భూతల నరకం …..బెట్టింగ్ యాప్స్
బెట్టింగ్ యాప్ లు………. మన కింకర్తవ్యం
డ్రగ్స్ మహమ్మారి లాగే యువతరాన్ని అత్యంత వేగంగా కబళిస్తున్న మరోభూతం బెట్ట్ంగ్ యాప్. ఈయాప్ ల మాయలో పడితే ఇకబైటపడటం కష్టం. డబ్బులపై ఆశ అందరికి ఉంటింది. యాప్స్ మాయలో పడి యువత పూర్తిగా అటు తమకుటుంబాలకు ఇటు సమాజానికి పనికి రాకుండా అవుతున్నారు. యాప్స్ ప్రమోట్ చేసే సెలబ్రెటీలు… ఈమద్య కొత్తగా నెట్టింట అవతారమెత్తిన సోషల్ మీడియా ఇన్ ఫ్లూయెన్సర్స్ …లక్షల కోట్ల రూపాయలతో యాప్స్ నిర్వహిస్తున్న బడాకార్పోరేటర్లు మొత్తంగా యువతరాన్ని చిత్తు చిత్తుచేస్తున్నాయి.
బెట్టింగ్ యాప్స్ భూతం: ఒక్క క్లిక్తో కోట్లు సంపాదించవచ్చని ఆశపెడుతూ, ఆకర్షణీయమైన యాడ్స్తో యువతను ఆకట్టుకుంటున్న బెట్టింగ్ యాప్స్ తెలుగు రాష్ట్రాల్లో
యువత భవిష్యత్ సర్వం నాశనం చేస్తున్నాయి. ఆన్లైన్ బెట్టింగ్ యాప్స్ యువతను ఎలా ఆకర్షిస్తున్నాయి? వీటి వల్ల వారి జీవితాలు ఎలా ప్రభావితమవుతున్నాయి? ఎంతమంది ప్రాణాలు కోల్పోయారు? మన ఇంట్లో ఎదిగివచ్చిన యుత్ఉంటే ఓనిఘా వేసి ఉంచడం ఎందుకైనా మంచిది. రోజులుబాగాలేవు. అత్యాధునిక టెక్నాలజి ఉపయోగించుకుని బాగుపడితే ఇంతకన్నా మంచిఫలితం ఉంటదు.కాని ఆటెక్నాలజీకి బానిసలై దానిమాయలో పడి నష్ట పోతుంటే …మన కళ్ల ఎదుటే జరగరాని నష్టం జరిగి పోతుంటే చూస్తూ ఊరుకుంటే ఈ పాపంలో మనం ముద్దాయిలుగా మిగలాలి.
ఈ సమస్యపై దృష్టి పెడితే నియంత్రణ మార్గాలు పూర్తిగా కట్టడి చేసేమార్గాలు లభిస్తాయి.
యువతను ఆకర్షించే బెట్టింగ్ యాప్స్ ఎలా పనిచేస్తాయంటే అవి ఒకరూపంలో కనిపించవు. ఈ బెట్టింగ్ యాప్స్ యువతను ఆకట్టుకోవడానికి అనేక ఉపాయాలు ఉపయోగిస్తాయి. సినిమా తారలు, సోషల్ మీడియా ఇన్ఫ్లూయెన్సర్ల ద్వారా ఆకర్షణీయమైన ప్రకటనలు, “ఒక్క గేమ్ ఆడితే చాలు, లక్షలు సంపాదించవచ్చు” అనే ఆశాజనక ప్రకటనలతో యువతను ఆకట్టుకుంటాయి.
క్రికెట్, కబడ్డీ, రమ్మీ, క్యాసినో లాంటి గేమ్లతో ఈ యాప్స్ యువతను సులభంగా ఆకర్షిస్తున్నాయి. ఉదాహరణకు, ఐపీఎల్ మ్యాచ్ల సమయంలో రాధీఎక్స్చేంజ్ వంటి యాప్స్ లైవ్ బెట్టింగ్ ఆఫర్లతో యువతను ఆకట్టుకున్నాయి.
సోషల్ మీడియాలో వచ్చే పాప్-అప్ యాడ్స్, వాట్సాప్ లింకులు కూడా ఈ యాప్స్ను డౌన్లోడ్ చేసేలా ప్రోత్సహిస్తాయి. “సులభంగా డబ్బు సంపాదించండి” అనే ఓ చిన్న ప్రకటన యువతలో ఓ ఆశను రేకెత్తిస్తాయి. వారిలో ఆశలు రేకెత్తించేరీతిలో ప్రకటనలు ఉంటాయి. అంతే ఓ సెల్
పోన్ చేతిలో పట్టుకుని ఎవరి కంట పడకుండా గదిలో కూర్చుని బెట్టింగ్ యాప్స్ ద్వారా తమజీవితాలను బలిపెడతారు. మొదట్లో వందల నుండి మొదలై వేలు లక్షల వరకు బెట్టింగ్ పెంచుకుంటూ ఎక్కడి వరకంటే చివరికి తమప్రాణాల కు వచ్చే వరకు ఈఊబిలో కూరుకుపోతారు.
ఆర్థికంగా, మానసికంగా, సామాజికంగా తీవ్రంగా నష్టపోయి అప్పుల పాలవుతున్నారు.
