నందమూరి ఫ్యామిలీ ట్రీజూనియర్ ఎంట్రీతోనే.

నందమూరి ఫ్యామిలీ ట్రీ
జూనియర్ ఎంట్రీతోనే..!

*ఎన్టీఆర్ రాజకీయాల్లోకి
రావాలి..
*ఇది నందమూరి
అభిమానుల ఆకాంక్ష..

Happy birthday NTR jr

ఆంధ్ర ప్రదేశ్ రాజకీయాల్లో
ఇక ఎన్టీఆర్ వారసత్వం ముగిసినట్టేనా..

లేదా జూనియర్ ఎన్టీఆర్ రూపంలో ఏమైనా ఆశ ఉందా..

ప్రస్తుతానికైతే ఇది చాలా క్లిష్టమైన ప్రశ్నగానే కనిపిస్తున్నా..
జూనియర్ ఎన్టీఆర్ మనసులో ఏముంది అనేది తెలియకపోయినా.. ఆయనకు గల లక్షలాదిమంది అభిమానులు ఆయన ఎప్పటికైనా రాజకీయాల్లోకి రావాలని కోరుకుంటున్నారు..
వస్తారని నమ్ముతున్నారు.

నందమూరి తారక రామారావు 1982లో ప్రారంభించిన తెలుగుదేశం పార్టీ ఆయన నాయకత్వంలోనే చివరివరకు కొనసాగలేకపోయింది.
ఇందుకు కారణాలు అందరికీ తెలిసినవే.1995లో జరిగిన పరిణామాలను ఈ రాష్ట్రమే కాదు,దేశమే కాదు, ప్రపంచం యావత్తు గమనించింది.
అందుకు దారి తీసిన కారణాలు ఏవైతే గాని చంద్రబాబు నాయుడు 1995 ఆగస్టులో నందమూరి తారక రామారావును పదవీచ్యుతున్ని చేసి తాను ముఖ్యమంత్రి స్థానంలో కూర్చోవడమే గాక ఎన్టీఆర్ స్థాపించిన తెలుగుదేశం పార్టీని తన అధీనంలోకి తెచ్చుకున్నారు.

ఈ అధికార మార్పిడి కార్యక్రమాన్ని చంద్రబాబు నాయుడు ఎంతో పటిష్టంగా అమలు చేశారు .ఇందుకు ఆయన స్వయంగా ఎన్టీఆర్ కుటుంబం సహాయాన్ని తీసుకున్నారు .ఎన్టీఆర్ అంటే అమితంగా గౌరవం చూపించే ఆయన కుమారులు హరికృష్ణ, బాలకృష్ణ మాత్రమే గాక చంద్రబాబుతో పెద్దగా సఖ్యత లేని పురందేశ్వరి, ఆమె భర్త దగ్గుబాటి వెంకటేశ్వరరావు కూడా ఆ రోజుల్లో చంద్రబాబు నాయుడుకు సహకరించారు.
ఇదంతా చరిత్ర మరవని
ఒక ఘట్టం.

ఆనాటి నుంచి తెలుగుదేశం పార్టీకి చంద్రబాబు నాయుడు తిరుగులేని నాయకుడిగా చలామణి అవుతున్నారు. ఎన్టీఆర్ కుటుంబం నుంచి అత్యంత పవర్ఫుల్ వ్యక్తులుగా పరిగణించే హరికృష్ణ ,బాలకృష్ణ కూడా చంద్రబాబు వెంట ఉండిపోయారు.
మధ్యలో హరికృష్ణ వ్యతిరేకించినప్పటికీ కూడా అది అంత బలమైన ప్రభావం చూపించలేకపోయింది.

ఈలోగా నందమూరి బాలకృష్ణ తో వియ్యం అందడం ద్వారా చంద్రబాబు నాయుడు బాలకృష్ణ దూకుడుకు కెల్లెం వేయగలిగారు.
ఇదంతా ఇంకో పార్శ్వం.

తదనంతర పరిణామాలలో పురందేశ్వరి,దగ్గుబాటి వెంకటేశ్వరరావు కూడా చంద్రబాబు నాయుడుకి దూరమైనప్పటికీ వారి ప్రభావం కూడా జనాల్లో గాని, పార్టీపై గాని లేదు.

అలా ఎన్టీఆర్ స్థాపించిన తెలుగుదేశం పార్టీ ఆయన అల్లుడైతే అయ్యారు కానీ పూర్తిగా నారా వారి
వశమైపోయింది.

ఎన్టీఆర్ తర్వాత మళ్లీ
అంత పాపులారిటీ సంపాదించుకున్న బాలకృష్ణ ఏదో ఒక దశలో తండ్రి స్థాపించిన పార్టీ పగ్గాలు అందుకోగలరని నందమూరి అభిమానులు ఆశపడినా బాలకృష్ణ ఏ దశలోనూ ఆ దిశగా అడుగులు వేయలేదు .ఆయన పూర్తిగా తన బావ,వియ్యంకుడు అయిన చంద్రబాబు వెంటే ఉండిపోయారు.

