భారత రత్న, జననాయక్ కర్పూరి ఠాకూర్ స్పూర్తితో సమన్యాయం
వరంగల్ బార్ అసోసియేషన్ ఉపాధ్యక్షులు మైదం జయపాల్
బడుగు, బలహీన వర్గాల అభ్యున్నతికి, సామాజిక న్యాయం కోసం పోరాడిన బీహార్ మాజీ ముఖ్యమంత్రి కర్పూరీ ఠాకూర్ (1924-1988)కు అత్యున్నత పురష్కారం దక్కిందని, ఆయన చేసిన కృషికి గుర్తుగా ఆయన మరణానంతరం ఆయన శత జయంతి సందర్భంగా భారత ప్రభుత్వం భారతరత్న ప్రకటించి గౌరవించిందని, అలాంటి మహానీయుని స్పూర్తితో న్యాయవాదులు సమన్యాయం కోసం పోరాటం చేయాలని వరంగల్ బార్ అసోసియేషన్ ఉపాధ్యక్షులు మైదం జయపాల్ పిలుపునిచ్చారు.
వరంగల్ బార్ అసోసియేషన్ ఆధ్వర్యంలో మంగళవారం జరిగిన భారత రత్న, జననాయక్ కర్పూరి ఠాకూర్ 38వ వర్ధంతి ఆయన పాల్గొని మాట్లాడారు. 1970వ దశకంలో రెండు సార్లు బీహార్ ముఖ్యమంత్రిగా పనిచేసిన కర్పూరీ ఠాకూర్ జన నాయక్ (జననేత) గా గుర్తింపుపొందారని, రాజకీయంగా అగ్రకులాలు ఆధిపత్యం వహించే బీహార్లో ఒబిసి ల రాజకీయాలకు ఆయన నాంది పలికారని, మొదటిసారి రెండుసార్లు ముఖ్యమంత్రి అయిన కాంగ్రెస్ యేతర సోషలిస్టు నాయకుడు కూడా కర్పూరి ఠాకూరే కావడం విశేషమని అన్నారు.
ఈ కార్యక్రమంలో పాల్గొన్న వరంగల్ బార్ అసోసియేషన్ మాజీ అధ్యక్షులు, ఐ ఎల్ పి ఎ రాష్ట్ర ఉపాధ్యక్షులు తీగల జీవన్ గౌడ్ మాట్లాడుతూ భారత అత్యున్నత పురస్కారమైన భారతరత్న గ్రహీతల్లో ఠాకూర్ 49వ వ్యక్తి అని, అణగారిన వర్గాల ప్రజల అభ్యున్నతి, సమానత్వం, సాధికారత కోసం కర్పూరి ఠాకూర్ తిరుగులేని నిబద్ధతతో పనిచేశారని, ఆయన జీవితం స్ఫూర్తిదాయకమని, విజనరీ నాయకత్వం ద్వారా దేశ సామాజిక-రాజకీయ నిర్మాణంలో ఆయన చెరగని ముద్ర వేశారని ప్రధాని అన్నారు.
ఈ కార్యక్రమంలో పాల్గొన్న ఇండియన్ లీగల్ ప్రొఫెషనల్స్ అసోసియేషన్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సాయిని నరేందర్ మాట్లాడుతూ మంగళి కులంలో జన్మించిన కర్పూరి ఠాకూర్ యుక్త వయసులో స్వాతంత్య్ర ఉద్యమంలో పాల్గొని 26 నెలల పాటు జైలు జీవితం గడిపారని, స్వాతంత్ర్యం వచ్చిన తరువాత 1952లో తొలిసారిగా బీహార్ అసెంబ్లీ ఎన్నికల్లో సోషలిస్టు పార్టీ అభ్యర్థిగా పోటీచేసి గెలుపొందారని తెలిపారు. ఠాకూర్ తన రాజకీయ జీవితంలో అనేక మైలురాళ్లను అధిగమించారని ముఖ్యమంత్రి అవకముందు ఉప ముఖ్యమంత్రిగా, విద్యాశాఖ మంత్రిగా పనిచేశారని తెలిపారు. 1970లో రాష్ట్ర మొదటి కాంగ్రెసేతర ముఖ్యమంత్రిగా చరిత్ర సృష్టించారు. అంతేకాదు అప్పటికే రాష్ట్రాన్ని నాశనం చేస్తున్న మద్యపానాన్ని నిషేధిస్తూ బీహార్లో సంపూర్ణ మద్యపాన నిషేదాన్ని విధించారని, విద్యకు ప్రధాన్యత ఇస్తూ పాఠశాలలు, కళాశాలలను స్థాపించడంలో ముఖ్యపాత్ర పోషించి బీహార్లో అట్టడుగు ప్రజలకు విద్య అందుబాటులోకి వచ్చేలా చేశారని అన్నారు.
ఈ కార్యక్రమంలో పాల్గొన్న ఐ ఎల్ పి ఎ వరంగల్ జిల్లా కన్వీనర్ విలాసాగరం సురేందర్ గౌడ్ మాట్లాడుతూ బిహార్లో రిజర్వేషన్ల అమలుకు ఆద్యుడని స్వాతంత్య్రం అనంతరం భారతదేశంలో సోషలిస్టు ఉద్యమానికి నాయకత్వం వహించిన రామ్ మనోహర్ లోహియా వంటి వ్యక్తుల నుంచి కర్పూరి ఠాకూర్ స్ఫూర్తి పొందారని, ఈ నేపథ్యంలోనే ఓబీసీలకు రిజర్వేషన్ కోసం 1990 మండల్ కమిషన్కు ముందుగానే 1977లో ముంగేరి లాల్ కమిషన్ నివేదిక మేరకు 9178లోనే ముస్లింలలోని బలహీన వర్గాలతో సహా వెనుకబడిన తరగతుల వారి కోసం రిజర్వేషన్లు అమలు చేశారని అన్నారు. కర్పూరీ ఠాకూర్ విధానాలు ఇప్పటికి బీహార్లో కనిపిస్తాయని, లాలూ, నితీశ్, పాశ్వాన్లకు గురువని అన్నారు. బీహార్లో ఓబీసీ రాజకీయాలకు పునాది వేసిన వారిలో కర్పూరి ఠాకూర్ ప్రథములని, గొప్ప రాజనీతిజ్ఞుడిగా గుర్తింపు పొందిన కర్పూరి ఠాకూర్ ఉద్యమ స్పూర్తితో సామాజిక న్యాయం కోసం సమరం చేయాల్సిన అవసరముందని అన్నారు. జనాభా దామాషా ప్రకారంగా ఒబిసి లకు రాజకీయ రిజర్వేషన్ల కోసం ఉద్యమించాల్సిన అవసరముందని అన్నారు.
ఈ కార్యక్రమంలో వరంగల్ బార్ అసోసియేషన్ కోశాధికారి సిరిమల్ల అరుణ, ఐ ఎల్ పి ఎ నాయకులు దయాల సుధాకర్, బండి మొగిలి, జన్ను పద్మ, గురిమిల్ల రాజు, జన్ను ప్రభాకర్, సురేందర్, ఎగ్గడి సుందర్ రామ్, ఎలమాద్రి రవి, న్యాయవాదులు డాక్టర్ జిలకర శ్రీనివాస్, గంధం శివ, కోటేశ్వరరావు, వేముల రమేష్, బండారి విక్రమ్ తదితరులు పాల్గొన్నారు

