పహల్గామ్ ఉగ్రదాడి నేపద్యంలో భారతప్రభుత్వం కీలక నిర్ణయాలు చేపట్టింది. భారతదేశంలో ఉన్న పాకిస్తానీల వీసాలు తక్షణం రద్దు చేసింది – 48 గంటల్లో దేశం విడిచిపోవాలని కేంద్రం అల్టిమేటం జారి చేసింది.
పహల్గామ్ ఉగ్రదాడి నేపద్యంలో భారత ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. పాకిస్తాన్కు చెందిన వారి వీసాలను రద్దు చేస్తూ కేంద్రం కీలక ఉత్తర్వులు జారీ చేసింది. ప్రస్తుతం సాధారణ వీసాలతో భారత్లో ఉన్న పాకిస్తానీయులు ఏప్రిల్ 27లోగా దేశాన్ని విడిచిపోవాలని కేంద్ర హోం మంత్రిత్వ శాఖ స్పష్టం చేసింది.
ఈ చర్యల నేపథ్యంలో తెలంగాణ పోలీసు శాఖ కూడా అప్రమత్తమైంది. రాష్ట్రంలో ఉన్న పాకిస్తానీలకు డైరెక్ట్గా సూచనలు జారీ చేసింది. ఈ మేరకు రాష్ట్ర డీజీపీ జితేందర్ శుక్రవారం ప్రకటన విడుదల చేశారు.
“తెలంగాణలో ఉన్న పాకిస్తానీలు వెంటనే తమ దేశానికి వెళ్లిపోవాలి. పాకిస్తానీల వీసాలు ఏప్రిల్ 27 తర్వాత అమలులో ఉండవు. మెడికల్ వీసాలు కలిగినవారికి మాత్రం ఏప్రిల్ 29 వరకు గడువు ఉంది. లాంగ్ టర్మ్ వీసాలపై ఉన్నవారికి ఈ ఆదేశాలు వర్తించవు,” అని డీజీపీ వివరించారు.
పాకిస్తానీయులు అటారి బార్డర్ ద్వారా తమ దేశానికి వెళ్లవచ్చని, ఈ నెల 30 వరకు ఆ బార్డర్ ఓపెన్గా ఉంటుందని వెల్లడించారు. కేంద్రం తీసుకున్న నిర్ణయాల మేరకు అందరూ సహకరించాలని, అక్రమంగా రాష్ట్రంలో ఉంటే కఠిన చర్యలు తీసుకుంటామని డీజీపీ హెచ్చరించారు.