జనగణనలో కుల గణన చేయాలి

కేంద్ర ప్రభుత్వం తక్షణమే జనగణనలో కుల గణన చేయాలని, బి.సి లకు 42 శాతం రిజర్వేషన్లు కల్పించాలని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అసెంబ్లీలో చేసిన తీర్మాన బిల్లును కేంద్ర ప్రభుత్వం పార్లమెంటులో బిల్లు బెట్టి, 9వ షెడ్యూల్ లో పొందుపరచి చట్టం చేయాలని బి.సి హక్కుల సాధన సమితి రాష్ట్ర అధ్యక్షులు తాటిపాముల వెంకటరాములు డిమాండ్ చేశారు.

బి.సి రిజర్వేషన్ల అమలుపై హనుమకొండ జిల్లా కేంద్రం బాలసముద్రం సిపిఐ కార్యాలయంలో బి.సి హక్కుల సాధన సమితి ఆధ్వర్యంలో హనుమకొండ జిల్లా అధ్యక్షులు బత్తిని సదానందం అధ్యక్షతన శనివారం ఏర్పాటు చేసిన బి.సి సంఘాల రౌండ్ టేబుల్ సమావేశానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు.

కుల గణన ఆధారంగా బడ్జెట్లో నిధులు కేటాయించాలని, కేంద్ర ప్రభుత్వం బి.సి మంత్రిత్వ శాఖను ఏర్పాటు చేసి బి.సి సమాజ అభివృద్ధికి తోడ్పడాలని, చట్టసభలలో 50 శాతం రిజర్వేషన్లు బి.సి లకు కల్పించాలని ఆయన డిమాండ్ చేసినారు. 

ఈ కార్యక్రమంలో పాల్గొన్న ఆల్ ఇండియా ఒబిసి జాక్ చైర్మన్ సాయిని నరేందర్ మాట్లాడుతూ బి.సి లకు విద్యా, ఉద్యోగాల్లో, స్థానిక సంస్థలలో కామారెడ్డి డిక్లరేషన్ లో పేర్కొన్నట్టు తక్షణమే 42 శాతం రిజర్వేషన్లను సాధించడం కోసం కేంద్రం ప్రభుత్వంపై పోరాటం చేయాలని పిలుపునిచ్చారు. తెలంగాణ ఉద్యమంలో కీలకపాత్ర పోషించిన బి.సి సమాజం నేడు వారి హక్కులు సాధించుకోవడం కోసం జరిగే ఉద్యమంలో నిర్లక్ష్యం వహించడం సరికాదని, సబ్బండ కులాలు ఏకమై బిజెపి రాజకీయ నాయకులను నిలదీయాలని, పార్టీలకతీతంగా బి.సి సమాజం ఏకం కావాలని పిలుపునిచ్చారు. బి.సి హక్కుల సాధనకు ఎస్సీ ఎస్టీ లు మద్దతివ్వాలని, ఆనాడు మండల్ కమీషన్ అమలుకు మాన్యశ్రీ కాన్షీరామ్ మద్దతుగా నిలిచారని, అంబేద్కర్ ఎస్సీ, ఎస్టీ ల అభివృద్ధికి చట్టసభల్లో రిజర్వేషన్లు కల్పించినా వారు ఆ సభల్లో మైనార్టీలుగా ఉండడం వల్ల బహుజన సమాజ అభివృద్ధికి మేలు చేయలేని నిస్సహాయ స్థితిలో 75 ఏండ్లు గడిచిపోయాయని, చట్టసభల్లో బి.సి ల వాటా భర్తీ ద్వారానే బహుజన సమాజ అభివృద్ధి జరుగుతుందని అందుకోసం ఎస్సీ, ఎస్టీ, బి.సి, మైనార్టీలు ఐక్య పోరాటాలు చేసి హక్కులు సాధించుకోవాలని పిలుపునిచ్చారు. బి.సి హక్కుల కోసం బి.సి సమాజం భావజాల వ్యాప్తి బాగానే జరిగిందని భౌతిక ఏకీకరణకు విస్తృత ప్రయత్నం చేస్తే రాజ్యాధికారం సులువుగా వస్తుందని అన్నాడు. సకల సమస్యలకు పరిష్కారం రాజ్యాధికారమేనని రాజ్యాధికార పోరులో ఆల్ ఇండియా కూటమి లాంటివి మరింత బలపడాలని పేర్కొన్నారు. 

బీసీ సంక్షేమ సంఘం ఉమ్మడి వరంగల్ జిల్లా అధ్యక్షులు బుట్టి శ్యామ్ యాదవ్ మాట్లాడుతూ జనాభాలో 90 శాతంగా ఉన్న బీసీ సమాజం 10 శాతం గా ఉన్న ఆధిపత్య కులాలచే పాలించబడడం విచారకరమన్నారు. దేశంలో వేయబడిన అన్ని బీసీ కమిషన్లు బీసీలకు 50 శాతం రిజర్వేషన్లు కల్పించాలని సూచించినప్పటికీ పాలకులు పాటించడం లేదని ధ్వజమెత్తారు. భారత్ బచావో నాయకులు దొమ్మాటి ప్రవీణ్ కుమార్ మాట్లాడుతూ బీసీలు అంటే బెస్ట్ క్లాస్ నైపుణ్యత కలిగిన వారని, పాలకులు కావాలనే ఆర్థికంగా, సాంఘికంగా వెనకకు నెట్టివేసి వెనుకబడిన తరగతులని ఎద్దేవ చేస్తున్నారని మండిపడినారు. సైంటిఫిక్ స్టడీ ఫెడరేషన్ చైర్మన్ చార్వాక మాట్లాడుతూ కులము లేని మతము లేని సమాజం కొరకు, విజ్ఞానవంతమైన సమాజాన్ని నిర్మించుకోవడం ద్వారా బీసీ సమాజం చైతన్యవంతమైతే విప్లవం అనివార్యమని పేర్కొన్నారు. బీసీ హక్కుల సాధన సమితి హన్మకొండ జిల్లా ప్రధాన కార్యదర్శి నేదునూరి రాజమౌళి మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం కులగణన చేసి బీసీ బిల్లు పెట్టాలని, పార్లమెంటులో బిల్లు పెట్టి తొమ్మిదవ షెడ్యూల్లో చేర్చి కోర్టు అడ్డంకులను నిరోధించాలని తెలిపారు. జనాభా ఆధారంగా బడ్జెట్ కేటాయింపులు పార్లమెంటు, అసెంబ్లీ, రాజ్యసభ, విధాన సభలలో జనాభా ఆధారంగా కేటాయింపులు ఉండాలని డిమాండ్ చేశారు. తమిళనాడు తరహా బీసీ రిజర్వేషన్లు రాష్ట్ర ప్రభుత్వం అమలు చేయాలని కోరినారు. దేశవ్యాప్తంగా నేటికీ బీసీ కులాలు వెనుకబడి ఉండడానికి పాలకవర్గాలు అవలంబించే బీసీ ప్రజా వ్యతిరేక విధానాలే కారణమన్నారు. మహిళా లకు 33 శాతం రిజర్వేషన్లు ఆమోదించి అటుకెక్కించారని ఆవేదన వెలిబుచ్చారు.
ఈ సమావేశంలో బైరి తిరుపతి, మడ్డి రాజారాం, బి రమేష్, టి ప్రశాంత్, పి రామ్ గోపాల్ చారి, జి రాజేందర్, పాలబిందల సాత్విక్, పులి వెంకటేష్ తదితరులు పాల్గొన్నారు.

Share this post

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

IN ARTICLE