(అచ్యుత రఘునాధ్)
ఫైనాన్స్ కంపెనీల వేధింపులపై కోర్టు కొరడా…!
రికవరీ ఏజెంట్లకు షాక్..!!
పిల్లలు, మహిళల ముందే బెదిరింపులకు చెక్..!!!
*
శారీరక,మానసిక వేధింపులకు బ్రేక్..!!!!*
లోన్ యాప్స్.. క్రెడిట్ కార్డ్స్.. వ్యక్తిగత… హౌజింగ్ రుణదారులకు ఊరట…!!!!!
హన్మకొండ, మే 1: సమాజంలో పుట్టగొడుగుల్లా మారిన ఫైనాన్స్ కంపెనీల వేధింపులకు తాజాగా చెక్ పడింది.. స్వయంగా కోర్టు ఈ అంశంపై బాధితులకు రక్షణ కల్పించి దాడులకు పాల్పడేవారిపై కొరడా ఝులిపించింది…రికవరీ ఏజెంట్లకు షాక్ ఇస్తూ..పిల్లలు, మహిళల ముందే కొనసాగుతున్న బెదిరింపులకు బ్రేక్ వేసింది…రుణ గ్రహీతలకు రక్షణ కల్పించడమే కాక.. వారిని శారీరక, మానసిక వేధింపులకు గురిచేయడం నిలిపివేయాలని హన్మకొండ మూడవ అదనపు కోర్టు బుధవారం ఆదేశాలు ఇవ్వడం విశేషం. ఈ సందర్భంగా, గృహ రుణాలు, వ్యక్తిగత, యాప్ లోన్లు, క్రెడిట్ కార్డ్ బకాయిల చెల్లింపులకు సంబంధించి ఇకపై వేధింపులను నిలిపివేయాల్సిందే అనడం బకాయిదారులకు ఊరట కలిగించనుంది.
ఇక ఈ తాజా సంఘటన
వివరాల్లోకి వెళితే పలు ఆసక్తికరమైన అంశాలు వెలుగు చూశాయి….
అప్పు తీసుకున్నందుకు ఫైనాన్స్ కంపెనీలు ఇష్టానుసారంగా దుర్భాషలాడుతూ, అమాయకుల కుటుంబాలపై వేధింపులకు పాల్పడుతున్న మూడు కంపెనీల మీద హన్మకొండ అదనపు జూనియర్ సివిల్ జడ్జ్ ఆగ్రహం వ్యక్తం చేశారు. బచ్చలకూరి సురేష్ జెఎం హోం లోన్స్, ఈక్విటాస్ స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్ లిమిటేడ్, కొటక్ మహింద్రా బ్యాంక్ ల నుండి హోంలోను, వ్యక్తిగత అప్పు, క్రెడిట్ కార్డ్ వంటి రుణాలు తీసుకున్నాడు. అయితే బకాయిలు వసూలు చేసే నెపంతో రికవరీ ఏజెంట్లు ఇంట్లోని మహిళలు, చిన్నపిల్లల ముందు దుర్భాషలాడుతూ వేధింపులకు పాల్పడడం పెరగడంతో భరించలేక తన కుటుంబాన్ని రోడ్ పై వేసి హింసిస్తున్నారంటూ ఇలా వేధింపులకు పాల్పడుతున్నారని, తనను రక్షించాలని ఈ మేరకు హన్మకొండ జిల్లా ధర్మసాగర్ మండలం కరుణాపురం కు చెందిన బచ్చలకూరి సురేష్ కోర్టును ఆశ్రయించాడు. బాధితుని తరఫున న్యాయవాది ఉప్పరి శంకర్ ఫైనాన్స్ కంపెనీలు ఆర్బీఐ నిబంధనలకు విరుద్ధంగా రికవరీ ఏజెంట్లతో తీవ్రమైన ఒత్తిడిని పెడుతున్నాయని, వారి కుటుంబాలకు రక్షణ లేకుండా పోయిందని వాదించారు. ఇలా శారీరక మానసిక హింసకు గురి చేస్తున్నాయని కోర్టు దృష్టికి తెచ్చారు. ఈ సమస్యను ఆసాంతం విన్న న్యాయమూర్తి ప్రియాంక సిరిసిల్ల ఫైనాన్స్ బ్యాంకులు వేధింపులను నిలిపివేయాలని బాధితుడు బచ్చలకూరి సురేష్ తరపున మధ్యంతర ఉత్తర్వులను జారీ చేశారు. ఫైనాన్స్ కంపెనీలు బాధితులను ఇబ్బంధి పెట్టకూడదని, బాధితుల వ్యక్తిగత జీవితంలో, వ్యాపార సంబంధిత విషయాలలో ఎలాంటి ఆటంకాలు కలిగించరాదని మధ్యంతర స్టే ఇస్తూ ఆదేశాలు జారీ చేసింది.
ఈ ఉత్తర్వులు పెరిగిపోయిన యాప్ లోన్లవేధింపుదారులకు, ప్రైవేట్ బ్యాంకులు, ఫైనాన్స్ కంపెనీలు, క్రెడిట్ కార్డ్స్ జారీ చేసే వారికి షాక్ తగిలేలా చేశాయి.