ఎక్స్ గ్రేషియోను ₹50,000 నుంచి ₹4 లక్షలకు పెంపు
హైదరాబాద్, మే 2, 2025 – రాష్ట్రంలో పెరుగుతున్న ఎండలు, వడగాలుల నుంచి ప్రజలను రక్షించేందుకు తెలంగాణ ప్రభుత్వం తెలంగాణ స్టేట్ హీట్ వేవ్ యాక్షన్ ప్లాన్ (HAP) 2025ను ప్రకటించింది. రెవెన్యూ, హౌసింగ్, సమాచార పౌర సంబంధాల శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి ఈ ప్లాన్ను విడుదల చేశారు. వడదెబ్బ మరణాల కుటుంబాలకు ఎక్స్ గ్రేషియోను ₹50,000 నుంచి ₹4 లక్షలకు పెంచడంతో పాటు, ప్రజల భద్రత, ఉపశమనం కోసం పలు చర్యలు చేర్చారు.
శుక్రవారం సచివాలయంలో జరిగిన సమీక్షా సమావేశంలో మంత్రి శ్రీనివాసరెడ్డి, 12 శాఖల అధికారులతో చర్చించి, పకడ్బందీ చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. భారత వాతావరణ శాఖ (IMD) జూన్ వరకు అధిక ఉష్ణోగ్రతలు కొనసాగుతాయని హెచ్చరించిన నేపథ్యంలో ఈ చర్యలు తీసుకుంటున్నారు.
హీట్ వేవ్ యాక్షన్ ప్లాన్ ముఖ్యాంశాలు
- చలివేంద్రాలు, సరఫరా: అన్ని ప్రాంతాల్లో చలివేంద్రాలు, మజ్జిగ కేంద్రాలు, ఓఆర్ఎస్ ప్యాకెట్ల సరఫరా ఏర్పాటు. హైదరాబాద్, వరంగల్, ఖమ్మం, మహబూబ్నగర్, నిజామాబాద్, కొత్తగూడెం, మెదక్, కరీంనగర్ వంటి పట్టణాలపై ప్రత్యేక దృష్టి. సీఎస్ఆర్ ద్వారా కంపెనీలు ఈ సరఫరాలో భాగస్వామ్యం కానున్నాయి.
- నోడల్ అధికారుల నియామకం: ప్రతి జిల్లాకు ఒక నోడల్ అధికారిని నియమించారు.
- వడగాలులు రాష్ట్ర విపత్తుగా: గత నెల 15న తెలంగాణ వడగాలులను రాష్ట్ర విపత్తుగా నోటిఫై చేసింది. 612 మండలాల్లో 588 మండలాలు వడగాలుల ప్రభావిత ప్రాంతాలుగా గుర్తించారు.
- ప్రజా చైతన్యం, భద్రత: బస్టాండ్లు, మార్కెట్లు, పర్యాటక కేంద్రాలు, ప్రార్థనా స్థలాల్లో పబ్లిక్ అడ్రస్ సిస్టమ్, ఎల్ఈడీ స్క్రీన్ల ద్వారా జాగ్రత్తల ప్రచారం. షెల్టర్లు, తాగునీరు సదుపాయాలు ఏర్పాటు.
- వైద్య సంసిద్ధత: ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు, ఆసుపత్రుల్లో ఓఆర్ఎస్ ప్యాకెట్లు, కూల్ వార్డులు, ఫైర్ సేఫ్టీ ఆడిట్లు నిర్వహణ.
కార్మికుల సంక్షేమం, పర్యావరణ చర్యలు
అధిక వేడి ప్రాంతాల్లో పనిచేసే కార్మికులకు రెండు బృందాలుగా విభజించి, ఒకటి లేదా రెండు గంటల విశ్రాంతి ఇచ్చే రొటేషన్ విధానం అమలు చేయాలని పరిశ్రమలకు సూచనలు. ఘన వ్యర్ధాల నిర్వహణ కార్మికులకు విశ్రాంతి, తాగునీరు, ఓఆర్ఎస్, నీడ సదుపాయాలు అందుబాటులో ఉంచాలని కార్మిక సంక్షేమ శాఖకు ఆదేశాలు.
పార్కుల వద్ద పక్షులు, వీధి జంతువుల కోసం నీటి సరఫరా ఏర్పాటు చేయనున్నారు. గ్రామీణ ప్రాంతాల్లో క్లోరినేటెడ్ తాగునీరు సరఫరా, అవసరమైన చోట ట్యాంకర్ల ద్వారా నీటి సరఫరా చేయనున్నారు.
బహుళ శాఖల సమన్వయం
తెలంగాణ రాష్ట్ర విపత్తుల నిర్వహణ శాఖ, ఐఎండిల సమన్వయంతో రూపొందిన ఈ ప్లాన్లో నీటిపారుదల, మత్స్య, పశుసంవర్ధక, అటవీ, విద్యుత్, సమాచార శాఖలు పాల్గొన్నాయి. మంత్రి శ్రీనివాసరెడ్డి అన్ని శాఖలకు మార్గదర్శకాలు జారీ చేశారు.
మరణాలకు తక్షణ ఎక్స్ గ్రేషియో
వడగాలుల వల్ల మరణాలు సంభవించిన సందర్భంలో, మానవతాదృక్పథంతో తక్షణ ఎక్స్ గ్రేషియో అందించాలని మంత్రి ఆదేశించారు. “ప్రాణనష్టం జరగకుండా చర్యలు తీసుకుంటాం, అయినా అనుకోని పరిస్థితుల్లో మరణాలు సంభవిస్తే వెంటనే సాయం అందిస్తాం,” అని అన్నారు.
సమావేశంలో పాల్గొన్నవారు
సమావేశంలో విపత్తుల నిర్వహణ ముఖ్య కార్యదర్శి అరవింద్ కుమార్, ప్రణాళికా శాఖ ప్రిన్సిపల్ కార్యదర్శి సందీప్ కుమార్ సుల్తానియా, ఫైర్ సేఫ్టీ డీజీ నాగిరెడ్డి, ఐ&పిఆర్ కమీషనర్ వినయ్ కుమార్ రెడ్డి, నీటిపారుదల, పంచాయితీరాజ్, గిరిజన సంక్షేమ, మున్సిపల్ శాఖల అధికారులు, తెలంగాణ ఐఎండి విభాగాధిపతి డాక్టర్ నాగరత్న తదితరులు పాల్గొన్నారు.
అధిక ఉష్ణోగ్రతల నేపథ్యంలో, తెలంగాణ ప్రభుత్వం ఈ చర్యలతో వడగాలుల ప్రభావాన్ని తగ్గించి, ప్రజల భద్రతను కాపాడాలని లక్ష్యంగా పెట్టుకుంది.