కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థల భూముల సమస్యలు పరిష్కరించాలి -మంత్రి శ్రీధర్ బాబు

minister sridhar babu

తెలంగాణ రాష్ట్రానికి చెందిన కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థలకు గతంలో కేటాయించిన భూములపై నెలకొన్న సమస్యలను పరిష్కరించేందుకు రాష్ట్ర ప్రభుత్వం కేంద్రం జోక్యం చేసుకోవాలని కోరింది. ఈ నేపథ్యంలో, రాష్ట్ర పరిశ్రమలు, వాణిజ్యం శాఖ మంత్రి దుద్ధిళ్ళ శ్రీధర్ బాబు నేడు న్యూఢిల్లీలో కేంద్ర భారీ పరిశ్రమల శాఖ మంత్రి కుమారస్వామిని కలసి ఈ విషయమై విపులంగా చర్చించారు.

1960లలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం పారిశ్రామికాభివృద్ధి, ఉపాధి అవకాశాల కల్పన కోసం హైదరాబాద్ చుట్టుపక్కల విలువైన భూములను భారీ ఎత్తున రాయితీ ధరలకు కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థలకు కేటాయించింది. అయితే కాలక్రమంలో వాటిలో అనేక సంస్థలు మూతపడ్డాయి లేదా ఉత్పత్తి నిలిపేశాయి. వాటి పరిధిలోని విస్తీర్ణ భూములు ప్రస్తుతానికి నిరుపయోగంగా ఉండడమే కాకుండా, కొన్ని సంస్థలు భూములను వాణిజ్య పరంగా వినియోగానికి మార్పు చేసుకోవాలన్న యత్నాలు చేస్తున్నట్లు తెలుస్తోంది.

ప్రస్తుతం తెలంగాణలో వివిధ జిల్లాల్లో ఉన్న ముఖ్యమైన సీపీఎస్‌యూలు కింద భూకేటాయింపుల వివరాలు :

  1. హిందుస్తాన్ కేబుల్స్ లిమిటెడ్, మేడ్చల్-మల్కాజిగిరి – 324.87 ఎకరాలు
  2. హిందుస్తాన్ ఫ్లోరోకార్బన్స్ లిమిటెడ్, సంగారెడ్డి – 126.33 ఎకరాలు
  3. ఐడీపీఎల్, మేడ్చల్-మల్కాజిగిరి – 551.03 ఎకరాలు
  4. హెచ్‌ఎంటీ, మేడ్చల్-మల్కాజిగిరి – 888.05 ఎకరాలు
  5. సిమెంట్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (సీసీఐ), ఆదిలాబాద్ – 2,272.85 ఎకరాలు
  6. ఆర్డినెన్స్ ఫ్యాక్టరీ, ఎద్దుమైలారం, సంగారెడ్డి – 3,020 ఎకరాలు

ఈ భూములు ఉపయోగంలో లేకుండా ఉండటం, పెట్టుబడులు ఉపసంహరించుకుంటూ ఎటువంటి ప్రత్యామ్నాయ ప్రణాళికలు లేకపోవడం రాష్ట్ర అభివృద్ధికి ఆటంకంగా మారుతుందని మంత్రి స్పష్టం చేశారు. సరైన పరిహారం లేకుండానే భూములను ప్రైవేట్ కంపెనీలకు బదిలీ చేయడం వల్ల రాష్ట్రానికి నష్టమే తప్ప ప్రయోజనం ఉండదని ఆయన అభిప్రాయపడ్డారు.

రాష్ట్ర ప్రభుత్వం ఈ సమస్యల పరిష్కారానికి కేంద్రం ప్రత్యేక దృష్టి పెట్టాలని, భూముల ఉద్దేశ్యపూర్వక వినియోగానికి మార్గదర్శకాలు రూపొందించాలని, రాష్ట్రానికి సముచిత ప్రయోజనం లభించేలా చర్యలు తీసుకోవాలని కేంద్ర మంత్రి కుమారస్వామిని మంత్రి శ్రీధర్ బాబు విజ్ఞప్తి చేయగా అందుకు కేంద్ర మంత్రి సానుకూలంగా స్పందిస్తూ త్వరలోనే ఈ విషయమై సమావేశం ఏర్పాటు చేస్తామని హామీ ఇచ్చారు.

ఈ భేటీలో పరిశ్రమల శాఖకు చెందిన ఉన్నతాధికారులు కూడా పాల్గొన్నారు.

Share this post

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

IN ARTICLE