Operation KAGAR must be stopped immediately ఆపరేషన్ కగార్ తక్షణం నిలిపివేయాలి

గత 10 సంవత్సరాలుగా మధ్య భారతదేశంలోని ఆదివాసులపై దాడులు చేస్తూ నక్సలైట్ల అణచివేత పేరుతో ఆదివాసీ ప్రజలను అణచి వేస్తున్న కేంద్ర ప్రభుత్వం గత సంవత్సర కాలం నుండి ఆపరేషన్ కగార్ పేరుతో కొనసాగిస్తున్న మారణకాండను వెంటనే నిలిపివేయాలని ఆదివాసీ, దళిత, ప్రజా సంఘాలు డిమాండ్ చేశారు. ములుగు జిల్లా కేంద్రంలో వివిధ ప్రజా సంఘాల ఆధ్వర్యంలో బుధవారం జరిగిన భారీ శాంతి ర్యాలీ చేసిన అనంతరం ప్రజా సంఘాల నాయకులు సోమ రామమూర్తి, జైసింగ్ రాథోడ్, సిద్ధబోయిన లక్ష్మీనారాయణ, సాయిని నరేందర్, పోరిక ఉదయ్ సింగ్ నాయక్, ముంజాల బిక్షపతి, వట్టం ఉపేందర్, బొట్ల బిక్షపతి లు తెలంగాణ పంచాయతీ రాజ్ మంత్రి సీతక్క ద్వారా కేంద్ర ప్రభుత్వానికి ఇచ్చిన వినతి పత్రంలో ఆపరేషన్ కగార్ ను వెంటనే నిలిపివేయాలని, మావోయిస్టులతో శాంతి చర్చలు జరపాలని డిమాండ్ చేశారు. 

మావోయిస్టులపై దాడుల పేరుతో మధ్య భారతదేశంలోని ఆదివాసీ చట్టాలను ఉల్లంఘించి వేలాది మంది అమాయక ఆదివాసీలను చంపేశారని, కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షా ఆపరేషన్ కగార్ పేరుతో మార్చి 2026 వరకు మావోయిస్టులను అంతమొందిస్తామని ప్రకటించి ఆదివాసీలపై మారణహోమాన్ని కొనసాగించడం దుర్మార్గమని పేర్కొన్నారు. భారతదేశాన్ని ఇతర దేశాల నుండి రక్షించడానికి నియమించబడిన మిలటరీని స్వంత ప్రజలను చంపడానికి ఉపయోగించడం కేంద్ర ప్రభుత్వ హేయమైన చర్య అని అన్నారు.  మధ్య భారతంలోని కేంద్ర బలగాలను వెంటనే వెనక్కి తీసుకొని మావోస్టులతో  శాంతి చర్చలు జరపాలని వారు డిమాండ్ చేశారు. కేంద్ర ప్రభుత్వం మావోయిస్టులతో చేయవలసిన శాంతి చర్చలకు రాష్ట్ర మంత్రి సీతక్క చొరవ తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు. 
ములుగు జిల్లా కేంద్రం డి ఎల్ ఆర్ ఫంక్షన్ హాల్ నిండి ప్రారంభమైన శాంతి ర్యాలీకి ములుగు, భూపాలపల్లి,  మహబూబాబాద్ జిల్లాల నుండి పెద్ద ఎత్తున తరలివచ్చిన ఆదివాసులు జిల్లా కేంద్రంలో నిర్వహించిన ర్యాలీలో కగార్ హటావో - బస్తర్ బచావో, ఆదివాసీ బచావో - కగార్ హటావో, శాంతి చర్చలు జరపాలి, ఆదివాసీలను కాపాడాలని, సహజ వనరులను కాపాడాలని, భారత్ లో శాంతిని నెలకొల్పాలని నినాదాలు చేశారు.
ఈ కార్యక్రమంలో రాజారపు భాస్కర్, పాయం అనిత, కొమరం సమంత, గంటమూరి భాగ్యలక్ష్మి, ఆలం కిషోర్, ధబ్బకట్ల శ్రీకాంత్, కొప్పుల రవి, లకావత్ కరుణాకర్, సమ్మయ్య రాథోడ్, శంకర్ నాయక్, పాలకుర్తి పాపయ్య, లచ్చు పటేల్, గట్ల రాజయ్య, సిద్ధబోయిన శ్రీకాంత్, పాలకుర్తి తిరుపతి తదితరులు పాల్గొన్నారు

ఆపరేషన్ కగార్ నిలిపి వేయాలని ములుగులో ప్రజాసంఘాలర్యాలి

Share this post

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

IN ARTICLE