మరికొన్ని అంశాలపై తీపికబురు
మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి
హైదరాబాద్ :- రాష్ట్రంలో భూసమస్యల పరిష్కారానికి గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిగారు శాసనసభలో చేసిన ప్రకటన మేరకు త్వరలో ప్రజలకు తీపికబురు అందుతుందని రాష్ట్ర రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి వెల్లడించారు. దీనిలో భాగంగా అసెంబ్లీలో ప్రకటించిన 12 అంశాలపై దృష్టి సారించి దశల వారీగా వాటిని నెరవేరుస్తున్నామని ఈ మేరకు కాలనీల సమస్యపై జీవో 118, సింగరేణి ప్రాంతంలో ఇళ్ల స్దలాల రెగ్యులరైజేషన్కు సంబంధించిన జీవో 76 ను విడుదల చేశామన్నారు.
ఎల్.బి.నగర్ నియోజకవర్గంలోని 44 కాలనీల్లో ఇళ్ల క్రమబద్దీకరణకు సంబంధించి సరూర్ నగర్ ఇండోర్ స్టేడియంలో ధృవ పత్రాలను సహచర మంత్రులు పొన్నం ప్రభాకర్, అజారుద్దీన్ ఇతర ప్రజాప్రతినిధులతో కలసి మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి లబ్దిదారులకు అందజేశారు.
ఈ సందర్బంగా మంత్రిగారు మాట్లాడుతూ గౌరవ ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి గారి ఆలోచనల మేరకు ఈ క్యూర్ ప్రాంతాన్ని ప్రపంచంలోనే నెంబర్ 1 ప్రాంతంగా తీర్చిదిద్దేందుకు ప్రణాళికలు తయారు చేస్తున్నామన్నారు. గ్రామీణ ప్రాంతాల్లో రైతు సమస్యల పరిష్కారానికి గాను ఆధార్ వలే భూధార్ కార్డులు ఇస్తామని, ఈ క్యూర్ ప్రాంతంలో కూడా ప్రజల సమస్యలను పరిష్కరిస్తామని వెల్లడించారు. ప్రతిపక్షాల ప్రతి ప్రశ్నకు సమాధానం ఇవ్వలేమని తమకు ప్రజాసేవే ముఖ్యమని అన్నారు. ఇటీవల శాసనసభలో భూ సమస్యలపై సుదీర్ఘంగా చెప్పామని గుర్తుచేశారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి సూచనలు, 12 అంశాల మేరకు ఈ సరూర్నగర్ నియోజకవర్గంలో ఉన్న 64 కాలనీల్లోని 44 కాలనీల సమస్యను పరిష్కరించామని తెలిపారు.
మల్కాజిగిరి పార్లమెంట్ సభ్యుడిగా ఉన్న సమయంలో ఎల్బీనగర్ నియోజకవర్గ ప్రజలకు 118 జీఓ అమలు చేస్తామని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఇచ్చిన హామీని ఈరోజు నిలబెట్టుకున్నామన్నారు
ప్రజల సంక్షేమాన్ని దృష్టిలో పెట్టుకొని ఏ పార్టీవారు ప్రాతినిధ్యం వహిస్తున్నా తాము బేషజాలకు పోకుండా ఇక్కడి 44 కాలనీల సమస్యలపై కలెక్టర్లకు స్పష్టమైన ఆదేశాలు ఇచ్చామన్నారు. గత ప్రభుత్వం నుంచి నిషేధిత ఉత్తర్వులున్నా ఇప్పుడు వాటిని నెలరోజులలోగా పరిష్కరించి ఇళ్లను రెగ్యులరైజ్ చేస్తామని, ఎవరి ఇళ్లుకూల్చదని స్పష్టం చేశారు.
జీవో 118 సహకారంతో మేడ్చల్ , రంగారెడ్డి జిల్లాలోని మరికొంత మందికి కూడా నెలలోగా సమస్య పరిష్కరిస్తామని ప్రకటించారు. ఈ ప్రాంత కాలనీలు చాలా కాలం నుంచి 22ఎలో ఉన్నాయని వివరిస్తూ 22ఎ కు సంబంధించి త్వరలో ఈ ప్రభుత్వం తీపి కబురు చెప్పనుందని తెలిపారు. 22ఎ అనేది ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ నుంచి అమలులో ఉందని, దీనిని పరిశీలించుకోవచ్చునన్నారు. అయితే కొంతమంది దీనిని అసరాగా చేసుకొని దుష్ప్రచారం చేస్తున్నారని ఆరోపించారు.
మరో వారం రోజుల్లో సమస్య పరిష్కరించే విధంగా ప్రభుత్వ ఆదేశాలు రానున్నాయని తెలిపారు. ఈ ప్రాంతంలో రిజిస్ట్రేషన్ సమస్య, దరఖాస్తు చేసుకోని వారి సమస్యను పరిష్కరించేందుకు ఈ వేదికగా ఆదేశాలు ఇస్తున్నామని తెలిపారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు త్వరలో ఈ మేరకు శుభవార్త చెబుతారని ప్రకటించారు.
సింగరేణి ప్రాంతంలో ఇళ్ల స్దలాల రెగ్యులరైజేషన్కు సంబంధించిన జీవో 76 ను అమలు చేయబోతున్నామని దీనికోసం ముగ్గురు సభ్యుల కమిటీని ఏర్పాటు చేశామని మంత్రి తెలిపారు. మరో 45 రోజుల్లో పూర్తిస్ధాయిలో భూసమస్యను పరిష్కరిస్తామని వెల్లడించారు.
కార్యక్రమంలో ఎల్. బి. నగర్, ఇబ్రహీంపట్నం శాసనసభ్యులు డి .సుధీర్ రెడ్డి, మల్ రెడ్డి రంగారెడ్డి, ఎల్. బి. నగర్ కాంగ్రెస్ పార్టీ ఇంచార్జి మధు యాష్కీ గౌడ్ తదితరులు పాల్గొన్నారు.

