన్నారు.
ఐక్యరాజ్యసమితి సెక్రటరీ జనరల్ ఆంటోనియో గుటెర్రస్ కూడా ఈ దాడులపై ఆందోళన వ్యక్తం చేశారు. ఇరు దేశాలు తక్షణమే ఉద్రిక్తతలు తగ్గించాలని పిలుపునిచ్చారు.