దరఖాస్తుల తిరస్కారానికి సరైన కారణాలు చూపాలి
ఆగస్టు 15 నాటికి వీలైనన్ని భూ సమస్యలు పరిష్కరించాలి
ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణంలో పేదవాడికి ఏసమస్యా రాకూడదు
లబ్దిదారులకు దగ్గరలోని ఉచిత ఇసుక ఇవ్వాలి
జిల్లా కలెక్టర్ల వీడియో కాన్ఫరెన్స్లో ….
రాష్ట్ర రెవెన్యూ , హౌసింగ్, సమాచార పౌరసంబంధాల శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి
హైదరాబాద్ : తెలంగాణ ప్రజల ఆలోచనలు, ఆకాంక్షలకు అనుగుణంగా గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిగారి నేతృత్వంలో రూపుదిద్దుకున్న భూభారతి చట్టం, ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణాలకు అత్యంత ప్రాధాన్యత ఇచ్చి పకడ్బందీగా అమలు చేయాల్సిన బాద్యత జిల్లా కలెక్టర్లదేనని రాష్ట్ర రెవెన్యూ , హౌసింగ్, సమాచార పౌరసంబంధాల శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి స్పష్టం చేశారు.
మంగళవారం నాడు డాక్టర్ బి. ఆర్. అంబేద్కర్ సచివాలయంలో చీఫ్ సెక్రటరీ కార్యాలయం నుంచి మంత్రులు పొన్నం ప్రభాకర్, అడ్లూరి లక్ష్మణ్కుమార్ చీఫ్ సెక్రటరీ కె. రామకృష్ణారావుతో కలిసి జిల్లా కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్బంగా మంత్రిగారు మాట్లాడుతూ భూ సమస్యలు పరిష్కారమే లక్ష్యంగా రాష్ట్ర ప్రభుత్వం తీసుకువచ్చిన అద్భుతమైన భూ భారతి చట్టాన్ని పకడ్బందీగా అమలు చేసినప్పుడే దాని ఫలితాలు సామాన్యులకు అందుతాయని అన్నారు. మూడు దఫాలుగా నిర్వహించిన రెవెన్యూ సదస్సుల్లో వచ్చిన దరఖాస్తులను పరిష్కరించడానికి సామాన్యులను ముఖ్యంగా రైతులను ఇబ్బంది పెడితే కఠిన చర్యలు తప్పవని సస్సెండ్ చేయడానికైనా వెనుకాడబోమని హెచ్చరించారు.క్షేత్రస్ధాయిలో కొంతమంది అధికారులు రైతులను ఇబ్బంది పెడుతున్నారనే సమాచారం ఉందని ఇది పునరావృతం కాకుండా చూడాలని కలెక్టర్లకు సూచించారు.
రెవెన్యూ సదస్సుల్లో 8.65లక్షల దరఖాస్తులు వచ్చాయని ఇందులో ప్రధానంగా సాదాబైనామా, సర్వేనెంబర్ మిస్సింగ్, అసైన్డ్ ల్యాండ్ , అసైన్డ్ ల్యాండ్ రెగ్యులరైజేషన్, సక్సెషన్ కు సంబంధించి సుమారు 6 లక్షల దరఖాస్తులు వచ్చాయని వీటిని ఐదు విభాగాలుగా విభజించి ప్రతి దరఖాస్తును సమగ్రంగా పరిశీలన జరిపి ఆగస్లు 15వ తేదీలోగా వీలైనన్ని సమస్యలను పరిష్కరించాలన్నారు. సాదాబైనామాల అంశం ప్రస్తుతం కోర్టు పరిధిలో ఉందని కోర్టు తీర్పుకోసం వేచిచూడకుండా దరఖాస్తులను పరిశీలించి పరిష్కారం కోసం సిద్దం చేసుకోవాలన్నారు. జిల్లాల్లోని అసైన్డ్ల్యాండ్, లబ్దిదారుల వివరాలను ఈ నెల 30వ తేదీ లోగా ప్రభుత్వానికి పంపించాలని కలెక్టర్లకు సూచించారు.
దరఖాస్తుల సంఖ్యను తగ్గించుకోవడానికి ఇష్టం వచ్చిన రీతిలో తిరస్కరించకూడదని, తిరస్కారానికి గల కారణాలను లిఖిత పూర్వకంగా దరఖాస్తుదారునికి తెలియజేయాలని సూచించారు. ఇందుకు సంబంధించి రాష్ట్ర స్దాయిలో ప్రత్యేక విభాగాన్ని ఏర్పాటు చేస్తామన్నారు.
ఈనెల 27వ తేదీన రాష్ట్ర వ్యాప్తంగా జిపీవోలకు , జె ఎన్ టి యు ఆధ్వర్యంలో లైసెన్స్ డ్ సర్వేయర్లకు పరీక్ష నిర్వహిస్తున్నామని ఇందుకు అవసరమైన ఏర్పాట్లను చేసుకొని పకడ్బందీగాపరీక్ష నిర్వహించాలన్నారు.