తెలంగాణపై కేంద్రం ఆర్థిక వివక్ష -తుమ్మల నాగేశ్వరరావు

thummala nageshwar rao

 

దేశానికి అధికంగా ఆదాయం సమకూర్చుతున్న దక్షిణాది రాష్ట్రాలు నేటి కేంద్ర ఆర్థిక విధానాల వల్ల అన్యాయానికి గురవుతున్నాయని, ఇది కేవలం ఆర్థిక వివక్షే కాదు… రాజకీయ ఉద్దేశంతో కూడిన వివక్ష అని తెలంగాణ రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు తీవ్రంగా విమర్శించారు.

“వికసిత్ భారత్” అనే నినాదం ఇస్తూ దేశ అభివృద్ధి గురించి గొప్పలు చెప్పుకుంటున్న కేంద్ర ప్రభుత్వం, దక్షిణాది రాష్ట్రాల పట్ల ముఖ్యంగా తెలంగాణ విషయంలో స్పష్టమైన వివక్ష, నిర్లక్ష్యాన్ని కొనసాగిస్తోందని అన్నారు. 

దేశ ఆదాయానికి దక్షిణాది వెన్నెముక…

2018–19 నుంచి 2022–23 వరకు ఐదేళ్ల కాలంలో దేశవ్యాప్తంగా కేంద్ర ప్రభుత్వం వసూలు చేసిన మొత్తం పన్నులు రూ.90.80 లక్షల కోట్లు అయితే, ఇందులో దక్షిణాది రాష్ట్రాల నుండే పావుభాగానికి పైగా రూ. 22.86 లక్షల కోట్లు వచ్చాయన్నారు. అయినప్పటికీ, ఈ స్థాయిలో ఆదాయం ఇచ్చిన దక్షిణాది రాష్ట్రాలకు కేంద్రం తిరిగి ఇచ్చిన నిధులు మాత్రం కేవలం 16.3 శాతం మాత్రమేనని గణాంకాలు చెబుతున్నాయి. ఇది ఆర్థిక సమాఖ్య స్ఫూర్తికి పూర్తి విరుద్ధం అని మంత్రి వ్యాఖ్యానించారు.

పన్నులు చెల్లించిన ప్రతి రూపాయికి తిరిగి వచ్చే నిధులను పోల్చితే కేంద్రం పాటిస్తున్న ద్వంద్వ వైఖరి బయటపడుతుందని మంత్రి తెలిపారు. దక్షిణాది రాష్ట్రాలకు రూపాయికి సగటున 30 పైసలు ఇస్తూ, ఇదే సమయంలో బీహార్, ఉత్తరప్రదేశ్ లాంటి ఉత్తరాది రాష్ట్రాలకు రూ.1కి రూ.4 చొప్పున ఇస్తున్నారని, ఇది ఆర్థిక అసమతుల్యతను పెంచడమే కాకుండా, ఉత్తర, దక్షిణాది రాష్ట్రాల మధ్య విభేదాలను సృష్టించే ప్రమాదకర ధోరణి అని హెచ్చరించారు.

“ఎక్కువ పన్నులు చెల్లించే రాష్ట్రాలను శిక్షించడం, తక్కువ వసూళ్లు చేసే రాష్ట్రాలను ప్రోత్సహించడం కేంద్ర విధానంగా మారింది” అని మంత్రి ఆరోపించారు. కేంద్రం చెప్పుకునే వికసిత్ భారత్ విధానం అంటే ఇదేనా అని మంత్రి ప్రశ్నించారు. 

తెలంగాణ గణాంకాలే సాక్ష్యం….

డిసెంబర్ లో జరిగిన పార్లమెంట్ సమావేశాలలో అడిగిన ప్రశ్నకు సమాధానంగా 2024-25 లో తెలంగాణ రాష్ట్రం నుండి 1,33,208 కోట్ల పన్నులు వసూలు అయితే.. కేంద్రం నుండి రాష్ట్రానికి కేంద్ర పన్నుల రూపంలో 27,050 కోట్లు, కేంద్ర గ్రాంట్ల రూపంలో 7,913 కోట్లు, కేంద్ర ప్రాయోజిక పథకాల రూపంలో 16,762 కోట్లు మొత్తంగా 51,725 కోట్లు విడుదల చేసినట్టు పార్లమెంట్ సాక్షిగా కేంద్ర మంత్రి సమాధానం చెప్పారని ఈ సందర్భంగా మంత్రి వివరించారు. “పథకాల రూపంలో వచ్చిన నిధులను కూడా కలిపితేనే ఈ మొత్తం వస్తోంది. స్వేచ్ఛగా వినియోగించుకునే నిధులు మాత్రం మరింత తక్కువ” అని మంత్రి వివరించారు. 

జీఎస్టీతో మొదలైన దెబ్బ… గ్రాంట్ల కోతతో కొనసాగింపు…

జీఎస్టీ సవరణల కారణంగా తెలంగాణ రాష్ట్రం ఇప్పటికే ఏడాదికి సుమారు రూ.8 వేల కోట్లు నష్టపోతోందని మంత్రి తెలిపారు. ఇక 15వ ఆర్థిక సంఘం సూచించిన రెవెన్యూ లోటు గ్రాంట్లను 16వ ఆర్థిక సంఘం పూర్తిగా పక్కన పెట్టడంతో రాష్ట్రాల ఆర్థిక స్వాతంత్య్రం దెబ్బతిన్నదని విమర్శించారు. రంగాలవారీగా, రాష్ట్రాల ప్రత్యేక గ్రాంట్లకు కత్తెర పెట్టడం వల్ల తెలంగాణకు మరో రూ.5 వేల కోట్ల వరకు నష్టం వాటిల్లే ప్రమాదం ఉందన్నారు.

