క్రమం తప్పకుండా తనిఖీలు ఉంటాయని హెచ్చరించిన మంత్రి తుమ్మల నాగేశ్వర రావు
హైదరాబాద్, మే 06, 2025: రాష్ట్ర వ్యవసాయశాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ఆదేశాల మేరకు, మామిడి పండ్లలో హానికరమైన రసాయనాల వినియోగాన్ని అరికట్టేందుకు రాష్ట్రవ్యాప్తంగా వ్యవసాయ మరియు మార్కెటింగ్ శాఖల అధికారులు ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు. FSSAI మరియు మార్కెటింగ్ శాఖ అధికారుల నేతృత్వంలో ఈ తనిఖీలు జరిగాయి.
తనిఖీల వివరాలు: రాష్ట్రవ్యాప్తంగా నిర్వహించిన ఈ తనిఖీల్లో భాగంగా వరంగల్లో 5, బాటసింగారం (గడ్డిఅన్నారం)లో 7, జగిత్యాలలో 10, హైదరాబాద్లోని జాంబాగ్లో పలు మార్కెట్లు ఉన్నాయి. తనిఖీల సందర్భంగా కార్బైడ్ వాడకం గుర్తించకపోయినప్పటికీ, కొన్ని చోట్ల ఎథిలిన్ సాచెట్లను అనుమతించిన మోతాదుకు మించి ఉపయోగించినట్లు అధికారులు కనుగొన్నారు. అలాగే, ఎథిలిన్ సాచెట్లు నేరుగా పండ్లకు తాకేలా ఉంచడం వల్ల ఆ పండ్లను సీజ్ చేసి, ఇన్స్టిట్యూట్ ఆఫ్ ప్రివెంటివ్ మెడిసిన్ (IPM)కి పరీక్షల కోసం పంపించారు. IPM నుంచి వచ్చే నివేదిక ఆధారంగా తదుపరి చర్యలు తీసుకోనున్నట్లు మంత్రి తెలిపారు.
వారంవారీ తనిఖీలు: మంత్రి మాట్లాడుతూ, ఇలాంటి ఆకస్మిక తనిఖీలు ప్రతి వారం కొనసాగుతాయని, మార్కెట్లతో పాటు పండ్లు అమ్మే ఇతర ప్రాంతాల్లోనూ తనిఖీలు నిర్వహిస్తామని పేర్కొన్నారు. “ట్రేడర్లు తప్పనిసరిగా FSSAI లైసెన్స్ పొంది, FSSAI ప్రమాణాలను ఖచ్చితంగా పాటించాలి. కార్బైడ్ వంటి హానికర రసాయనాలు ఉపయోగిస్తే కఠిన చర్యలు తప్పవు,” అని హెచ్చరించారు.
, “కార్బైడ్ వంటి రసాయనాల వాడకం పండ్ల పక్వానికి ఉపయోగించడం వల్ల ప్రజల ఆరోగ్యానికి తీవ్ర ముప్పు వాటిల్లుతుంది. ఇటువంటి నిబంధనల ఉల్లంఘనలను ప్రభుత్వం తీవ్రంగా పరిగణిస్తుంది. భవిష్యత్తులో ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా నిరంతర తనిఖీలు కొనసాగుతాయి,” అని మంత్రి స్పష్టం చేశారు.