హైదరాబాద్ లో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధ్వర్యంలో భారత సైన్యానికి మద్దతుగా సంఘీభావ ర్యాలి

CM REVANTH REDDY SOLIDARITY RALLY


హైదరాబాద్,మే 8,2025: ఉగ్రవాదంపై భారత సైన్యం చేపట్టిన ఆపరేషన్ సిందూర్ కు మద్దతుగా తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గురువారం సంఘీభావ ర్యాలీ నిర్వహించారు. సాయంత్రం 6:30 గంటలకు సెక్రటేరియట్ నుంచి నెక్లెస్ రోడ్ లోని ఇందిరాగాంధీ విగ్రహం వరకు ఈ సంఘీభావ ర్యాలీ జరిగింది.

ముఖ్యమంత్రి జాతీయజెండా చేబూని ర్యాలీలో నడిచారు.

ర్యాలీలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తో పాటు ఉపముఖ్యమంత్రి భట్టి విక్రమార్క, చీఫ్ సెక్రెటరి రామకృష్ణ, పలువురు మంత్రులు, అధికారులు ఆర్మీ అధికారులు, యువత పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడిన సీఎం రేవంత్ రెడ్డి, “ఆపరేషన్ సిందూర్ పాకిస్తాన్‌కు సరైన బుద్ధి చెప్పింది. ఇకనైనా వక్రబుద్ధిని మానుకోవాలి” అని హితవు పలికారు. ఉగ్రవాదాన్ని ఎట్టి పరిస్థితుల్లోనూ సహించేది లేదని ఆయన స్పష్టం చేశారు.

రాష్ట్రవ్యాప్తంగా భద్రతను పటిష్టం చేయాలని, అన్ని శాఖలు సమన్వయంతో పనిచేయాలంటూ అధికారులను సీఎం ఆదేశించారు. హైదరాబాద్లోని కీలక రక్షణ సంస్థల వద్ద కట్టుదిట్టమైన భద్రత ఏర్పాటు చేయాలని సూచించారు.

పహల్గాం ఉగ్రదాడిలో ప్రాణాలు కోల్పోయిన జవాన్లకు సీఎం రేవంత్ రెడ్డి నివాళులు అర్పించారు. వారి చిత్రపటాల వద్ద పుష్పాంజలి ఘటించి, రెండు నిమిషాల మౌనం పాటించారు.

“మేము శాంతి ప్రేమికులమే. కానీ మమ్మల్ని బలహీనులని భావించి దేశాన్ని, మన ఆడబిడ్డల సిందూరాన్ని ముట్టుకుంటే.. ఆపరేషన్ సిందూర్‌లాంటి సమాధానాలు తప్పవు” అని సీఎం హెచ్చరించారు. రాజకీయాలకు అతీతంగా దేశ రక్షణకు ప్రతి ఒక్కరు ఏకమవాలని పిలుపునిచ్చారు.

ఈ సంఘీభావ ర్యాలీ ద్వారా దేశాన్ని కాపాడుతున్న జవాన్లకు తెలంగాణ గడ్డ నుంచి గట్టి సంకేతం పంపినట్టు సీఎం రేవంత్ తెలిపారు.

Share this post

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

IN ARTICLE