⭐ గ్రామాల అభివృద్ధిలో సర్పంచ్ల పాత్ర కీలకం అని మంత్రి సీతక్క వ్యాఖ్య
⭐ గ్రామపంచాయతీల నిర్వహణకు రూ.500 కోట్ల నిధుల మంజూరు
⭐ బాల్యవివాహాల నిర్మూలనలో సర్పంచ్లు ముందుండాలని సూచన
ములుగు, ఫిబ్రవరి 17, 2026
గ్రామాల అభివృద్ధిలో సర్పంచ్ల పాత్ర అత్యంత కీలకమని రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి, మహిళా శిశు సంక్షేమ శాఖ మంత్రి దనసరి అనసూయ సీతక్క పేర్కొన్నారు. గ్రామాలు అభివృద్ధి చెందితేనే రాష్ట్రం సుభిక్షంగా ఉంటుందని ఆమె స్పష్టం చేశారు.
మంగళవారం ములుగు ఆర్ అండ్ బి గెస్ట్ హౌస్లో ములుగు, వెంకటాపూర్, మల్లంపల్లి, గోవిందరావుపేట మండలాలకు చెందిన నూతనంగా ఎన్నికైన సర్పంచ్లకు ఐదు రోజుల శిక్షణ కార్యక్రమాన్ని మంత్రి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన వర్మీ కంపోస్ట్ తయారీ, తడి-పొడి చెత్త నిర్వహణ స్టాళ్లను పరిశీలించారు. అనంతరం ములుగు, మల్లంపల్లి మండలాలకు చెందిన 75 మంది లబ్ధిదారులకు కళ్యాణ లక్ష్మి చెక్కులను పంపిణీ చేశారు.

ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ, సర్పంచ్లు పాలకులుగా కాకుండా ప్రజాసేవకులుగా వ్యవహరించాలని సూచించారు. పంచాయతీరాజ్ చట్టంపై పూర్తి అవగాహనతో గ్రామాభివృద్ధికి కట్టుబడి పనిచేయాలని చెప్పారు. గ్రామ సభలను క్రమం తప్పకుండా నిర్వహిస్తూ, కేంద్ర-రాష్ట్ర ప్రభుత్వాల నుంచి వచ్చే నిధులను ప్రజలకు ఉపయోగపడే పనులకు ఖర్చు చేయాలని సూచించారు. ఉపాధి హామీ పథకంలో కార్మికుల సంఖ్య పెంపుపై దృష్టి పెట్టాలని తెలిపారు.
రాష్ట్రవ్యాప్తంగా గ్రామపంచాయతీల నిర్వహణ కోసం సుమారు రూ.500 కోట్ల నిధులు మంజూరు చేసినట్లు మంత్రి వెల్లడించారు. గ్రామాల్లో మౌలిక వసతుల అవసరాలపై ప్రత్యేక బృందాలతో సర్వే నిర్వహిస్తున్నామని తెలిపారు. బాల్యవివాహాల నిర్మూలన, అత్యంత పేద కుటుంబాల గుర్తింపు, మహిళా సంఘాల ప్రోత్సాహం వంటి అంశాల్లో సర్పంచ్లు చురుకైన పాత్ర పోషించాలని సూచించారు.
శిక్షణ కార్యక్రమంలో పంచాయతీరాజ్ చట్టం, సర్పంచ్ల బాధ్యతలు, విధులపై ఐదు రోజుల పాటు సమగ్ర అవగాహన కల్పించాలని సంబంధిత అధికారులకు మంత్రి ఆదేశించారు.
ఈ కార్యక్రమంలో జిల్లా అదనపు కలెక్టర్ (స్థానిక సంస్థలు) సంపత్ రావు, గ్రంథాలయ సంస్థ చైర్మన్ భానోత్ రవిచంద్ర, మార్కెట్ కమిటీ చైర్మన్ రేగ కళ్యాణి, జిల్లా పంచాయతీ అధికారి, ఆత్మ కమిటీ చైర్మన్ తదితరులు పాల్గొన్నారు.

