పాతబస్తీకి కొత్త రూపం: ప్రపంచ నగరంగా హైదరాబాద్‌ ఉపముఖ్యమంత్రి భట్టి

Bhatti deputy cm

హైదరాబాద్, మే 22,2025: హైదరాబాద్‌ను అంతర్జాతీయ స్థాయిలో తీర్చిదిద్దేందుకు ప్రణాళికాబద్ధంగా అభివృద్ధి పనులు నడుస్తున్నాయని ఉప ముఖ్యమంత్రి మల్లు విక్రమార్క భట్టి తెలిపారు. ఎన్ని నిధులైన ఖర్చు పెట్టేందుకు సిద్ధ మని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చాలాపట్టుదలగా ఉన్నారని ఉపముఖ్యమంత్రి భట్టి విక్రమార్క మల్లు స్పష్టం చేశారు. పాతబస్తీ అభివృద్ధిపై రాష్ట్ర సచివాలయంలో గురువారం నిర్వహించిన సమీక్ష సమావేశంలో ఆయన మంత్రులు ఎమ్మెల్యేలు అధికారులతో సుదీర్ఘంగా సమీక్షించారు.

హైదరాబాద్ ఇన్‌ఛార్జి మంత్రి పొన్నం ప్రభాకర్, పలు అసెంబ్లీ నియోజక వర్గాల ఎమ్మెల్యేలు పాల్గొన్నారు. చార్మినార్, మలక్ పేట్, కార్వాన్, యాకుత్ పురా, బహదూర్పుర, చంద్రాయణ్ గుట్ట, నాంపల్లి నియోజకవర్గాల్లో జరుగుతున్న అభివృద్ధి పనులపై సమీక్ష జరిగింది.

భారీగా నిధుల విడుదల

భట్టి విక్రమార్క మాట్లాడుతూ హైదరాబాద్ అభివృద్ధికి గత బడ్జెట్‌లో ఏకంగా 10,000 కోట్ల రూపాయలు కేటాయించడం చారిత్రాత్మకమని అన్నారు. ఇదే స్ఫూర్తితో ఈ సంవత్సరం కూడా అంతే స్థాయిలో నిధులు కేటాయించనున్నట్లు చెప్పారు.

గోదావరి నీటి ప్రాజెక్టు – 7400 కోట్లతో మరో దశ

హైదరాబాద్ తాగునీటి అవసరాల్ని తీర్చేందుకు గోదావరి జలాలపై ఆధారపడుతున్నారు. ఫేజ్ 2, ఫేజ్ 3 ద్వారా 20 టీఎంసీల నీటిని నగరానికి తీసుకురావడంపై చర్యలు చేపట్టారు. ఇందులో 5 టీఎంసీలు మూసీ పునరుజ్జీవనానికి, మిగతా 15 టీఎంసీలు తాగునీటి అవసరాలకు వినియోగించనున్నారు.

మెట్రో విస్తరణకు కొత్త దిశ

ఎంజీబీఎస్ నుంచి చంద్రయాణ్ గుట్ట వరకు 7.5 కిలోమీటర్ల మెట్రో మార్గం నిర్మాణానికి 2714 కోట్లు, అలాగే జేబీఎస్ నుంచి మేడ్చల్, షామీర్పేట్, శంషాబాద్ ఎయిర్‌పోర్ట్ నుంచి ఫ్యూచర్ సిటీ వరకు మెట్రో విస్తరణకు 19,579 కోట్ల రూపాయల ప్రతిపాదనలు కేంద్రానికి పంపినట్లు తెలిపారు.

మూసీ నది పునరుజ్జీవనం, ఎస్టీపీలు

హైదరాబాద్‌లో 3840 కోట్ల రూపాయలతో 39 ఎస్టీపీలు** నిర్మించబడుతున్నాయి. 2014కి ముందు 25 ఎస్టీపీలు మాత్రమే ఉండగా, గత ప్రభుత్వాలు మరో 20 మాత్రమే నిర్మించాయని తెలిపారు. ప్రజా ప్రభుత్వం ఒకే ఏడాదిలోనే ఈ భారీ ఎత్తున ఎస్టీపీలు చేపట్టడం గర్వకారణమన్నారు.

మురుగునీటి వ్యవస్థ ఆధునీకరణ

చంద్రయాణ్ గుట్టలో 156 కిలోమీటర్ల నాళాల పాత వ్యవస్థను 301 కోట్ల రూపాయలతో ఆధునీకరిస్తున్నారు. ఈ పనులు వేగంగా సాగుతున్నాయి.

విద్యుత్ రంగంలో మార్పులు

పాత నగరంలో ఇప్పటికే 42 సబ్‌స్టేషన్లు ఉండగా, ఈ ఏడాది మరో 18 సబ్‌స్టేషన్లు ఏర్పాటు చేశారు. అండర్ గ్రౌండ్ కేబుల్స్ పనుల్లో 25% పూర్తి కాగా, మిగిలిన పనులకు ప్రతిపాదనలు సిద్ధమవుతున్నాయి.

అగ్ని ప్రమాదాల నివారణకు చర్యలు

గుల్జార్ హౌస్ సమీపంలో ఇటీవల జరిగిన అగ్నిప్రమాదాన్ని గుర్తు చేసిన భట్టి విక్రమార్క, “ఇలాంటి ఘటనలు మళ్లీ జరగకుండా పకడ్బందీ చర్యలు తీసుకుంటాం” అని తెలిపారు. దీనిపై సీఎం రేవంత్ రెడ్డి ప్రత్యేక కమిటీ వేసినట్లు వెల్లడించారు.

ఎంఐఎం ఎమ్మెల్యేల కృతజ్ఞత

పాతబస్తీ అభివృద్ధికి చేపడుతున్న చర్యలపై ఎంఐఎం ఎమ్మెల్యేలు ప్రభుత్వానికి కృతజ్ఞతలు తెలిపారు. మెట్రో విస్తరణ ఎస్టీపీలు గోదావరి జలాల ప్రాజెక్టు వంటి పథకాలపై అభినందనలు తెలిపారు. చార్మినార్ పాదాచారుల ప్రాజెక్టు త్వరలో పూర్తి చేసి ప్రారంభించనున్నట్లు అధికారులు తెలిపారు.

ప్రతి నియోజకవర్గంలో అంబేద్కర్ నాలెడ్జీ సెంటర్లు ఏర్పాటు చేసేందుకు స్థలాలు గుర్తించాలంటూ ఎమ్మెల్యేలకు సూచనలు చేశారు. పాతబస్తీలో జరుగుతున్న పనులు నిర్ణీత గడువులోగా పూర్తి చేయాలని అధికారులకు స్పష్టం చేశారు.

Share this post

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

IN ARTICLE