కిట్స్ వరంగల్ అధ్యాపకునికి పీహెచ్డీ ప్రదానం
వరంగల్:
కాకతీయ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ అండ్ సైన్స్, వరంగల్ (KITSW) లోని కంప్యూటర్ సైన్స్ అండ్ ఇంజినీరింగ్ (CSE) విభాగంలో అసిస్టెంట్ ప్రొఫెసర్గా పనిచేస్తున్న దుంపేటి నవీన్ కుమార్ కు ఉస్మానియా యూనివర్సిటీ, హైదరాబాద్ ద్వారా డాక్టరేట్ (పీహెచ్డీ) డిగ్రీ లభించినట్లు కిట్స్ వరంగల్ ప్రిన్సిపల్ ప్రొఫెసర్ కె. అశోక్ రెడ్డి పత్రికా ప్రకటనలో తెలిపారు.
నవీన్ కుమార్ తన పరిశోధనను “Private Blockchain Framework for Educational Certificate Management and Fraud Prevention” అనే అంశంపై సమర్పించారని తెలిపారు. ఈ పరిశోధనను ఉస్మానియా యూనివర్సిటీకి అనుబంధంగా ఉన్న సీబీఐటీ కళాశాలలో ఏఐ & డేటా సైన్స్ విభాగాధిపతి డాక్టర్ కె. రాధిక పర్యవేక్షణలో నిర్వహించారు.
ఈ పరిశోధనలో హైపర్లెడ్జర్ ఫాబ్రిక్ ఆధారిత హైబ్రిడ్ పర్మిషన్డ్ బ్లాక్చెయిన్ ఫ్రేమ్వర్క్ ను అభివృద్ధి చేసి, విద్యాసర్టిఫికెట్లను సురక్షితంగా జారీ చేయడం, భద్రపరచడం, తక్షణమే ధృవీకరించేందుకు మార్గం చూపించారు. బ్లాక్చెయిన్ టెక్నాలజీతో పాటు IoT ఆధారిత బయోమెట్రిక్ ప్రమాణీకరణ, QR కోడ్ వెరిఫికేషన్, డిజిటల్ సంతకాలు, కౌచ్డీబీ వంటి ఆధునిక సాంకేతికతలను ఈ వ్యవస్థలో సమన్వయం చేశారు.
సాంప్రదాయ కేంద్రికృత సర్టిఫికెట్ నిర్వహణ విధానాల్లో ఉండే డేటా మార్పిడి, ఒక్క కేంద్రంపై ఆధారపడటం, ధృవీకరణలో ఆలస్యం, పారదర్శకత లోపం వంటి సమస్యలకు ఈ పరిశోధన పరిష్కారం చూపింది. అపాచీ జేమీటర్ ద్వారా నిర్వహించిన పనితీరు పరీక్షల్లో ఈ వ్యవస్థ అధిక సామర్థ్యం, తక్కువ లోపాల శాతం, మెరుగైన మెమరీ వినియోగంతో ఇతర విధానాలను మించి పనిచేసినట్లు వెల్లడైంది.
పరిశోధన కాలంలో నవీన్ కుమార్ జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో పేరొందిన జర్నల్స్ మరియు కాన్ఫరెన్సుల్లో అనేక పరిశోధనా పత్రాలు ప్రచురించి, బ్లాక్చెయిన్ టెక్నాలజీ మరియు సైబర్ సెక్యూరిటీ రంగాలకు విశేష సేవలు అందించారు.
ఈ సందర్భంగా మాజీ రాజ్యసభ సభ్యుడు, కిట్స్ చైర్మన్ కెప్టెన్ వి. లక్ష్మీకాంత రావు, కోశాధికారి పి. నారాయణ రెడ్డి, మాజీ ఎమ్మెల్యే, అదనపు కార్యదర్శి వొడితల సతీష్ కుమార్, ఎకశిలా ఎడ్యుకేషన్ సొసైటీ సభ్యుడు అల్లూరి సత్యనారాయణ రాజు, అలాగే ప్రిన్సిపల్ ప్రొఫెసర్ కె. అశోక్ రెడ్డి నవీన్ కుమార్ను అభినందించారు.
అదేవిధంగా అకాడమిక్ డీన్ ప్రొఫెసర్ కె. వేణుమాధవ్, రిజిస్ట్రార్ ప్రొఫెసర్ ఎం. కోమల్ రెడ్డి, అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్ ప్రొఫెసర్ పి. రమేష్ రెడ్డి, CSE విభాగాధిపతి డాక్టర్ పి. నిరంజన్, అన్ని విభాగాల డీన్లు, అధ్యాపకులు, సిబ్బంది మరియు కెమిస్ట్రీ అసోసియేట్ ప్రొఫెసర్, పీఆర్వో డాక్టర్ డి. ప్రభాకర చారి అభినందనలు తెలిపారు.

