ములుగు జిల్లా కేంద్రంలో 4.80 కోట్లతో
నూతన ఆర్టీసీ బస్ స్టేషన్ కి శంకుస్థాపన చేసిన మంత్రులు
ములుగు ప్రజల దశాబ్దాల కల నెరవేర్చాం.
గ్రామ గ్రామానికి రవాణా సౌకర్యం కల్పించాం.
హైటెక్ తరహాలో ఆరు నెలలో బస్టాండ్ ఏర్పాటు చేయడానికి చర్యలు.
ప్రజల అభిప్రాయం మేరకే ప్రజా పాలన కొనసాగింపు.
రాష్ట్ర రోడ్డు రవాణా, బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్.
ములుగు జిల్లా కేంద్రంలో 4.80 కోట్లతో నూతన ఆర్టీసీ బస్ స్టేషన్ కి శంకుస్థాపన చేసిన మంత్రులు పొన్నం ప్రభాకర్, సీతక్క..

**
ములుగు జిల్లా ప్రజల దశాబ్దాల కళ జిల్లా కేంద్రంలో నూతన బస్టాండ్ ఏర్పాటుతో నెరవేర్చబోతున్నామని, హైటెక్ తరహాలో నూతన బస్టాండ్ ను ఆరు నెలల లోపు పూర్తి చేసి ప్రారంభించడం జరుగుతుందని రాష్ట్ర రోడ్డు రవాణా శాఖ, బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ అన్నారు.
రాష్ట్రంలోని గ్రామీణ ప్రాంతాలన్నింటికీ బస్సు సౌకర్యం ఏర్పాటు చేసి ప్రజలకు ఇబ్బంది కలగకుండా చర్యలు తీసుకున్నామని వివరించారు.
ఆదివారం జిల్లా కేంద్రంలో , రాష్ట్ర పంచాయితి రాజ్, గ్రామీణ అభివృద్ధి, గ్రామీణ నీటి సరఫరా, మహిళా, శిశు సంక్షేమ శాఖ మంత్రి ధనసరి అనసూయ సీతక్క, జిల్లా కలెక్టర్ దివాకర టి.ఎస్. లతో కలిసి నాలుగు కోట్ల 80 లక్షల రూపాయలతో చేపట్టనున్న నూతన బస్టాండ్ నిర్మాణ పనులకు మంత్రి పొన్నం ప్రభాకర్ శంకుస్థాపన చేశారు.
జిల్లాకు చేరుకున్న మంత్రి పొన్నం ప్రభాకర్ కు మంత్రి సీతక్క, జిల్లా కలెక్టర్ దివాకర టి.ఎస్, జిల్లా ఎస్పీ డాక్టర్ శబరీష్, ఘనంగా స్వాగతం పలికారు.
అనంతరం గట్టమ్మ వద్ద ప్రత్యేక పూజలు నిర్వహించిన మంత్రులు భారీ ర్యాలీగా జిల్లా కేంద్రానికి చేరుకోగా అభిమానులు గజమాలతో స్వాగతం పలికారు.
ఈ సందర్భంగా మంత్రి పొన్నం ప్రభాకర్ మాట్లాడుతూ రాష్ట్రంలోని ప్రజల అభిప్రాయం మేరకే ప్రజా పాలన ప్రభుత్వం అనేక పథకాలను ప్రవేశపెడుతుందని, తాము ఇచ్చిన హామీలను కాకుండా నూతన పథకాలను అమలు చేస్తున్నామని తెలిపారు. జిల్లా కేంద్రంలోని బస్టాండ్ 1989 లో నిర్మించగా ప్రస్తుతం బస్టాండ్ పరిస్థితి బాగాలేదని సోదరీమణి సీతక్క తెలుపగానే నూతన బస్టాండ్ నిర్మాణానికి నిధులు కేటాయించామని, మంగపేట మండలంలో 50 లక్షల రూపాయలతో నూతన బస్టాండ్ నిర్మాణ పనులు పూర్తి అవుతున్నాయని అన్నారు. రానున్న రోజులలో మంగపేట మండల కేంద్రంలోని నూతన బస్టాండును ప్రారంభించడమే కాకుండా ఏటూరు నాగారం మండల కేంద్రంలో ఏడు కోట్ల రూపాయలతో చేపట్టనున్న బస్ డిపో పనులకు శంకుస్థాపన చేయడం జరుగుతుందని వివరించారు. జిల్లా కేంద్రానికి సమీపంలోని