కాళేశ్వరం సరస్వతీ పుష్కరాలకు పటిష్ఠ ఏర్పాట్లు చేయండి
లక్షలాదిగా వచ్చే భక్తులకు సకల ఏర్పాట్లు చేయాలి
రవాణా, శానిటరీ, భద్రతా, వైద్యం, ప్రచార చర్యలు పక్కాగా ఉండాలి
గతంలో సమ్మక్క – సారక్క ఇతర దైవ కార్యాల అనుభవాలతో ఏర్పాట్లు చేయాలి
చిన్న పిల్లలు, గర్భిణీ స్త్రీలు, వృద్ధులకు ఎటువంటి ఇబ్బందులు రావొద్దు
పెండింగ్ ఇంజినీరింగ్ పనులు త్వరితగతిన పూర్తి చేయాలి
అధికార యంత్రాంగానికి రాష్ట్ర మంత్రులు కొండా సురేఖ, శ్రీధర్ బాబులు ఆదేశం
రివ్యూ మీటింగులో పాల్గొన్న సీఎస్, డీజీపీ, ఎండోమెంట్ ప్రిన్స్ పల్ సెక్రటరీ
హైదరాబాద్, మే,06,2025: భూపాలపల్లి జిల్లా కాళేశ్వరం త్రివేణి సంగమం వద్ద ప్రవహించే “అంతర్వాహిని” సరస్వతీ నదీ పుష్కరాలకు పటిష్ఠ ఏర్పాట్లు చేయాలని జిల్లా అధికార యంత్రాంగానికి రాష్ట్ర దేవాదాయ శాఖ మంత్రి కొండా సురేఖ, ఐటీ, పరిశ్రమలు, చేనేత శాఖ మంత్రి శ్రీధర్ బాబు ఆదేశించారు. మంగళవారం మంత్రి సురేఖ ఆధ్వర్యంలో కాళేశ్వరం సరస్వతీ పుష్కరాల రివ్యూ మీటింగ్ హైదరాబాద్ సెక్రటేరియట్ లోని ఎండోమెంట్ మంత్రి కార్యాలయంలో జరిగింది. అత్యంత పవిత్రమైన ఈ త్రివేణి సంగమ స్నానానికి లక్షలాది భక్తులు మన రాష్ట్రం నుంచే కాకుండా ఇతర రాష్ట్రాల నుంచి కూడా వస్తారని తెలిపారు. సరస్వతీ నది పుష్కరాలు బృహస్పతి మిథున రాశి ( మిథునరాశి )లోకి ప్రవేశించినప్పటి నుండి 12 రోజుల పాటు ఆచరిస్తారని, ఉమ్మడి రాష్ట్రంలో వచ్చిన పుష్కరాలు తెలంగాణ స్వరాష్ట్రంగా ఏర్పడిన తరువాత వచ్చాయని అన్నారు. 2025 మే 14న రాత్రి 10.35 గంటలకు బృహస్పతి మిథున రాశిలోకి ప్రవేశించే సమయంలో పుష్కరకాలం ప్రారంభమవుతాయని, అప్పటికే ఏర్పాట్లన్నీ పూర్తి కావాలని చెప్పారు. మరుసటి రోజు సూర్యోదయం నుంచి పుష్కర పుణ్యస్నానాలు ఆచరించాల్సి ఉంటుందని గుర్తు చేశారు. ఈ పుష్కరాల కోసం ప్రభుత్వం చేపట్టిన ఏర్పాట్ల వివరాలు భక్తులకు సమగ్రంగా తెలిపేందుకు కాళేశ్వరం సరస్వతి పుష్కరాల వెబ్ పోర్టల్, మొబైల్ యాప్ను రాష్ట్ర దేవాదాయ శాఖ మంత్రి కొండా సురేఖ, మంత్రి శ్రీధర్ బాబు ఇటీవల ప్రారంభించారు. సరస్వతీ పుష్కరాలకు వచ్చే భక్తులు, యాత్రికులకు సంబంధించిన వివరాలు తెలిపేందుకు వాటిని ప్రా రంభించినట్టు మంత్రి కొండా సురేఖ తెలిపారు. ‘సరస్వతీ పుష్కరాలు’ పండుగకు స్నాన ఘాట్ల విస్తరణతో సహా వివిధ అభివృద్ధి పనులను విస్తృతం గా చేపట్టినట్టు ఇరువురు మంత్రులు తెలిపారు. కొన్ని చిన్న చిన్న పనులు పెండింగ్ లో ఉన్నాయని… అవి కూడా పుష్కరాలు ప్రారంభం అయ్యేలోగా అయిపోతాయని అధికారులకు మంత్రులు నివేదించారు.
