జాతీయ రహదారుల విస్తరణతో వేగంగా పారిశ్రామికాభివృద్ధి కేంద్రమంత్రి నితిన్ గడ్కరి

SITAKKA

కాగజ్ నగర్,మే 5, 2025 :మంచిర్యాల నుండి మహారాష్ట్ర సరిహద్దు వరకు నిర్మితమైన నాలుగు వరుసల జాతీయ రహదారిని కేంద్ర మంత్రులు నితిన్ గడ్కరి, కిషన్ రెడ్డి ప్రారంభించారు. రూ. 3,900 కోట్ల వ్యయంతో నిర్మించిన ఈ రహదారి రాష్ట్ర అభివృద్ధికి మరింత బలం చేకూరుస్తుందని వారు తెలిపారు.

ఈ సందర్భంగా రవాణా, జాతీయ రహదారుల శాఖ మంత్రి నితిన్ గడ్కరి మాట్లాడుతూ, రహదారుల విస్తరణతో పారిశ్రామికాభివృద్ధి వేగవంతమవుతుందని, యువతకు ఉపాధి అవకాశాలు పెరుగుతాయని అన్నారు. తెలంగాణలో రాబోయే మూడు సంవత్సరాల్లో అనేక జాతీయ రహదారి ప్రాజెక్టులకు భారీ నిధులు కేటాయించనున్నట్లు వెల్లడించారు. దేశవ్యాప్తంగా జాతీయ రహదారుల అనుసంధానంతో రవాణా వేగవంతం కావడంతో పాటు, రోడ్డు ప్రమాదాలు తగ్గిపోతాయని చెప్పారు.

ఈ కార్యక్రమంలో కేంద్ర బొగ్గుగనుల శాఖ మంత్రి కిషన్ రెడ్డి, కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్, రాష్ట్ర రోడ్లు భవనాల శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి, మహిళ, శిశు సంక్షేమ శాఖ మంత్రి సీతక్క, పార్లమెంటు సభ్యులు, శాసనసభ్యులు పాల్గొన్నారు.

ముఖ్యమైన ప్రాజెక్టులు:

  • జాతీయ రహదారి 363: మంచిర్యాల-మహారాష్ట్ర సరిహద్దు వరకు 94.6 కి.మీ. పొడవుతో రూ. 3,526 కోట్ల వ్యయంతో 4 వరుసల రహదారి నిర్మాణం.
  • జాతీయ రహదారి 61: నిర్మల్-ఖానాపూర్ సెక్షన్ లో 17.79 కి.మీ. మేరకు రూ. 127 కోట్లతో 2 వరుసల పేవ్డ్ షోల్డర్ రహదారి నిర్మాణం.
  • జాతీయ రహదారి 44: నాగపూర్-హైదరాబాద్ సెక్షన్ లో రూ. 29 కోట్లతో 1 కి.మీ. అండర్ పాస్, రూ. 18 కోట్లతో 2 కి.మీ. సర్వీసు రోడ్లు, జంక్షన్ అభివృద్ధి.

రాష్ట్ర మంత్రుల అభిప్రాయాలు:
రాష్ట్ర మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి మాట్లాడుతూ, కేంద్ర సహకారంతో రహదారి పనులు వేగవంతమయ్యాయని, పెండింగ్‌లో ఉన్న అటవీ అనుమతులు త్వరగా పూర్తవ్వాలని కేంద్రానికి విజ్ఞప్తి చేశారు. మంత్రి సీతక్క మాట్లాడుతూ, ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా అటవీ ప్రాంతాల్లో అభివృద్ధి కష్టంగా ఉందని, రహదారుల నిర్మాణం ద్వారా గ్రామాల అభివృద్ధికి దోహదపడుతుందన్నారు.

ప్రాంతీయ అభివృద్ధి లక్ష్యం:
ఆదిలాబాద్ పార్లమెంటు సభ్యులు, స్థానిక శాసనసభ్యులు అందరూ తమ ప్రాంతాలకు మరింత రహదారి సౌకర్యం కల్పించాలని, పెండింగ్ పనులను త్వరగా పూర్తిచేయాలని కోరారు.

ఈ కార్యక్రమంలో జిల్లా అధికారులు, పోలీసు అధికారులు, అటవీశాఖ అధికారులు, జాతీయ రహదారుల సంస్థ అధికారులు, ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు. కార్యక్రమానికి హెలికాప్టర్ ద్వారా విచ్చేసిన కేంద్రమంత్రులకు ఘనస్వాగతం లభించింది.

Share this post

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

IN ARTICLE