కాలం చెల్లిన పదార్థాలు,రిఫ్రిజిరేటర్లలో కుళ్లిన మాంసం కిచెన్ లో అపరిశుభ్రత
హనుమకొండ,మే 05,2025: హనుమకొండ పట్టణంలోని పలు ప్రముఖ రెస్టారెంట్లపై తెలంగాణ రాష్ట్ర ఫుడ్ సేఫ్టీ టాస్క్ఫోర్స్ బృందం సోమవారం ఆకస్మిక తనిఖీలు నిర్వహించింది. ఫుడ్ సేఫ్టీ కమిషనర్ ఆర్.వి. కర్ణన్ ఆదేశాల మేరకు, జోనల్ అసిస్టెంట్ ఫుడ్ కంట్రోలర్ వి. జ్యోతిర్మయి నేతృత్వంలో ఈ తనిఖీలు జరిగాయి. ఫుడ్ ఇన్స్పెక్టర్లు రోహిత్ రెడ్డి, స్వాతి, శ్రీషికలతో కూడిన బృందం “ఫుడ్ ఆన్ ఫైర్” మరియు “ల్యాండ్మార్క్” రెస్టారెంట్లను తనిఖీ చేసింది.
తనిఖీల్లో వంటగదులు పూర్తిగా అపరిశుభ్రంగా ఉండటం, మురికితో కూడిన ఫ్రిడ్జ్లలో సరైన ఉష్ణోగ్రతలు పాటించకపోవడం, దాదాపు రూ. 45,000 విలువైన 32 కిలోల కుళ్లిన మాంసం నిల్వ పెట్టడం, హానికర రంగులతో చికెన్, కాలం చెల్లిన ఐస్ క్రీములు, పాల ప్యాకెట్లు, మసాలా పొడులు, లేబులింగ్ లో లోపాలు ఉన్న కార్న్, కొబ్బరి పొడి, ఫంగస్ ఉన్న క్యాబేజీ, కాలీఫ్లవర్ వంటి అనేక నిషేధిత పదార్థాలను గుర్తించారు.
తద్వారా, ప్రాసెస్డ్ ఫుడ్స్ తయారీలో అనుమతిని మించిన హానికర రంగుల వాడకం వంటి ముప్పులను వెలికితీశారు. ఈ పరిస్థితులపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసిన టాస్క్ ఫోర్స్ టీం హెడ్ వి. జ్యోతిర్మయి, వెంటనే ఆయా పదార్థాలను ధ్వంసం చేయించారు. ఫుడ్ సేఫ్టీ అథారిటీ చట్టం (FSSAI Act – 2006) ఉల్లంఘనలకు సంబంధించిన నోటీసులు జారీ చేశారు.
అదేవిధంగా, అనుమానాస్పద శాంపిళ్లను సేకరించి హైదరాబాదులోని ప్రభుత్వ ప్రయోగశాలకు పంపారు. వాటి నివేదికల ఆధారంగా కల్తీ నిర్ధారణ అయితే, సంబంధిత హోటల్ యాజమాన్యంపై చట్టరీత్య చర్యలు తీసుకుంటామని అధికారుల వెల్లడించారు.
“ప్రజల ఆరోగ్యాన్ని ముప్పులోకి నెట్టే ఆహార వ్యాపారులు కచ్చితంగా ఫుడ్ సేఫ్టీ నిబంధనలను పాటించాలి. లేకపోతే శిక్షలు తప్పవు. అవసరమైతే సీజ్ చర్యలు కూడా తీసుకుంటాం,” అని వి. జ్యోతిర్మయి హెచ్చరించారు. వ్యాపారులు స్వచ్ఛమైన, కల్తీ లేని ఆహారాన్ని ప్రజలకు అందించాల్సిన బాధ్యత కలిగి ఉండాలని ఆమె సూచించారు. ఈ తనిఖీల్లో అధికారులతో పాటు సిబ్బంది పాల్గొన్నారు.