ప్రేమనగర్ వద్ద గిరిజన యూనివర్సిటీ, సమీకృత కలెక్టరేట్ కార్యాలయం, వైద్య కళాశాల ఉన్న కారణంగా ఎకరం స్థలంలో 45 లక్షల రూపాయలతో నూతన బస్టాండ్ నిర్మాణ పనులను చేపట్టడం జరుగుతుందని హామీ ఇచ్చారు. మహిళలను ఆర్థికంగా బలోపితం చేయడానికి మహిళా సంఘాల వారిచే 600 బస్సులను కొనుగోలు చేసి బస్సు యజమానులుగా చేశామని, ములుగులో చేపట్టనున్న నూతన బస్టాండ్ నిర్మాణ పనులను చేపట్టిన ప్రగతిని ప్రతినెల అందించాలని సంబంధిత అధికారులను ఆదేశించారు. దేశంలోనే తెలంగాణను రోల్ మోడల్ గా తీర్చిదిద్దడానికి ముఖ్యమంత్రి ఏనుముల రేవంత్ రెడ్డి చర్యలు తీసుకుంటున్నారని, రాష్ట్రంలో తాము కుల గణన చేయడంతోనే కేంద్ర ప్రభుత్వం దిగివచ్చి దేశవ్యాప్తంగా కులగనన చేయడానికి ముందుకు వచ్చిందని, దీనిపై కేంద్ర మంత్రులు రాద్ధాంతం చేయడం విడ్డూరంగా ఉందని విమర్శించారు. ములుగు నియోజకవర్గాన్ని అన్ని విధాలుగా అభివృద్ధి చేయడానికి మంత్రి సీతక్క చొరవ చూపడం అర్శించదగ్గ విషయమని కొనియాడారు.
ఈ సందర్భంగా మంత్రి సీతక్క మాట్లాడుతూ ములుగు ప్రాంతం ఒకప్పుడు గ్రామీణ ప్రాంతంగా అనంతరం మండల ప్రాంతంగా జిల్లా ప్రాంతంగా ఏర్పడిన అనంతరం ములుగు గ్రామపంచాయతీని మున్సిపాలిటీగా ప్రభుత్వం గెజిటెడ్ నోటిఫికేషన్ విడుదల చేసిందని, ములుగు జిల్లాలో పలు ప్రాంతాలలో నూతన బస్టాండ్ నిర్మాణ పనులు చేయడానికి నిధులు కేటాయించిన మంత్రి పొన్నం ప్రభాకర్ కు కృతజ్ఞతలు తెలిపారు. బీసీ సంక్షేమ శాఖ మంత్రి నేడు రాష్ట్రంలో బీసీల పాలిట దేవుడు గా మారి 42 శాతం రిజర్వేషన్ సాధించడం గొప్ప విషయమని, జిల్లా కైంద్రాన్ని రోల్ మాడల్ గా తీర్చిదిద్దడానికి రానున్న రోజులలో సమావేశాలు నిర్వహించడం జరుగుతుందని అన్నారు. ములుగు ప్రాంతం పర్యాటక ప్రాంతంగా మారడంతో ఎలాంటి పనులకైనా రాష్ట్ర ముఖ్యమంత్రి ఏనుముల రేవంత్ రెడ్డి నిధులు కేటాయిస్తున్నారని, మిస్ వరల్డ్ కార్యక్రమంలో భాగంగా సుందరిమణులు రామప్పను సందర్శించనున్న దృశ్య ప్రత్యేక ఏర్పాట్లు చేస్తున్నామని వివరించారు. నూతన బస్టాండు నిర్మాణంతో ప్రయాణికుల ఇబ్బందులు తొలగిపోనున్నాయని హర్షం వ్యక్తం చేశారు.
ఈ కార్యక్రమంలో జిల్లా గ్రంథాలయ చైర్మన్ బానోతు రవిచందర్, ఆర్టీసీ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ సాల్మన్ రాజ్, డిప్యూటీ ఆర్ ఎం ఓ భాను కిరణ్, జిల్లా కాంగ్రేస్ పార్టి అధ్యక్షులు పోగాకుల అశోక్ ,
ఆర్డీవో వెంకటేష్, ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ భాస్కర్, డిపో మేనేజర్లు జ్యోత్స్న,
రవి చందర్, ప్రజా ప్రతినిధులు, సంబంధిత అధికారులు, తదితరులు పాల్గొన్నారు.