అప్పుల భారంలోనూ సంక్షేమం పరుగులు – మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి

PONGULETI

వాజేడు/వెంకటాపురం, మే 7: రాష్ట్రం ఆర్థికంగా అనేక కష్టాల్లో ఉన్నా… సంక్షేమంలో మాత్రం వెనుకడుగు లేదు. పేదవారి కలల సాకారమే లక్ష్యంగా ఇందిరమ్మ ప్రభుత్వం ముందుకు సాగుతోంది అని రాష్ట్ర రెవిన్యూ, గృహ నిర్మాణ, సమాచార మరియు పౌర సంబంధాల శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి అన్నారు.

బుధవారం భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలోని వాజేడు మండలం టేకులగూడెం గ్రామంలో 106 ఇందిరమ్మ ఇండ్ల భూమిపూజతోపాటు, రూ.400 లక్షల బడ్జెట్‌తో బిటి రోడ్డు నిర్మాణం, రూ.150 లక్షలతో వాజేడు మండల పరిషత్ కార్యాలయం నిర్మాణానికి శంకుస్థాపనలు చేశారు. అదేవిధంగా ఎడ్చర్లపల్లి-ముత్తారం మధ్య రూ.300 లక్షల విలువైన రోడ్డుపనులు, రూ.14 లక్షలతో నిర్మించిన బేబీ బర్త్ వెయిటింగ్ హాల్‌ను ప్రారంభించారు.

ఈ కార్యక్రమాలలో భద్రాచలం ఎమ్మెల్యే డా. తెల్లం వెంకట్రావు, జిల్లా కలెక్టర్ దివాకర టి.ఎస్., ఎస్పీ శబరిష్, ఐటిడిఏ పీఓ చిత్ర మిశ్రా తదితరులు పాల్గొన్నారు. అనంతరం కొంగాల గ్రామంలో 57 మందికి, నాగారం గ్రామంలో 64 మందికి ఇళ్ల మంజూరు పత్రాలను మంత్రివర్యులు అందజేశారు.

వెంకటాపురం మండల కేంద్రంలో రూ.60 లక్షలతో ఉపకార్యనిర్వాహక ఇంజినీర్ కార్యాలయం నిర్మాణానికి శంకుస్థాపన చేశారు. పాత్రపురం గ్రామ రైతు వేదిక వద్ద కూడా పలు ఇళ్ల మంజూరులు చేశారు.

గత పాలకుల అప్పులు
ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ, గత ప్రభుత్వం రూ.8.19 లక్షల కోట్ల అప్పులు చేసి రాష్ట్రాన్ని ఆర్థికంగా కుంగదీసిందని, ఇప్పుడు ఆ అప్పులను తీరుస్తూనే పేదలకు సంక్షేమం అందిస్తున్నామని పేర్కొన్నారు. ప్రతి పేద కుటుంబానికి రూ.5 లక్షలతో ఇళ్లు నిర్మించుకునే అవకాశం కల్పించినట్లు తెలిపారు.

ఈ ఉగాది నుంచి ప్రతి పేద కుటుంబానికి నెలకు 6 కిలోల సన్నబియ్యం అందజేస్తున్నామని, 10 నెలల్లో 57,662 ఉద్యోగ అవకాశాలు కల్పించామని వివరించారు. పేద రైతుల భూ సమస్యల పరిష్కారానికి భూభారతి చట్టాన్ని తెచ్చామని తెలిపారు.

జూన్ 2న అర్హులైన నిరుద్యోగులకు రాజీవ్ వికాస్ పథకం కింద రూ.6 వేల కోట్లు ఆర్థికసహాయం అందించనున్నట్టు పేర్కొన్నారు. విద్యార్థులకు నూతన పరిజ్ఞానంతో విద్యను బోధించేందుకు చర్యలు తీసుకుంటున్నామన్నారు. ఆరోగ్యశ్రీ వర్తనను రూ.10 లక్షల వరకు పెంచామని వెల్లడించారు.

భద్రాచలం ఎమ్మెల్యే తెల్లం వెంకట్రావు
భద్రాచలం ఎమ్మెల్యే తెల్లం వెంకట్రావు మాట్లాడుతూ, నియోజకవర్గంలోని ప్రతి గ్రామంలో ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణాన్ని వేగంగా పూర్తి చేసేందుకు చర్యలు తీసుకుంటున్నామని చెప్పారు. ఐటిడిఏ పరిధిలోని గ్రామాల్లో అదనంగా ఇళ్లు మంజూరు చేయాలని మంత్రి శ్రీనివాస్ రెడ్డిని కోరినట్లు చెప్పారు. ప్రభుత్వం అర్హులైన ప్రతి నిరుపేద కుటుంబానికి ఇళ్లు అందేలా చూస్తామని హామీ ఇచ్చారు.

ఇండ్ల నిర్మాణం వేగం కలెక్టర్
జిల్లా కలెక్టర్ దివాకర టి.ఎస్. మాట్లాడుతూ, టేకులగూడెం గ్రామంలో మంజూరైన 106 ఇళ్లలో 62 ఇండ్లు గ్రౌండ్ లెవెల్‌లో పూర్తి కాగా, 15 ఇండ్లు పూర్తయ్యాయని, మొదటి విడత నిధులు లబ్ధిదారులకు జమ చేశామని తెలిపారు. ఐటిడిఏ పరిధిలోని గిరిజనులకు అదనంగా ఇండ్లు కేటాయించినట్లు చెప్పారు.

ఈ కార్యక్రమాల్లో ఏఎస్పీ శివం ఉపాధ్యాయ, డీఎఫ్ఓ రాహుల్ కిషన్ జాదవ్, ఆర్డీఓ వెంకటేష్, ఇతర అధికారులు, ప్రజాప్రతినిధులు, లబ్ధిదారులు పాల్గొన్నారు.

Share this post

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

IN ARTICLE