ఈ పుష్కరాలు విజయవంతం నిర్వహించేందుకు తమ ప్రభుత్వం చాలా క్రీయాశీలకంగా పని చేస్తుందన్నారు. సమ్మక్క సారక్క జాతర, కొమురవెల్లి కల్యాణం, భద్రాచలం కల్యాణం మాదిరి ఈ పుష్కరాలు కూడా ప్రతిష్టాత్మకంగా నిర్వహించాలని తాము సంకల్పిస్తున్నట్టు చెప్పారు. భక్తులకు ఎక్కడా ఇబ్బందులు లేకుండా చూసుకోవాలని అధికారులను ఆదేశించారు. చలువ పందిళ్లు, టెంట్లు, శాశ్వత మరుగుదొడ్లు ఏర్పాట్లు చేస్తున్నట్టు అధికారులు వివరించారు. కాళేశ్వరంకు సంబంధించిన వివరాలన్నీ ఆయా వెబ్ సైట్, యాప్ ద్వారా తెలియజేయాలన్నారు. ఆర్టీసీ బస్సులను అవసరానికి అనుగుణంగా నడపాలని ఆర్టీసీ అధికారులకు సూచించారు. కాంగ్రెస్ ప్రజా ప్రభుత్వం వచ్చాక అమలు చేసిన ఉచిత బస్సు పథకం ద్వారా దేవాదాయ శాఖకు లాభం చేకూరినట్టు మంత్రి కొండా తెలిపారు. మహిళలు పెద్ద సంఖ్యలో ఆలయాలకు వస్తున్నట్టు మంత్రి కొండా సురేఖ చెప్పారు. పుష్కరాలకు వచ్చే భక్తులకు టోల్ ఫ్రీ నెంబర్ ఏర్పాటు చేయాలని మంత్రి సురేఖ సూచించారు. ‘ఉత్తరాన ప్రయాగ వద్ద, దక్షిణ భారతంలో కేవలం కాళేశ్వరంలోని త్రివేణి సంగమంలో మాత్రమే సరస్వతి నది అంతర్వాహినిగా ప్రవహిస్తుందని మంత్రి కొండా తెలిపారు. పవిత్ర సరస్వతీ పుష్కర స్నానం చేసిన వారికి సమస్త పాపములు తొలగిపోతాయని భక్తులు ప్రగాఢంగా విశ్వాసిస్తారని ఆమె తెలిపారు.
పీఠాధిపతులో పవిత్ర పుష్కర స్నానం
సరస్వతి పుష్కరాల సందర్భంగా ప్రతి రోజు ఒక పీఠాధిపతి ఈ పుష్కర స్నానం చేయనున్నట్టు మంత్రి కొండా తెలిపారు. పుష్కర ప్రారంభం మే 15, 16వ తేదీన శ్రీ గురుమదనానంద సరస్వతి పీఠం, రంగంపేట, మెదక్ నుంచి శ్రీ శ్రీ శ్రీ మాధవానంద సరస్వతి స్వామిలు పాల్గొని సరస్వతి పుష్కరాలను ప్రారంభిస్తారన్నారు. ఈ సమావేశంలో రాష్ట్ర సీఎస్ రామకృష్ణరావు, డీజీపీ జితేందర్, దేవాదాయ శాఖ ప్రిన్స్ పల్ సెక్రటరీ శైలజా రామయ్యర్, ఆర్ అండ్ బీ ప్రిన్స్ పల్ సెక్రటరీ వికాస్ రాజ్, సెర్ఫ్ సీఈఓ దివ్యా దేవరాజన్, ఎండోమెంట్ కమిషనర్ వెంకటరావు, అడిషనల్ కమిషనర్ కృష్ణవేణి, భూపాలపల్లి జిల్లా కలెక్టర్ రాహుల్ శర్మ, ఇతర శాఖల ఉన్నతాధికారులు, ఆలయ ఈఓ మహేశ్, ఆలయ ప్రధాన, ఉప ప్రధాన అర్చకులు పాల్గొన్నారు.