దాదాపు ఆరు నెలల కింద తాత్కాలిక సాయుధ పోరాట విరమణ పేరుతో మొదలైన ఓ విద్రోహ పర్వం ఇప్పుడు అమరుల కుటుంబాలకు ఓదార్పు అనే అసహ్యకరమైన అంకానికి చేరుకుంది. నిజమే.. అమరులందరూ ఓ ఆరు నెలల కింది వరకు మీ సహచరులే. వారికి మీరు నాయకులు కూడా అయి ఉండొచ్చు. కలుసున్నంత కాలం మీరు వారితో అభిమానంతో ఉన్నవారే కావచ్చు. ఆపదల్లో ఒకరినొకరు ఆదుకున్నవారే కావచ్చు. కాదనలేం. కానీ ఇప్పుడు మీరు స్పష్టంగా రాజ్యం పట్ల, వర్గ పోరాటం పట్ల, మొత్తంగా విప్లవం పట్ల ఒక భిన్నమైన రాజకీయ దృక్పథాన్ని చేపట్టారు కదా! అరవయ్యేళ్లుగా కొనసాగిన ఒక పంథాను వదిలిపెట్టారు కదా! వదిలిపెట్టడమే కాదు… చేసిందంతా తప్పని, అసలు భారత విప్లవానికి చైనా మార్గం కానీ, రష్యా మార్గం గానీ ఏదీ పనికిరాదని.. అరవయ్యేళ్ల కృషి అంతా మిడిమిడి జ్ఞానంతో చేసిందేనని పత్రికాముఖంగా ప్రకటించుకున్నారు కదా! మరి అలాంటప్పుడు చివరి వరకూ విప్లవ పంథాపై నిలబడి ప్రాణాలిచ్చిన వారితో రాజకీయంగా ఏం సంబంధం ఉంటుంది మీకు? ఎలా ఉంటుంది?
బట్టుపల్లి ప్రజలు కానీ, మరొక ప్రాంత ప్రజలు గానీ మీ అందరినీ ఆదరించడానికైనా లేదా నిర్బంధాలను ఎదిరిస్తూ, ప్రాణత్యాగాలు చేస్తూ మిమ్మల్ని కాపాడుకోవడానికైనా ప్రధాన కారణం విప్లవాశయంపైన, విప్లవ సంస్థపైన, విప్లవ పంథాపైన ఉన్న నమ్మకమే అన్న విషయం మీకు తెలియనిదా? వ్యక్తులు ఇవాళ ఉంటారు, రేపు ఉండకపోవచ్చనే గతితార్కిక సూత్రం తెలియనంత అమాయకులు కారు కదా వాళ్లు. కాబట్టి ఎమోషనల్గా మాట్లాడి మీరు ఎవరినీ మభ్యపెట్టలేరు.
నిన్నమొన్న అమరుడైన పడ్కల్ స్వామి (ప్రభాకర్) సహా ఇటీవలి అమరుల్లో అత్యధికులు మీ పంథా తప్పని మీ ముఖంమీదే చెప్పిన వాళ్లు. ఇందులో ఎవరికైనా అనుమానం ఉంటే వేణుగోపాల్ ఇండియన్ ఎక్స్ప్రెస్కు, ఐడ్రీమ్స్కు ఇచ్చిన ఇంటర్వ్యూ చూడండి – ప్రభాకర్ గురించి ఆయన ఏం మాట్లాడాడో, రాజు దాద గురించి, బసవరాజు గురించి ఏం చెప్పాడో! వారందరూ మీ సాయుధ లొంగుబాటు పంథాను వ్యతిరేకించిన వారేనని మీ ఇంటర్వ్యూల్లోనే ఉంది. కానీ ఈ విషయాన్ని బట్టుపల్లి గ్రామ ప్రజలకు గానీ, మీడియా చానెల్స్కు గానీ చెప్పకుండా దాటవేసి, బాధలో, దుఃఖంలో ఉన్న అమరుల కుటుంబాల భావోద్వేగాలతో ఎందుకు ఆడుకున్నారు?
