లెజినోవా పై ట్రోలింగ్ ఆక్షేపించిన విజయశాంతి
తిరుమలలో తలనీలాలు సమర్పించిన అన్నా లెజినోవా పై ట్రోలింగ్ ఆక్షేపించిన విజయశాంతి
తిరుమల శ్రీవేంకటేశ్వర స్వామిని దర్శించిన జనసేన అధినేత పవన్ కల్యాణ్ భార్య అన్నా లెజినోవా తలనీలాలు సమర్పించడం ప్రస్తుతం సోషల్ మీడియాలో హాట్ టాపిక్గా మారింది. ఇటీవల సింగపూర్లో జరిగిన అగ్నిప్రమాదంలో వారి కుమారుడు మార్క్ శంకర్ గాయపడిన సంగతి తెలిసిందే. ప్రమాదం నుంచి చిన్నారి సురక్షితంగా బయటపడటంతో, వేంకటేశ్వరుడికి కృతజ్ఞతగా లెజినోవా తలస్నానం చేసి, తలనీలాలు సమర్పించారు.
అంతే కాక, చిన్నారి పేరుతో తిరుమల నిత్య అన్నదాన ట్రస్టుకు రూ.17 లక్షల విరాళం అందించారు. స్వయంగా అన్నప్రసాదాన్ని వడ్డించి, భక్తులతో కలిసి భోజనం చేశారు. ఈ సందర్భంగా ఆమె ఫొటోలు, వీడియోలు సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవుతున్నాయి.
అయితే, దీనిపై కొందరు సోషల్ మీడియాలో విమర్శలు చేస్తూ, పుణ్యక్షేత్రాల్లో మహిళలు తలనీలాలు సమర్పించడం సరికాదంటూ ట్రోల్ చేస్తున్నారు.
ఈ నేపథ్యంలో సీనియర్ నటి, రాజకీయ నాయకురాలు విజయశాంతి కౌంటర్ ఇచ్చారు. ఆమె మాట్లాడుతూ,
“అన్నా లెజినోవా గారు విదేశీ మహిళ అయినా హిందూ ధర్మాన్ని గౌరవించారు. కలియుగ దైవం వేంకటేశ్వరుడిపై ఉన్న భక్తి విశ్వాసంతో తలనీలాలు సమర్పించి, విరాళం ఇచ్చారు. ఇలాంటి వారిని ట్రోల్ చేయడం సరికాదు. ఇది హిందూ సంప్రదాయాన్ని అవమానించడమే” అని అన్నారు.
ఈ ఘటనపైసోషల్ మీడియాలో చర్చోపచర్చలు కొనసాగుతున్నాయి, కొందరు వెకిలిగా కామెంట్స్ చేసినా చాలా మంది నెటిజన్లు మాత్రం అన్నా లెజినోవా భక్తి శ్రద్దలను ప్రశంసించారు.