మార్కెటింగ్ శాఖ ప్రధాన కార్యాలయాన్ని ఆకస్మిక తనిఖీ చేసిన మంత్రి తుమ్మల
ఆలస్యంగా వచ్చిన సిబ్బందిపై చర్యలు – మంత్రి తుమ్మల
ప్రతి ప్రధాన కార్యాలయాలలో ఫేస్ రికగనైజేషన్ తో బయో మెట్రిక్ ఏర్పాటు చేయాలి – మంత్రి తుమ్మల
అధికారులు రైతులకు అందుబాటులో లేకపోతే చర్యలు తప్పవు – మంత్రి తుమ్మల ఈ రోజు వ్యవసాయశాఖ మంత్రి శ్రీ తుమ్మల నాగేశ్వరరావు గారు బిఆర్కె భవన్లోని మార్కెటింగ్ శాఖ ప్రధాన కార్యాలయంలో అకస్మాత్తుగా తనిఖీ నిర్వహించారు. ఈ సందర్బంగా, కార్యాలయానికి ఆలస్యంగా హాజరైన అధికారులపై మంత్రి గారు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసి, మార్కెటింగ్ డైరెక్టర్ గారికి ఆలస్యంగా వచ్చిన సిబ్బంది మీద వెంటనే మెమో ఇచ్చి, సంజాయిషీ తీసుకోవాల్సిందిగా ఆదేశించారు. ఈ మేరకు మార్కెటింగ్ డైరెక్టర్ గారు మొత్తం 53 మంది రెగ్యులర్ సిబ్బందిలో 16 మంది ఆలస్యంగా హాజరయ్యారని, 42 ఔట్ సోర్సింగ్ సిబ్బందిలో 5గురు మాత్రమే ఆలస్యంగా హాజరయ్యారని, వారికి మెమో జారీ చేశామని తెలిపారు. దీనికి మంత్రిగారు మార్కెటింగ్ డైరెక్టర్ గారికి వెంటనే ఫేస్ రికగనైజేషన్ తో బయో మెట్రిక్ ఏర్పాటు చేయాలని ఆదేశించారు. ఇకపై ఆలస్యాన్ని వచ్చిన అధికారులు మరియు అందుబాటులో లేని అధికారులపై తగు చర్యలు తీసుకోవాలని డైరెక్టర్ గారిని ఆదేశించారు. ప్రతిరోజు సిబ్బంది యొక్క హాజరు పట్టికను మంత్రిగారి ఆఫీసుకు పంపాల్సిందిగా ఆదేశించారు.