హైదరాబాద్లోని కలిగోట ఆకాశ్ అనే యువకుడు బెట్టింగ్ యాప్స్లో లక్షల రూపాయలు పోగొట్టుకుని, అప్పుల భారంతో తన ఐదు నెలల బిడ్డను వదిలి ఆత్మహత్య చేసుకున్నాడు. ఇలాంటి సంఘటనలు ఒకటీ రెండు కాదు. బెట్టింగ్ వ్యసనం వల్ల యువత మానసిక ఒత్తిడి, ఆత్మవిశ్వాసం కోల్పోవడం, కుటుంబ సంబంధాలు దెబ్బతినడం లాంటి సమస్యలను ఎదుర్కొంటోంది. అప్పులు తీర్చలేక, సామాజిక ఒత్తిడిని తట్టుకోలేక ప్రాణాలు కోల్పోతున్నారు.
తెలుగు రాష్ట్రాల్లో ప్రాణనష్టం
తెలంగాణలో బెట్టింగ్ యాప్స్ వల్ల జరిగిన ప్రాణనష్టం అంతా ఇంతాకాదు. హైదరాబాద్లో 27 మంది యువకులు ప్రాణాల మీదికి తెచ్చుకున్నారు. ఈ బాధితుల్లో 97% మంది పురుషులు కాగా ఇందులో చాలామంది యువకులు కుటుంబ బాధ్యతలు నిర్వహిస్తున్న వారు ఉన్నారు. నిజామాబాద్లో ఒక కుటుంబం మొత్తం 30 లక్షల రూపాయల అప్పు తీర్చలేక ఆత్మహత్య చేసుకుంది. ఇటీవల మేడ్చల్లో సోమేశ్ అనే యువకుడు బెట్టింగ్ వ్యసనం వల్ల ప్రాణాలు కోల్పోయాడు.
ఒక వార్తా సంస్థ ప్రకారం, తెలంగాణలో దాదాపు 980 మంది బెట్టింగ్ యాప్స్ మోసానికి గురై ప్రాణాలు కోల్పోయినట్లు అంచనా. అయితే, ఆంధ్రప్రదేశ్లో ఖచ్చితమైన గణాంకాలు అందుబాటులో లేనప్పటికీ, రెండు రాష్ట్రాల్లో ఈ సమస్య తీవ్రంగా ఉందని స్పష్టం.
తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఈ బెట్టింగ్ యాప్స్పై కఠిన చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. మార్చి 26, 2025న అసెంబ్లీలో మాట్లాడుతూ, ఈ యాప్స్ను నిర్మూలించేందుకు స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీమ్ (SIT) ఏర్పాటు చేస్తామని ప్రకటించారు. ఈ యాప్స్ను ప్రమోట్ చేస్తున్న సినీ తారలు, ఇన్ఫ్లూయెన్సర్లపై కేసులు నమోదు చేస్తున్నామని, చట్టాలను మరింత కఠినతరం చేస్తామని చెప్పారు. హైదరాబాద్లోని మియాపూర్ పోలీసులు 19 మంది బెట్టింగ్ యాప్స్ యజమానులను అరెస్ట్ చేసి, సినీ నటులైన రానా దగ్గుబాటి, విజయ్ దేవరకొండ, ప్రకాష్ రాజ్లపై కేసులు నమోదు చేశారు.
అయినప్పటికీ, ఈ యాప్స్ మాయాజాలాన్ని పూర్తిగా నిర్మూలించ లేక పోతున్నారు. మన దేశంలో పేరు మోసిన బడా కార్పోరేటర్లు వీటి నిర్వహణ వెనకాల ఉన్నారన్న ఆరోపణలు ఉన్నాయి.
సమాజం ఏం చేయాలి?
బెట్టింగ్ యాప్స్ వ్యసనం నుంచి యువతను కాపాడాలంటే, కుటుంబాలు, విద్యాసంస్థలు, ప్రభుత్వం కలిసి పనిచేయాలి. తల్లిదండ్రులు తమ పిల్లల ఒంటరి తనాన్ని దూరంచేసివారిని సెల్ ఫోన్లకు వదిలి వేయకుండా మాటా ముచ్చట జరపాలి. ఈ యాప్స్ ప్రమాదాల గురించి మాట్లాడాలి. స్కూళ్లలో అవగాహన కార్యక్రమాలు నిర్వహించాలి. సోషల్ మీడియాలో ఈ యాప్స్ ప్రకటనలను పూర్తిగా నిషేధించాలి ప్లే స్టోర్లలో ఆప్ లను తొలగించాలి. #Say No To Betting Apps లాంటి హ్యాష్ట్యాగ్లతో తెలంగాణ ఐపీఎస్ అధికారి వీసీ సజ్జనార్ సామాజిక మాధ్యమాల్లో అవగాహన కల్పిస్తున్నారు. యువత కూడా ఈ ఆశల ఊబిలో చిక్కుకోకుండా జాగ్రత్తపడాలి.
బెట్టింగ్ యాప్స్ ఒక ఆట కాదు, అది జీవితాలను నాశనం చేసే విషం. ఈ విషాన్ని తొలగించేందుకు మనమంతా కలిసి పోరాడాలి. లేకపోతే, మన యువత భవిష్యత్తు చీకటిలో కూరుకుపోతుంది.
(సమాచార సేకరణ: ది హిందూ, న్యూ ఇండియన్ ఎక్స్ప్రెస్, టీవీ9 తెలుగు, సోషల్ మీడియా పోస్టులు)