ఉగ్రవాదానికి ఇక ముగింపు పలకాలి
పహల్గాం టెర్రర్ దాడి అనంతరం భారత్-పాకిస్తాన్ మధ్య యుద్ధమేఘాలు అలముకున్న దశలో.. ఓవైసీ కీలక వ్యాఖ్యలు
పహల్గాం ప్రాంతంలో జరిగిన ఉగ్రదాడి దేశవ్యాప్తంగా ప్రకంపనలు సృష్టించింది. ఈ దాడి తర్వాత భారత్, పాకిస్తాన్ మధ్య యుద్ధ మేఘాలు అలుముకోగా భారత్లోని ముస్లిం నేతలు కేంద్ర ప్రభుత్వానికి సంపూర్ణ మద్దతు పలుకుతూ ఉగ్రవాదానికి వ్యతిరేకంగా గళమెత్తుతున్నారు.
ఈ నేపథ్యంలో మజ్లిస్ పార్టీ అధినేత, హైదరాబాద్ ఎంపీ అసదుద్దీన్ ఒవైసీ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. పాక్ ప్రేరేపిత ఉగ్రవాదంపై కేంద్రం తీసుకునే చర్యలకు తాము సంపూర్ణ మద్దతుగా ఉంటామని ప్రకటించిన ఆయన, ఇక కేవలం ప్రతీకార దాడులతో కాకుండా శాశ్వత పరిష్కార దిశగా అడుగులు వేయాల్సిన అవసరం ఉందన్నారు.
పీవోకే (పాక్ ఆక్రమిత కశ్మీర్)పై స్పందించిన ఒవైసీ, “పాకిస్తాన్ అక్కడి ఉగ్ర శిబిరాలను ఖాళీ చేస్తే, మనం వెళ్లి అక్కడే తిష్ఠ వేసుకోవాలి. దాడి చేసి వెనక్కి రావడం కాదని, శాశ్వతంగా అక్కడే ఉండాల్సిన అవసరం ఉంది” అని ఏఎన్ఐతో మాట్లాడుతూ తెలిపారు.
భారత పార్లమెంట్ ఇప్పటికే పీవోకే భారతదేశంలో భాగమేనని తీర్మానించిన విషయాన్ని గుర్తు చేసిన ఒవైసీ, “బీజేపీ నేతలు ‘ఘర్ మే ఘుస్ కే మారేంగే’ (ఇంట్లోకి చొరబడి కొడతాం) అంటారు. నేను ‘ఘర్ మే ఘుస్ కే బైఠ్ జావో’ (ఇంట్లోకి చొరబడి కూర్చోండి) అంటున్నాను. ఈ ఉగ్రవాదానికి ఇక ముగింపు పలకాలి” అని ఆయన స్పష్టం చేశారు.
ఇక ఆయన చేసిన ఈ వ్యాఖ్యలు, రాజకీయంగా, భద్రతా పరంగా పెద్ద చర్చనీయాంశంగా మారాయి.