తెలంగాణను నక్సల్స్ రహిత రాష్ట్రంగా తీర్చిదిద్దిన పోలీస్ అధికారులను సన్మానించిన కేంద్ర హోం మంత్రి అమిత్ షా
జగదల్పూర్ (ఛత్తీస్గఢ్):
దేశాన్ని పట్టి పీడిస్తున్న వామపక్ష తీవ్రవాదానికి ముగింపు పలికి, నక్సలిజం రహిత సమాజాన్ని నిర్మించడమే కేంద్ర ప్రభుత్వ సంకల్పమని కేంద్ర హోం మంత్రి అమిత్ షా అన్నారు. చతిస్గడ్ లోని జగదల్పూర్ లో సోమవారం నాడు తీవ్రవాద ప్రభావిత ప్రాంతాల లో మావోయిస్టుల నిర్మూలనకు కృషి చేసిన పోలీస్ అధికారులను సన్మానించారు .తెలంగాణ రాష్ట్రంలో నక్సలిజాన్ని సమూలంగా అణచివేసి, రాష్ట్రాన్ని నక్సల్స్ రహితంగా తీర్చిదిద్దడంలో ప్రతిభ కనబరిచిన తెలంగాణ పోలీస్ ఉన్నతాధికారులను సన్మానించారు. ప్రత్యేకించి తెలంగాణ రాష్ట్రంను ప్రస్తావించారు.
ఈ సందర్భంగా తెలంగాణ డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ శ్రీ సివి ఆనంద్, రాష్ట్ర భద్రతా సలహాదారు మరియు మాజీ డిజిపి బి.శివధర్ రెడ్డి, డీజీపీ ఆపరేషన్స్ (ఆక్టోపస్ & గ్రేహౌండ్స్) అనిల్ కుమార్, మల్కాజ్గిరి కమిషనర్ & మాజీ ఎస్ఐబీ ఐజీపీ సుమతితో పాటు ఆమె నేతృత్వంలోని ఎస్ఐబీ బృందాన్ని అమిత్ షా సత్కరించి, వారి విశేష సేవలను అభినందించారు.
ఈ సందర్భంగా హోం మంత్రి అమిత్ షా మాట్లాడుతూ.. జనవరి 2024లో ఒక అంతర్గత సమావేశంలో 31 మార్చి 2026 నాటికి దేశంలో నక్సలిజాన్ని పూర్తిగా తుడిచిపెట్టాలని తాము కాలపరిమితిని నిర్దేశించుకున్నట్లు వెల్లడించారు.
“మేం ఈ నిర్ణయం తీసుకున్నప్పుడు చాలామంది ప్రైవేట్ చర్చల్లో ఇది సాధ్యం కాదంటూ సందేహాలు వ్యక్తం చేశారు. కానీ మేం స్పష్టమైన ప్రణాళికతో, పక్కా వ్యూహంతో ముందుకు సాగాం. మా దంతేశ్వరి అమ్మవారి ఆశీస్సులతో ఈ రోజు బస్తర్ ప్రాంతాన్ని నక్సల్స్ రహితంగా ప్రకటించడం ఎంతో సంతోషంగా ఉంది” అని అమిత్ షా పేర్కొన్నారు.
ఛత్తీస్గఢ్ ఇప్పుడు నక్సలిజం మహమ్మారి నుంచి విముక్తి పొందిందని, వామపక్ష తీవ్రవాదానికి వ్యతిరేకంగా సాగిన సుదీర్ఘ పోరాటంలో ఇదొక చారిత్రాత్మక మైలురాయి అని ఆయన కొనియాడారు.
1970వ దశకం నుంచి 31 మార్చి 2026 వరకు దాదాపు మూడు తరాల పాటు దేశ ప్రజలు నక్సలిజం అనే ఒక పీడకలను చవిచూశారని అమిత్ షా ఆవేదన వ్యక్తం చేశారు. నక్సల్స్ ప్రభావిత ప్రాంతాల్లో తీవ్ర రక్తపాతం, అభివృద్ధి నిలిచిపోవడం, యువత భవిష్యత్తు అంధకారమవ్వడం వంటి పరిస్థితులు ఉండేవని గుర్తుచేశారు.
నక్సలిజం నిర్మూలన పోరాటంలో దేశంలోని దాదాపు అన్ని రాష్ట్రాలకు చెందిన జవాన్లు ప్రాణత్యాగం చేశారని, వారి బలిదానాల వల్లే నేడు ఈ విజయం సాధ్యమైందని హోం మంత్రి అన్నారు.
నక్సలిజం కేవలం ఒక ప్రాంతానికి పరిమితమైన సమస్య కాదని, తన సొంత రాష్ట్రమైన గుజరాత్తో పాటు దేశవ్యాప్తంగా దీనిపై ఆందోళన ఉండేదన్నారు.
ఒక జీవిత కాలంలో సాధించలేమనుకున్న అసాధ్యమైన లక్ష్యాన్ని, భద్రతా దళాల సమన్వయం మరియు పట్టుదలతో సాకారం చేశామని అమిత్ షా హర్షం వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో పలువురు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ ఉన్నతాధికారులు, భద్రతా దళాల ప్రతినిధులు పాల్గొన్నారు.