ఇది ఆర్థిక సమస్య కాదు… రాజకీయ నిర్ణయం…

“ఇది కేవలం లెక్కల విషయం కాదు. ఇది కేంద్రంలో ఉన్న పాలకుల రాజకీయ ఆలోచనల ఫలితం. బలమైన రాష్ట్రాలను బలహీనపరచి, ఆర్థికంగా ఆధారపడేలా చేయాలనే ఉద్దేశమే కనిపిస్తోంది” అని తుమ్మల నాగేశ్వరరావు విమర్శించారు. దక్షిణాది రాష్ట్రాలలో బిజెపి పార్టీ అస్థిత్వాన్ని నిలబెట్టుకోవాలనే ఉద్ధేశ్యంతోనే దక్షిణాది రాష్ట్రాలకు ముఖ్యంగా తాము అధికారంలో లేని రాష్ట్రాలకు తక్కువ నిధులు విడుదల చేసి, వారి కుంచిత స్వభావాన్ని చూపెడుతున్నారని అన్నారు. 

ఫెడరల్ వ్యవస్థను కాపాడాల్సిన అవసరం…

ఫెడరల్ వ్యవస్థలో రాష్ట్రాలు భాగస్వాములే కాని, కేంద్రం దయాధర్మాలపై ఆధారపడేవి కావని మంత్రిగారు స్పష్టం చేశారు. దేశ సమగ్ర అభివృద్ధి సాధించాలన్న, కేంద్రం చెప్పుకుంటున్న వికసిత్ భారత్ లక్ష్యాన్ని చేరుకోవాలన్నా, అన్ని రాష్ట్రాలకు సమన్యాయం జరగాలని, ముఖ్యంగా ఆదాయం సమకూర్చే రాష్ట్రాలపై వివక్ష మానుకోవాలని ఈ సందర్భంగా కేంద్రాన్ని మంత్రి కోరారు.

”తెలంగాణ రాష్ట్రం నుండి ప్రాతినిధ్యం వహించే బిజెపి ఎంపీలు మరియు కేంద్ర మంత్రులు కూడా తెలంగాణకు జరుగుతున్న అన్యాయాన్ని పదేళ్లలో ఏనాడు ప్రశ్నించకపోగా, రాష్ట్రానికి అన్ని తెచ్చాం, ఇన్ని చేశాం, రాష్ట్ర ఖజానాకు కేంద్రమే పూర్తి నిధులు సమకూరుస్తుందనట్లు మాట్లాడటం వారి పతనానికి నాంది. జాతీయ రహదారుల నిర్మాణాలను కూడా రాష్ట్రానికి విడుదల చేసే నిధుల ఖాతాలలో వేస్తున్న ఈ నాయకులు, వాటిని నిర్మించి మళ్లీ ప్రజల నుండే టోల్ చార్జీల రూపంలో వసూలు చేస్తున్న విషయాన్ని మరిచారా అని మంత్రి ప్రశ్నించారు. 

ముఖ్యంగా తెలంగాణ ప్రభుత్వం రైతుల సంక్షేమం కోసం రుణమాఫీ, రైతు భరోసా, పంట కొనుగోళ్లు, సాగునీటి ప్రాజెక్టులు, ఉచిత విద్యుత్ వంటి పథకాలతో భారీగా ఖర్చు చేస్తోందని, కానీ కేంద్రం నుంచి రావాల్సిన న్యాయమైన వాటా రాకపోవడం రాష్ట్ర ఆర్థికాభివృద్ధికి అడ్డంకిగా మారుతోందని మంత్రి అన్నారు. తెలంగాణ ప్రభుత్వం ఈ యూనియన్ బడ్జెట్ లో చేర్చాల్సిందిగా చేసిన ప్రతిపాదనలలో ఒక్కటి కూడా మంజూరు చేయలేదని, ఇప్పటికైనా తెలంగాణను రాజకీయంగా శిక్షించే బడ్జెట్‌లు ఇక మానుకోని, ఫెడరలిజాన్ని గౌరవించి, తెలంగాణకు న్యాయమైన వాటా ఇవ్వాలని, లేకపోతే “వికసిత్ భారత్” ఒక నినాదంగానే మిగిలిపోతుందని, నిజమైన అభివృద్ధి సాధ్యం కాదని మంత్రి స్పష్టం చేశారు. ఈ విషయంలో రాష్ట్రం నుండి ప్రాతినిధ్యం వహిస్తున్న బిజెపి నాయకులు కూడా తెలంగాణకు రావాల్సిన న్యాయబద్దమైన వాటాకోసం కేంద్రంతో పోరాడటానికి మాతో కలిసి రావాలని మంత్రి కోరారు.

Share this post

One thought on “తెలంగాణపై కేంద్రం ఆర్థిక వివక్ష -తుమ్మల నాగేశ్వరరావు

  1. I think this is one of the most important information for me. And i am glad reading your article. But should remark on some general things, The website style is perfect, the articles is really excellent :D. Good job, cheers

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

IN ARTICLE

Trending Global

ఇరాన్ పై ఇండియా వైఖరిలో ఎందుకు మార్పు వచ్చింది
మడ్ ఫెస్టివల్స్ ఎందుకు జరుపుకుంటారు ?
అమెరికాలో రోడ్డు ప్రమాదంలో చనిపోయిన జాహ్నవి కందుల కుటుంబానికి 262 కోట్ల పరిహారం
సొంత జన్యువులతో ‘సూపర్ రేస్’ -బట్టబయలైన జెఫ్రీ ఎఫ్ స్టీన్ రహస్యం