త్వరలో అందుబాటులోకి 5వేల మంది లైసెన్స్డ్ సర్వేయర్లు

PONGULETISRINIVASREDDY

హైదరాబాద్: తెలంగాణ ప్రజలకు ముఖ్యంగా రైతాంగానికి మెరుగైన సేవలను అందించడానికి, రాష్ట్రంలో భూములకు సంబంధించి అనేక పంచాయితీలకు శాశ్వత పరిష్కారం చూపాలనే లక్ష్యంతో సర్వే, సెటిల్మెంట్, ల్యాండ్ రికార్డ్స్ డిపార్ట్మెంట్ ను మరింత బలోపేతం చేస్తున్నామని రెవెన్యూ, హౌసింగ్, సమాచార పౌర సంబంధాల శాఖ మంత్రి శ్రీ పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి తెలిపారు.

రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకువచ్చిన భూ భారతి చట్టంలో రిజిస్ట్రేషన్ల ప్రక్రియకు భూమి సర్వే మ్యాపును జత పరచడం తప్పనిసరి చేసిన నేపథ్యంలో సర్వే విభాగం పాత్ర మరింత క్రియాశీలం కానుందన్నారు. భూ భారతి చట్టంలో పేర్కొన్న విధంగా ప్రభుత్వ లక్ష్యం నెరవేరాలంటే ప్రస్తుతం ఉన్న 402 మంది సర్వేయర్లు సరిపోరని, మరికొంత మంది సర్వేయర్లు అవసరమవుతారని అన్నారు. దీనిని దృష్టిలో పెట్టుకుని ఒకవైపు లైసెన్స్డ్ సర్వేయర్లను తీసుకోవడం, మరోవైపు సర్వే విభాగంలో ఖాళీగా ఉన్న సర్వేయర్ పోస్టులు భర్తీ చేయడం ఇంకొవైపు భూముల సర్వేకు అవసరమైన అత్యాధునిక పరికరాలను అందుబాటులోకి తీసుకురావడానికి చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు.

శుక్రవారం సచివాలయంలో సర్వే, సెటిల్మెంట్, ల్యాండ్ రికార్డ్స్ శాఖపై మంత్రిగారు సమీక్షించారు. ఈ సందర్భంగా మంత్రిగారు మాట్లాడుతూ ప్రతి మండలం, పట్టణంలో భూ విస్తరణ, భూ లావాదేవీలను బట్టి రాష్ట్ర వ్యాప్తంగా సుమారు 5వేల మంది లైసెన్స్డ్ సర్వేయర్లను తీసుకోబోతున్నామని వెల్లడించారు.

లైసెన్స్డ్ సర్వేయర్ల శిక్షణకు అర్హత గలిగిన అభ్యర్థులనుండి ఈ నెల 17 వ తేది వరకు దరఖాస్తులను స్వీకరిస్తున్నట్లు తెలిపారు. అభ్యర్థులు ఇంటర్మీడియట్ (గణిత శాస్త్రం) ఒక అంశంగా ఉండి, కనీసం 60% మార్కులతో ఉత్తీర్ణులై ఉండాలన్నారు. ఐ‌టి‌ఐ నుంచి డ్రాఫ్ట్స్ మన్ (సివిల్), డిప్లొమా (సివిల్), బి.టెక్ (సివిల్) లేదా ఇతర సమానమైన విద్యార్హత కలిగి ఉండాలన్నారు. శిక్షణ ఫీజు ఓసీ అభ్యర్థులకు రూ.10వేలు, బీసీ అభ్యర్థులకు రూ.5వేలు, ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులకు రూ.2500 చెల్లించవలసి ఉంటుందన్నారు. ఎంపిక అయిన అభ్యర్థులకు జిల్లా ప్రధాన కేంద్రాలలో 50 పని దినాలలో తెలంగాణ అకాడమీ (ల్యాండ్ ఇన్ఫర్మేషన్ & మేనేజ్మెంట్) ఆధ్వర్యంలో శిక్షణ ఇవ్వబడుతుందని తెలిపారు. ఈ మొత్తం ప్రక్రియను పకడ్బంధీగా నిర్వహించి వీలైనంత త్వరగా లైసెన్స్డ్ సర్వేయర్ల సేవలను అందుబాటులోకి తీసుకురావాలని అధికారులను ఆదేశించారు. ఈ సమావేశంలో రెవెన్యూ శాఖ ప్రిన్సిపల్ సెక్రెటరీ నవీన్ మిట్టల్, కమిషనర్ ఆఫ్ సర్వే, సెటిల్మెంట్, ల్యాండ్ రికార్డ్స్ శాఖ శ్రీ జ్యోతి బుద్ధ ప్రకాష్, సి‌సి‌ఎల్‌ఏ ప్రాజెక్టు డైరెక్టర్ శ్రీ ఎం. మకరందు తదితరులు పాల్గొన్నారు.

Share this post

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

IN ARTICLE