‘ఈ నిర్ణయం ముందే తీసుకుంటే చాలా మందిని కాపాడగలిగేవాళ్లం’ అని మీరు ఎమోషనల్గా మాట్లాడుతున్నది వినడానికి బాగానే ఉంటుంది. బాధలో ఉన్న సామాన్య ప్రజలకు నిజమే అనిపించవచ్చు. కానీ వాళ్లు బతికున్నంత వరకూ ఆచరించిన రాజకీయ పంథానే వేరు అయినప్పుడు, లేదా మీ లొంగుబాటు ప్రతిపాదనపైనే వారికి విరుద్ధ అభిప్రాయం ఉన్నప్పుడు వాళ్లను మీరు కాపాడడం అనే ప్రశ్న ఎలా తలెత్తుతుంది? వాళ్లు మీ పంథాతో ఏకీభవిస్తే కదా వారిని మీరు కాపాడగలిగేది లేదా ఈ రాజ్యం వారిని ప్రాణాలతో వదిలిపెట్టేది! వాళ్లు మీ లొంగుబాటు ప్రతిపాదనను సైద్ధాంతికంగానే విభేదించి అమరులయ్యారనే విషయాన్ని స్పష్టంగా మాట్లాడకుండా ఎందుకు నీళ్లు మింగుతున్నారు? దశాబ్దాల వర్గ పోరాటంలోనైనా, అమరత్వంలోనైనా… వాళ్లు స్వచ్ఛందంగా ఆచరించిన పంథా కదా అది?
రాజకీయంగా, సైద్ధాంతికంగా భిన్నమైన ఆచరణలోకి దిగుతున్న మీరు ఆ అమరులకు రాజకీయ వారసులు ఎన్నటికీ కాలేరు. అవును… మేం బయట ఉన్న వాళ్లం. అమరులకు తల్లులం, తండ్రులం, అన్నలం, అక్కలం, తమ్ములం, చెల్లెలం, జీవిత సహచరులం. అక్కడ వాళ్లు ఏమేం ఎదుర్కొన్నారో, ఎయే కష్టాలు పడ్డారో, వారి కోసం మీరేం చేశారో లేదా ఏం చేయలేదో మాకేం తెలుసు? ఎలా తెలుస్తుంది? వారి ప్రాణాలను కాపాడేందుకు చాలా కష్టపడ్డామని ఎందుకు గొప్పగా చెప్పుకుంటున్నారు? మీరు కూడా ఎంతో మంది ప్రజలు, కార్యకర్తలు కాపాడితేనే కదా ప్రాణాలతో మిగిలింది. అది చాలా సహజమైన విషయం కదా విప్లవోద్యమంలో.
మీరు వారికి ద్రోహమే చేశారో, లేదా వారి ప్రాణాలను కాపాడే ప్రయత్నమే చేశారో… మాకు తెలియదు. మీరు మంచివాళ్లే కావచ్చు. మీది చాలా మంచి స్వభావమే కావచ్చు… కానీ మీరు ఏ రాజ్యంతో కుమ్మక్కయ్యారో లేదా ఏ రాజ్య సంస్థలతో ఒప్పందాలకు దిగి సామూహిక సాయుధ లొంగుబాటుకు సిద్ధపడ్డారో దాని స్వభావం మీద, మీకున్నంత కాకపోయినా, కొంత అవగాహనైతే మాకుంది.
మొత్తంగా… ఇప్పుడు మీవి వేరే రాజకీయాలు. మీది వేరే ఆచరణ. మా వాళ్లది… ప్రాణాలర్పించిన మా కుటుంబాల సభ్యులది వేరే రాజకీయ పంథా. వాళ్లు ఆ పంథాపైనే నిలబడి, దాని కోసమే ప్రాణాలర్పించారనే తృప్తిని మాకు మిగలనీయండి. ఎంత దుఃఖంలోనైనా వాళ్లను తలచుకున్న ప్రతిసారీ మేం గర్వపడే విషయాల్లో ఇదే ముఖ్యమైంది – కొన ఊపిరి వరకూ వాళ్లు తమ లక్ష్యం నుంచి, లక్ష్యసాధన నుంచి, తాము నమ్మిన విప్లవ సిద్ధాంతం నుంచి పక్కకు మళ్లలేదు! శత్రు చేతికి చిక్కి తీవ్రమైన చిత్రహింసలను ఎదుర్కొన్నప్పుడు కూడా వాళ్లు విప్లవం మీద, ప్రజల అంతిమ విజయం మీద అపారమైన నమ్మకంతో ప్రాణాలివ్వడానికి సిద్ధపడ్డారే తప్ప.. మీ మాదిరిగా, మీరు బట్టుపల్లిలో మాట్లాడినట్టుగా ‘రాజ్యాంగబద్ధంగా, చట్టబద్ధంగా, ప్రభుత్వాలు లేదా ఇంటలిజెన్స్ సంస్థలు సూచించిన మార్గంలో విప్లవోద్యమాన్ని ముందుకు తీసుకెళ్తామ’ని మా వాళ్లు భ్రమ పడలేదన్న వాస్తవం ఇంత దుఃఖంలోనూ ఒక ఊరట.
మీరిప్పుడు ‘పదేళ్ల ముందే ఈ నిర్ణయం తీసుకోవాల్సి ఉండె లేదా పదిహేనేళ్ల కిందే ఆలోచించుకోవాల్సి ఉండె’ లాంటి వ్యాఖ్యలు, విశ్లేషణలు చేసి మా కుటుంబ సభ్యులు (అమరులు) ఏదో తప్పు చేసి చనిపోయారని లేదా అమాయకంగా ప్రాణాలు పోగొట్టుకున్నారనే అభిప్రాయం కలిగేలా మాట్లాడకండి. మీరు ప్రాణభయంతో వచ్చినా, ప్రాణాలకు తెగించే వచ్చినా అదిప్పుడు మాకు అప్రస్తుతం. అవసరం లేని విషయం. మీరు చెప్పే రాజకీయాలే మాకైనా, మరెవరికైనా ప్రధానం.
నిజమే… మీ లొంగుబాటు తీరుతెన్నుల మీద, వెకిలి నవ్వుల మీద, అందరూ లొంగిపోవాలనే రాజ్యం హుకుంను మీరు ఫోన్ నంబర్లిచ్చి మరీ అమలు చేసేందుకు పూనుకోవడం మీద, ‘శవాల మీద ఎర్రజెండాలు కప్పడం కోసం ఎదురు చూస్తున్నారా’ లాంటి వెగటు వ్యాఖ్యల మీద కడుపు రగిలి మాలో కొందరం ఏదో మాట్లాడితే మాట్లాడి ఉండొచ్చు. కానీ మీరు విప్లవ ద్రోహులు, కోవర్టులు లేదా ప్రతిఘాతకులు అంటూ నిర్దిష్టమైన విమర్శలు చేసింది మేం కాదు… నిన్నమొన్నటి వరకూ పార్టీకి అత్యున్నత స్థాయిలో నాయకత్వం వహించిన నాయకులే. వాళ్ల స్టేట్మెంట్లు, ఇంటర్వ్యూలు మరోసారి చదువుకోండి. కావాలంటే వాళ్లకు ఇచ్చుకోండి – మీ వివరణలు.
చివరగా… విప్లవోద్యమాల్లో త్యాగాలకు ఎంత సుదీర్ఘ చరిత్ర ఉందో, ద్రోహాలకు కూడా అంతే చరిత్ర ఉంది. నిన్నమొన్నటి వరకు మిమ్మల్ని వ్యతిరేకించిన వాళ్లు, విమర్శించిన వాళ్లు కూడా ఇవాళ లొంగిపోతున్నంత మాత్రాన మీరు చెప్పిందే పరమసత్యం లేదా మీ దారే గొప్పదారిగా మారిపోదు. ఎక్కువలో ఎక్కువ… అవి చిన్నగీతల ముందు పెద్దగీతలో లేదా పెద్ద గీతల ముందు చిన్నగీతలో అవుతుండవచ్చు. కాబట్టి ఈ అధ్యాయాన్ని భవిష్యత్ చరిత్రకు వదిలిపెడదాం. చరిత్ర చాలా నిర్దాక్షిణ్యమైంది! కాబట్టి… విప్లవ పంథాను నమ్మి, ఆచరించి, దాని కోసమే ప్రాణాలర్పించిన అమరుల పేర్లను, కుటుంబాలను దయచేసి వాడుకోకండి. ఎందుకంటే… వారు వేరు, మీరు వేరు!
– అమరుల కుటుంబ సభ్యులు…( Papanna Lanka fb wall నుంచి copy pest )