కాలం ఇలా గడుస్తుండగా ఇప్పుడు తెలుగుదేశం పార్టీ నాయకత్వం చేతులు మారబోతుందని వార్తలు వస్తున్నాయి.చంద్రబాబు తన రాజకీయ వారసుడుగా కుమారుడు నారా లోకేష్ ను ఇప్పటికే సిద్ధం చేసి ఆయనకు పార్టీ పగ్గాలు అప్పగించడమే గాక త్వరలోనే కుమారుడికి ముఖ్యమంత్రిగా పట్టాభిషేకం చేసే ప్రణాళికలో కూడా ఉన్నారు .అందుకు తగిన గ్రౌండ్ వర్క్ అంతా ఇప్పటికే పూర్తయింది .ఏదో ఒక సమయంలో నిర్ణయం ప్రకటించడమే తరువాయి.

సరిగ్గా ఈ దశలోనే ఎన్టీఆర్ వారసత్వంపై రాష్ట్రంలో మరోసారి చర్చ మొదలైంది. హరికృష్ణ ఇప్పుడు లేరు. బాలకృష్ణ పూర్తిగా చంద్రబాబు పక్షాన ఉన్నారు.ఇక ఎన్టీఆర్ అభిమానుల ఆశలన్నీ ఆయన నటవారసత్వాన్ని నూటికి నూరు శాతం అందిపుచ్చుకున్న మనవడు జూనియర్ ఎన్టీఆర్ పైనే ఉన్నాయి. జూనియర్ ఎన్టీఆర్ రాజకీయాల్లోకి వచ్చి తాత పేరు నిలబెట్టాలనే నినాదం అభిమానుల నుంచి చాలాకాలంగా వినిపిస్తున్నదే. అయితే ప్రస్తుతానికి ఎన్టీఆర్ పూర్తిగా నటనపైనే దృష్టి పెట్టి పనిచేస్తున్నారు. ఆయనకు రాజకీయాల పట్ల ఆసక్తి ఉందనే సూచనలు ఇప్పటికే ఉన్నాయి.ఆయన తనకు అత్యంత సన్నిహితులైన ఒకరిద్దరి కోసం ప్రచారం చేసి వారిని గెలిపించిన దృష్టాంతాలు కూడా లేకపోలేదు. ప్రత్యక్షంగా రాజకీయాలతో ప్రమేయం పెట్టుకోకపోయినా జూనియర్ ఎన్టీఆర్ ఎప్పటికప్పుడు రాష్ట్రంలో,దేశంలో జరుగుతున్న రాజకీయ పరిణామాల గురించి సన్నిహితుల వద్ద చర్చలు జరుపుతుంటారనే
సమాచారం ఉంది.
ఆయనకు రాజకీయాలపై ఆసక్తి ఉందని ,ఎప్పటికైనా రాజకీయాల్లోకి అడుగు పెట్టాలనే సంకల్పం ఉందని కూడా ఆయన సన్నిహితులు అప్పుడప్పుడు చెబుతూ ఉంటారు.అయితే నటుడుగా తనను తాను మరింతగా నిరూపించుకుని తాత స్థాయి,వయసు వచ్చిన తర్వాత రాజకీయాల్లోకి రావాలన్నది ఎన్టీఆర్ ఆలోచనగా ఆయన సన్నిహితులు చెబుతుంటారు.

తెలుగుదేశం పార్టీలో కూడా సీనియర్ ఎన్టీఆర్ ను ఇప్పటికీ విపరీతంగా అభిమానించే వర్గాలు ఆయన వారసుడిగా బాలకృష్ణ రావాలని మొదట్లో కోరుకున్నా అది జరగదని తెలిసిన తర్వాత జూనియర్ ఎన్టీఆర్ రాజకీయాల్లోకి రావాలని కోరుకుంటున్నారు.

రానున్న రోజుల్లో జూనియర్ ఎన్టీఆర్ ఖచ్చితంగా రాజకీయాల్లోకి వస్తారని,
తాతలా తాను సైతం చరిత్ర సృష్టిస్తారని అభిమానులు ఆశిస్తున్నారు. మరి జూనియర్ ఎన్టీఆర్ అలాంటి నిర్ణయం ఎప్పుడు తీసుకుంటారో వేచి చూడాలి..
ఈఎస్కే..జర్నలిస్ట్..

Share this post

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

IN ARTICLE

Trending Global

ఇరాన్ పై ఇండియా వైఖరిలో ఎందుకు మార్పు వచ్చింది
మడ్ ఫెస్టివల్స్ ఎందుకు జరుపుకుంటారు ?
అమెరికాలో రోడ్డు ప్రమాదంలో చనిపోయిన జాహ్నవి కందుల కుటుంబానికి 262 కోట్ల పరిహారం
సొంత జన్యువులతో ‘సూపర్ రేస్’ -బట్టబయలైన జెఫ్రీ ఎఫ్ స్టీన్ రహస్యం