సెల్స్ మెనే దొంగగా మారి…
హైదరాబాద్, ఫిబ్రవరి 17: నగరంలోని పంజాగుట్ట ప్రాంతంలో ఉన్న ప్రముఖ జ్యువెలరీ షోరూమ్లో జరిగిన భారీ బంగారం చోరీ కేసును పోలీసులు కేవలం 24 గంటల్లోనే ఛేదించారు. షోరూమ్లో సేల్స్ ఎగ్జిక్యూటివ్గా పనిచేస్తున్న వ్యక్తే రూ.1.6 కోట్ల విలువైన కిలో బంగారాన్ని చాకచక్యంగా దొంగిలించి, చివరకు పోలీసులకు చిక్కాడు.
పంజాగుట్టలోని జ్యువెలరీ షోరూమ్లో ఫిబ్రవరి 14న రాత్రి స్టాక్ పరిశీలన సమయంలో ఒక్కొక్కటి 100 గ్రాముల బరువున్న మొత్తం 10 బంగారు బిస్కెట్లు గల్లంతైనట్లు షోరూమ్ మేనేజర్ జిన్స్ సెబాస్టియన్ గుర్తించారు. వెంటనే పోలీసులకు ఫిర్యాదు చేయడంతో ఘటన వెలుగులోకి వచ్చింది.
ఫిర్యాదు ఆధారంగా దర్యాప్తు ప్రారంభించిన పోలీసులు షోరూమ్లోని సీసీటీవీ ఫుటేజీలను పరిశీలించారు. ఇందులో సేల్స్ ఎగ్జిక్యూటివ్గా పనిచేస్తున్న కె. గోపాలకృష్ణ శనివారం సాయంత్రం సుమారు 4:50 గంటల సమయంలో ఎవరూ గమనించకుండా బంగారు బిస్కెట్లను తన బూట్లు, లోదుస్తుల్లో దాచుకుని షోరూమ్ నుండి బయటకు వెళ్లినట్లు గుర్తించారు. అనంతరం అతడు తన ద్విచక్ర వాహనంపై అక్కడి నుంచి పరారయ్యాడు.
ఈ కేసును సవాలుగా తీసుకున్న పంజాగుట్ట ఏసీపీ మురళీకృష్ణ ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేశారు. నిందితుడి మొబైల్ ఫోన్ డేటా, సీసీటీవీ ఆధారాలను విశ్లేషించిన పోలీసులు అతడు ఆంధ్రప్రదేశ్లోని తాడేపల్లికి వెళ్లినట్లు గుర్తించారు. వెంటనే అక్కడికి చేరుకున్న పోలీసులు నిందితుడి నివాసంపై దాడి చేసి అతడిని అదుపులోకి తీసుకున్నారు.
నిందితుడి వద్ద నుంచి రూ.1.6 కోట్ల విలువైన మొత్తం బంగారాన్ని స్వాధీనం చేసుకున్న పోలీసులు, నేరానికి ఉపయోగించిన ద్విచక్ర వాహనం మరియు స్మార్ట్ఫోన్ను కూడా సీజ్ చేశారు. కేసు నమోదైన రోజే నిందితుడిని అరెస్ట్ చేసి, చోరీకి గురైన సొత్తును పూర్తిగా రికవరీ చేయడంతో పోలీసు దర్యాప్తు బృందాన్ని ఉన్నతాధికారులు అభినందించారు.

