ఎలుకతుర్తిలో జరిగిన బీఆర్ఎస్ రజతోత్సవ సభ ఘనంగా నిర్వహించినప్పటికీ, పార్టీ క్యాడర్లో ఉత్సాహం నింపడంలో విఫలమైందనే చర్చ రాజకీయ వర్గాల్లో జరుగుతోంది. ఈ సభ భారీగా జనసమీకరణతో విజయవంతమైనప్పటికీ, పార్టీ అధినేత కేసీఆర్ ప్రసంగంలో కొత్తదనం లేకపోవడంతో సభ సాధారణంగానే మిగిలిందని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.
ప్రధాన పత్రికల్లో ప్రకటనల కారణంగా సభపై పెద్దగా విమర్శలు రాలేదు. అయితే, సోషల్ మీడియా, వాట్సాప్ గ్రూపులు, స్థానిక డిజిటల్ దినపత్రికల్లో మాత్రం సభలో ఉత్సాహం కొరవడినట్లు వార్తలు వచ్చాయి. కేసీఆర్ ప్రసంగం గతంలోలా ఉర్రూతలూగించేలా కాకుండా, కాగితం చూస్తూ సాదాసీదాగా సాగడం శ్రేణులను నిరాశపరిచింది. గత 16 నెలలుగా ఫామ్హౌస్లోనే ఎక్కువగా గడిపిన కేసీఆర్, ఈ సభ ద్వారా జనంలో జోష్ నింపుతారని నాయకులు, కార్యకర్తలు భారీ అంచనాలు పెట్టుకున్నారు. కానీ, ఆ అంచనాలు నెరవేరలేదని విమర్శలు వ్యక్తమవుతున్నాయి.
పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ సన్నాహక సమావేశాలలో “కాంగ్రెస్ పని ఖతం, ఖేల్ ఖతం, దుకాణం బంద్” అంటూ ఉపన్యాసాలతో ఉత్సాహం నింపే ప్రయత్నం చేశారు. కేసీఆర్ కుమార్తె కవిత “బస్తీమె సవాల్” అంటూ తాను కొంచెం రౌడీ టైప్ అంటూ మాట్లాడారు. కాంగ్రెస్ సర్కార్పై, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిపై మోసం చేశారని ఆరోపణలు గుప్పించారు. అయితే, పదేళ్ల పాటు అధికారంలో ఉండి హామీలను నెరవేర్చకపోవడం, అప్పులు చేయడంపై బీఆర్ఎస్ స్వయంవిమర్శ చేసుకోకుండా కాంగ్రెస్పై నిందలు వేయడం జనాలు సీరియస్ గాతీసుకోవడం లేదన్న విశ్లేషణలు వచ్చాయి.
బీఆర్ఎస్ రజతోత్సవ సభకు కోట్లాది రూపాయలు ఖర్చు చేసి, జనసమీకరణతో కాంగ్రెస్, బీజేపీలను హడలెత్తించాలని కేటీఆర్ నేతృత్వంలో భారీ ఏర్పాట్లు చేశారు. ఇది ముమ్మాటికి బిఆర్ఎస్ మరి ముఖ్యంగా కెసిఆర్ కుటుంబ సభ్యులు తమ తమ భవిష్యత్ మసక బారకుండా నిర్వహించిన జనప్రదర్శన. ఐనప్పటికీ, సభలో జనాల్లో ఉత్సాహం కనిపించలేదు. గతంలో తెలంగాణ ఉద్యమ సమయంలో జరిగిన సభలతో పోలిస్తే, ఈ సభలో పవర్ఫుల్ డైలాగులు, సామెతలు, సెటైర్లు వేసే ఓపిక కెసిఆర్ లో కనిపించ లేదు.
కేసీఆర్ ప్రసంగంలో కొత్తగా చెప్పినదేమీ లేదని, కాంగ్రెస్ ప్రభుత్వంపై ఏకపక్ష విమర్శలు చేయడంతోనే సరిపెట్టారని మేధావులు విమర్శిస్తున్నారు. ప్రజల కోణం నుంచి ఆలోచించి, దిశానిర్దేశం చేసే ప్రసంగం చేసి ఉంటే బాగుండేదని సామాన్య ప్రజలు కూడా అభిప్రాయపడుతున్నారు. ఈ సభ ద్వారా బీఆర్ఎస్ ఆశించిన ఫలితాలు సాధించలేకపోయిందని, పార్టీ ధనబలాన్ని చూపించడమే లక్ష్యంగా సాగిందని స్థానిక డిజిటల్ పత్రికలు విశ్లేషించాయి.
రాజకీయంగా బీఆర్ఎస్ భవిష్యత్తు ఏమిటన్న చర్చ అప్రస్తుతం జనాలు తేల్చుతారు… ….కెటిఆర్ ఒంటి చేతితో నెగ్గి ముఖ్య మంత్రి కావాలనేది దీర్ఘకాలిక వ్యూహం… అందుకు కెసిఆర్ ప్రభ తోడ్పడాలి… …కవిత…విషయం ఆతర్వాత
అయితే ఇవన్ని ఒక ఎత్తు అయితే మరోపక్క సామాన్య జనాలలో మాత్రం ఇక కెసిఆర్ కుటుంబ సభ్యులు మారరా అనే ప్రశ్నలు విపిస్తున్నాయి.
అప్పుడే జనాలు మీడియా తేల్చలేదు. కాని బిఆర్ఎస్ ఇంకా మారాలి..తెలంగాణ సోయితో వ్యవహరించాలి. తెలంగాణ ఉద్యమంలో ప్రజలు లేకుండా తామేమి హీరోలం కాలేదని గ్రహించాలి. తెలంగాణ అస్థిత్వాన్ని పాతరేసి తెలంగాణ ఉద్యమ కారులను చీ కొట్టి దళారులను బ్రోకర్లను వెంటేసుకుని తిరిగే వారికి సత్యం భోదపడాలి అంటూ తెలంగాణ ఉద్యమ కాలం నాటి ఓ సామాన్యుడి అగ్రహం. కెసిఆర్ విషయానికి వస్తే ఆయనకు తెలంగాణ ఉద్యమంలో ప్రజలు ప్రత్యేకస్థానం ఇచ్చారు. పదేళ్ల అధికారం అంధకారంలో కెసిఆర్ అనేక తప్పిదాలు చేశారు. పాలనను కుటుంబ సభ్యుల చేతిలో భద్రంగా పెట్టడం ఘోరాతిఘోరమైన తప్పు. వారసత్వంగా అన్ని దక్కుతాయని విర్రవీగే రాజకీయాలు చేసి బొక్కబోర్లా పడటం తప్ప ఏం మిగల లేదు. ఏ నిమిషానికో గంటకోరోజుకో ప్రజాతీర్పు వెలువడదు. సమయం వచ్చిన సమయంలో లెక్కలు తేలుస్తారు. ప్రజలు జైకొడితేనే నాయకుడు…చీకొడితే ఏం అవుతారో చూశాం…..