కిట్స్ వరంగల్లో సైబర్ సెక్యూరిటీ, వీఎల్ఎస్ఐ బీటెక్ కోర్సులు ప్రారంభం
వరంగల్, జూలై 18: కాకతీయ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ అండ్ సైన్స్ (కిట్స్), వరంగల్ 2026–27 విద్యా సంవత్సరానికి రెండు కొత్త బీటెక్ కోర్సులను ప్రారంభించింది.
అలాగే బీటెక్ కంప్యూటర్ సైన్స్ అండ్ ఇంజినీరింగ్ (డేటా సైన్స్) కోర్సులో అదనపు సెక్షన్కు కూడా అనుమతి లభించింది.కిట్స్ ప్రిన్సిపాల్ ప్రొఫెసర్ కె. అశోక్ రెడ్డి మాట్లాడుతూ బీటెక్ కంప్యూటర్ సైన్స్ అండ్ ఇంజినీరింగ్ (సైబర్ సెక్యూరిటీ), బీటెక్ ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్ ఇంజినీరింగ్ (వీఎల్ఎస్ఐ డిజైన్ అండ్ టెక్నాలజీ) కోర్సులతో పాటు బీటెక్ కంప్యూటర్ సైన్స్ అండ్ ఇంజినీరింగ్ (డేటా సైన్స్)లో అదనపు సెక్షన్కు అనుమతి లభించిందని తెలిపారు.ఈ కోర్సులకు న్యూఢిల్లీకి చెందిన ఆల్ ఇండియా కౌన్సిల్ ఫర్ టెక్నికల్ ఎడ్యుకేషన్ (ఏఐసీటీఈ), తెలంగాణ ప్రభుత్వం ఆమోదం తెలిపాయని, 2026–27 విద్యా సంవత్సరం నుంచే ప్రవేశాలు చేపట్టనున్నట్లు ఆయన చెప్పారు.కిట్స్ అదనపు కార్యదర్శి, మాజీ ఎమ్మెల్యే వొడితల సతీష్ కుమార్ మాట్లాడుతూ సైబర్ సెక్యూరిటీ, వీఎల్ఎస్ఐ డిజైన్, డేటా సైన్స్ రంగాలకు ప్రస్తుతం పరిశ్రమల్లో మంచి డిమాండ్ ఉందన్నారు. ఈ కోర్సులు విద్యార్థులకు పరిశ్రమ అవసరాలకు అనుగుణమైన నైపుణ్యాలను అందించి ఉపాధి అవకాశాలను పెంచేందుకు ఉపయోగపడతాయని తెలిపారు.మారుతున్న పరిశ్రమ అవసరాలకు అనుగుణంగా నాణ్యమైన సాంకేతిక విద్య అందించాలనే లక్ష్యంతో ఈ కొత్త కోర్సులను ప్రవేశపెట్టినట్లు ఆయన పేర్కొన్నారు.కిట్స్ చైర్మన్, మాజీ రాజ్యసభ సభ్యుడు కెప్టెన్ వి. లక్ష్మీకాంతరావు, ట్రెజరర్ పి. నారాయణరెడ్డి కంప్యూటర్ సైన్స్ అండ్ ఇంజినీరింగ్, ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్ ఇంజినీరింగ్ విభాగాలను అభినందించారు.ఈ కార్యక్రమంలో రిజిస్ట్రార్ ప్రొఫెసర్ ఎం. కోమల్ రెడ్డి, డీన్లు, విభాగాధిపతులు, అధ్యాపకులు, సిబ్బంది పాల్గొన్నారు.

