ఉపాధి హామీ పథకాన్ని నిర్వీర్యం చేసే కుట్రను కాంగ్రెస్ సహించదు-MLA నాయిని రాజేందర్ రెడ్డి


ఉపాధి హామీ పథకాన్ని నిర్వీర్యం చేసే కుట్రను కాంగ్రెస్ సహించదు

కొత్త బిల్లును రద్దు చేసే వరకు పోరాటం : డీసీసీ ప్రెసిడెంట్ ఇగాల వెంకట్రామ్ రెడ్డి

హన్మకొండ, జనవరి 10 :
పేదల ఉపాధిని దెబ్బతీసేలా కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన కొత్త బిల్లును రద్దు చేసే వరకు కాంగ్రెస్ పోరాటం చేస్తుందని హన్మకొండ డీసీసీ అధ్యక్షుడు ఇనగాల వెంకట్రామ్ రెడ్డి స్పష్టం చేశారు.

శనివారం హన్మకొండ డీసీసీ భవన్‌లో జిల్లా కాంగ్రెస్ కమిటీ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. ఈ సమావేశంలో పశ్చిమ ఎమ్మెల్యే నాయిని రాజేందర్ రెడ్డి, వర్ధన్నపేట ఎమ్మెల్యే కే.ఆర్. నాగరాజు, ఎమ్మెల్సీ బస్వరాజు సారయ్య పాల్గొన్నారు.

ఈ సందర్భంగా ఇనగాల వెంకట్రామ్ రెడ్డి మాట్లాడుతూ…
ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో సోనియాగాంధీ పర్యటన సందర్భంగా ఆకలి చావులు చూసి చలించిపోయిన కాంగ్రెస్ నాయకత్వం మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ చట్టాన్ని తీసుకువచ్చిందన్నారు. దాదాపు 20 ఏళ్లుగా ఈ పథకం పేదలకు ఉపాధి కల్పిస్తూ జీవనాధారంగా మారిందని చెప్పారు.

కాంగ్రెస్ తీసుకొచ్చిన పథకాలపై కేంద్రంలోని నరేంద్ర మోడీ ప్రభుత్వం విషం కక్కుతోందని, వాటిని నిర్వీర్యం చేసేందుకు కుట్రలు చేస్తోందని ఆరోపించారు. ఉపాధి హామీ పథకం అంటే కాంగ్రెస్ గుర్తుకు వస్తుందనే ఉద్దేశంతోనే దాని పేరును మార్చి ‘వికసిత్ భారత్ గ్యారెంటీ ఫర్ రోజ్‌గర్ అండ్ అజీవికా మిషన్ (గ్రామీణ్) బిల్–2025’ను తీసుకొచ్చారని మండిపడ్డారు.

మహాత్మా గాంధీ పేరును పక్కన పెట్టడంలో ఆంతర్యమేంటో చెప్పాలని డిమాండ్ చేశారు. గాంధీని చంపిన గాడ్సె పేరును గుర్తు చేసే విధంగా వ్యవహరించడం దేశానికి అవమానమన్నారు.

గ్రామాల్లో ఉపాధి హామీ పథకంపై ఆధారపడి మహిళలు, ఎస్సీ, ఎస్టీ, బీసీలు, మైనార్టీలు వంద రోజుల పనితో జీవనం సాగిస్తున్నారని తెలిపారు. గతంలో గ్రామ పంచాయతీ ఆధ్వర్యంలో 226 రకాల పనులు చేపట్టే అవకాశం ఉండేదని, కానీ ఇప్పుడు పై నుంచి నిర్ణయించిన పనులే గ్రామాల్లో చేయాల్సి వస్తుందని చెప్పారు.

కొత్త చట్టం ద్వారా కాంట్రాక్టర్లకు లాభం చేకూర్చేలా కేంద్రం కుట్రలు చేస్తోందని విమర్శించారు. రాష్ట్ర ప్రభుత్వం 40 శాతం నిధులు వెచ్చించాలని చెప్పడం రాష్ట్రానికి అదనపు భారం అవుతుందని అన్నారు. కొత్త నిబంధనలతో రాష్ట్రంపై ఏడాదికి రూ.1500 కోట్లకు పైగా భారం పడే అవకాశం ఉందన్నారు.

రాష్ట్ర ప్రభుత్వాన్ని సంప్రదించకుండా పార్లమెంట్‌లో మెజార్టీ ఉందని ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తోందని మోడీ సర్కార్‌పై మండిపడ్డారు. రైతుల కోసం తెచ్చిన నల్లచట్టాలను ఎలా రద్దు చేయించామో, ఈ కొత్త బిల్లును కూడా కాంగ్రెస్ ఆధ్వర్యంలో రద్దు చేయిస్తామని స్పష్టం చేశారు.

20 నుంచి కార్యాచరణ

ఈ నెల 20వ తేదీ నుంచి రాష్ట్రవ్యాప్తంగా కార్యాచరణ చేపడతామని తెలిపారు. మంత్రులు, ఇన్‌చార్జ్‌ల ఆధ్వర్యంలో పోరాటం కొనసాగుతుందని చెప్పారు. ప్రతి గ్రామ పంచాయతీలో తీర్మానాలు చేసి ఎంపీలు పార్లమెంట్‌లో సమర్పిస్తారని వెల్లడించారు.

సీఎం రేవంత్ రెడ్డి ఉమ్మడి 9 జిల్లాల్లో సమావేశాలు నిర్వహిస్తారని, అగ్రనేతలు సోనియాగాంధీ, రాహుల్ గాంధీ పాల్గొని కేంద్ర ప్రభుత్వ మోసాలను ప్రజలకు వివరించేలా కార్యాచరణ రూపొందిస్తున్నట్లు తెలిపారు.

గ్రామీణ ప్రజలకు ఉపాధి కల్పిస్తున్న పథకాన్ని కాపాడేందుకు కాంగ్రెస్ పోరాడుతుందని స్పష్టం చేశారు.

ఈ కార్యక్రమంలో టీపీసీసీ ఉపాధ్యక్షులు బొద్దిరెడ్డి ప్రభాకర్ రెడ్డి, ప్రధాన కార్యదర్శి దుద్దిళ్ల శ్రీను బాబు, ఫ్లోర్ లీడర్ తోట వెంకటేశ్వర్లు, కార్పొరేటర్లు తదితరులు పాల్గొన్నారు.


Share this post

One thought on “ఉపాధి హామీ పథకాన్ని నిర్వీర్యం చేసే కుట్రను కాంగ్రెస్ సహించదు-MLA నాయిని రాజేందర్ రెడ్డి

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

IN ARTICLE

Trending Global

కాన్హా ఆశ్రమంలో శాశ్వత సీపీఆర్ శిక్షణ కేంద్రాన్ని ప్రారంభించిన ