హైదరాబాద్: కాళేశ్వరం ప్రాజెక్టు ఇంజనీర్ ఇన్ చీఫ్ (ఈఎన్సీ) భూక్యా హరిరామ్ ఇంటిపై జరిగిన ఏసీబీ దాడులలో సంచలన విషయాలను వెలుగు చూసాయి. కోట్ల విలువ చేసే ఆస్తులు బయట్టపడ్డాయి. హరిరామ్ నివాసం సహా 14 ప్రాంతాల్లో ఏకకాలంలో దాడులు నిర్వహించిన అధికారులు ఆయన వద్ద నుంచి రూ.200 కోట్లకుపైగా అక్రమ ఆస్తులు గుర్తించారు. ఇంకా ఆస్తులపై తనిఖీలు కొనసాగుతున్నాయి.
హరిరామ్ను పోలీసులు అర్ధరాత్రి సమయంలో న్యాయమూర్తి ముందు హాజరుపరిచారు. విచారణ చేసిన జడ్జి హరిరామ్కు 14 రోజుల రిమాండ్ విధించారు.
ఏసీబీ అధికారులు గజ్వేల్, మార్కూక్, షేక్పేట్, కొండాపూర్, మాదాపూర్, శ్రీనగర్ కాలనీ తదితర ప్రాంతాల్లో విలువైన భూములు, ఫ్లాట్లు, ఇండిపెండెంట్ ఇళ్లను గుర్తించారు. పటాన్ చెరువులో 20 గుంటల భూమి, బొమ్మలరామారంలో ఆరు ఎకరాల మామిడి తోటతో కూడిన ఫామ్హౌస్ కూడా ఉన్నట్లు వెల్లడైంది. ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతిలో కూడా ఆయనకు వాణిజ్య స్థలం ఉన్నట్టు గుర్తించారు.
ఇది మాత్రమే కాదు, హరిరామ్ వద్ద బీఎండబ్ల్యూ కార్లు, భారీ మొత్తంలో బంగారు ఆభరణాలు, బ్యాంక్ డిపాజిట్లు కూడా ఉన్నట్టు అధికారులు తెలిపారు. మార్కెట్ విలువ ప్రకారం, హరిరామ్ ఆస్తుల విలువ మరింత ఎక్కువగా ఉండే అవకాశం ఉందని ఏసీబీ తెలిపింది.
దాడుల సందర్భంగా హరిరామ్ ఇంట్లో ఉన్న కంప్యూటర్లు, లాప్టాప్లు, కీలక పత్రాలను స్వాధీనం చేసుకున్నారు. హరిరామ్ భార్య అనిత కూడా ఇరిగేషన్ విభాగంలో డిప్యూటీ ఈఎన్సీగా పని చేస్తున్నారు. దర్యాప్తు లోపల ఆమెను కూడా అధికారులు ప్రశ్నించినట్లు సమాచారం.
హరిరామ్ స్వగ్రామం భద్రాద్రి కొత్తగూడెం జిల్లా లక్ష్మీదేవిపల్లి మండలం ఎదురుగడ్డలోని నివాసం, బంధువుల ఇళ్లపై కూడా ఏసీబీ బృందం దాడులు నిర్వహించింది.
అయితే, గత కొద్దికాలంగా దాడులు జరుగుతాయనే సమాచారం అందడంతో హరిరామ్ ముందుగానే జాగ్రత్తలు తీసుకున్నట్టు తెలుస్తోంది. బినామీల పేర్లతో ఆస్తులు నమోదు చేసి ఉండొచ్చని అనుమానంతో అధికారులు మరింత లోతుగా విచారణ జరుపుతున్నారు.