మున్సిపల్ ఎన్నికల్లో గులాబీకి ఆశించిన మేరకు ఫలితాలు దక్కకపోయినా ఆపార్టినేతలు మాత్రం మేక పోతు గాంభీర్యాన్ని వీడడం లేదు.
వాస్తవంగా మున్సిపల్ ఎన్నికలు బిఆర్ఎస్ పార్టీకి చావు తప్పి కన్నులొట్ట పోయిన విదంగా మారాయి. కాంగ్రేస్ పార్టీపై వ్యతిరేకత పెరిగిందని ఎన్నికల్లో మంచి ఫలితాలు సాధిస్తామని బిఆర్ఎస్ ఏ అవకాశాన్ని వదలకుండా నేతలు గట్టి ప్రయత్నాలే చేసారు కాని అధికార పార్టీ వైపే ప్రజలు మొగ్గు చూపారు.
అయినా తమకు మెరుగైన ఫలితాలు వచ్చాయని బిఆర్ఎస్ నేతలు సర్ది చెప్పుకుంటున్నారు. మంచి ఫలితాలే సాధించామని భవిష్యత్ లో మెరుగైన ఫలితాలు సాధిస్తామని పార్టి వర్కింగ్ ప్రెసిడెంట్ కెటిఆర్ అన్నారు.
పాత లెక్కలు తీసి కెటిఆర్ ముందరేయడం గమనార్హం.
కాంగ్రేస్ పార్టి ప్రతిపక్షంలో ఉండగా 2020లో సాధించిన ఫలితాలకంటే మెరుగైన ఫలితాలు అంటూ చెప్పుకు రావడం కొస మెరుపు.
మున్సిపల్ ఎన్నికల ఫలితాలపై బీఆర్ఎస్ నేత, సిద్దిపేట ఎమ్మెల్యే హరీష్ రావు స్పందించి సోషల్ మీడియా వేదికగా పోస్టు పెట్టారు. అధికార కాంగ్రెస్ పార్టీ అక్రమాలు, దౌర్జన్యాలకు ఎదురొడ్డి కార్పొరేటర్లు, కౌన్సిలర్లుగా గెలిచి సత్తా చాటిన బీఆర్ఎస్ నాయకులందరికీ హృదయపూర్వకంగా శుభాకాంక్షలు చెప్పారు.
మున్సిపల్ ఫలితాలు తెటతెల్లం అయిన తర్వాత హైదరాబాద్లో నిర్వహించిన మీడియా సమావేశంలో కేటీఆర్ గంభీరంగా స్పందించారు. భవిష్యత్లో మెరుగైన ఫలితాలు సాధించేందుకు పార్టీ తరఫున కార్యాచరణ రూపొందిస్తామని తెలిపారు.
మున్సిపల్ ఎన్నికల్లో 700 నుంచి 800 వార్డుల్లో గెలుస్తామని అంచనా వేసినట్లు కేటీఆర్ పేర్కొన్నారు. 15 మున్సిపాలిటీల్లో స్పష్టమైన విజయం సాధించామని, మరో 37 మున్సిపాలిటీల్లో మంచి ఫలితాలతో హంగ్ పరిస్థితి నెలకొన్నట్లు చెప్పారు. కొన్ని ప్రాంతాల్లో రీకౌంటింగ్లు జరిగిన విషయాన్ని ప్రస్తావించారు. గద్వాలలో ఒక వార్డులో నాలుగు సార్లు రీకౌంటింగ్ నిర్వహించారని, వర్ధన్నపేటలో పలుమార్లు రీకౌంటింగ్ చేయడంతో అక్కడ పార్టీ కార్యకర్తలు నిరసన వ్యక్తం చేస్తున్నారని తెలిపారు.
2020లో బీఆర్ఎస్ అధికారంలో ఉన్నప్పుడు జరిగిన మున్సిపల్ ఎన్నికల్లో బీఆర్ఎస్ 122 చోట్ల గెలిచిందని, కాంగ్రెస్ 4, భాజపా 2, ఎంఐఎం 2 స్థానాలు దక్కించుకున్నాయని గుర్తు చేశారు. ప్రస్తుత ఎన్నికల్లో బీఆర్ఎస్ 30 శాతానికి పైగా వార్డులు గెలుచుకుందని చెప్పారు.
కొన్ని చోట్ల కాంగ్రెస్ పార్టీ అధికారుల సహకారంతో విజయం సాధించిందని, డబ్బు మరియు మద్యం పంపిణీ జరిగిందని ఆరోపించారు. అధికార పార్టీ అక్రమాలకు పాల్పడినా బీఆర్ఎస్కు ఓటు వేసిన ప్రజలకు ధన్యవాదాలు తెలిపారు.
సింగరేణి బొగ్గు వ్యవహారంపై స్పందిస్తూ, కేతన్పల్లి మున్సిపాలిటీలో సీపీఐ తమకు మద్దతుగా నిలిచిందని, అక్కడ విజయం సాధించామని తెలిపారు. హంగ్ పరిస్థితి ఉన్న ప్రాంతాల్లో ఛైర్మన్ పదవుల కోసం కాంగ్రెస్ బేరసారాలు ప్రారంభించిందని ఆరోపించారు. సింగరేణిలో జరుగుతున్న అంశాలపై సీపీఐ బీఆర్ఎస్తో కలిసి రావాలని పిలుపునిచ్చారు. కొత్తగూడెం కార్పొరేషన్లో సీపీఐకి మద్దతు ఇస్తామని, ఈ విషయాన్ని సీపీఐ నేత కూనంనేని సాంబశివరావుకు ఫోన్ ద్వారా తెలియజేశానని చెప్పారు.
కాంగ్రెస్, భాజపా రెండూ కలిసి పనిచేస్తున్నాయని ఆరోపించిన కేటీఆర్, ప్రధాన ప్రతిపక్షంగా బీఆర్ఎస్ తన పాత్రను సమర్థవంతంగా నిర్వర్తిస్తున్నదని తెలిపారు. స్థానిక సంస్థల ఎన్నికలు సాధారణంగా అధికార పార్టీకి అనుకూలంగా ఉంటాయని, అయినప్పటికీ ప్రజలు బీఆర్ఎస్కు మద్దతు ఇచ్చారని అన్నారు.
పార్టీ మారిన ఎమ్మెల్యేలపై వ్యాఖ్యానిస్తూ, ప్రభుత్వం మీద నమ్మకం ఉంటే వారితో రాజీనామా చేయించి ఉపఎన్నికలకు వెళ్లాలని సవాలు విసిరారు. ప్రజల్లో అధికార పార్టీపై వ్యతిరేకత ఈ ఎన్నికల ద్వారా స్పష్టమైందని అన్నారు. పనితీరు బాగుంటే ప్రజలు ఆదరిస్తారని, భవిష్యత్లో తటస్థ శక్తులను కలుపుకొని ముందుకు సాగుతామని కేటీఆర్ పేర్కొన్నారు.

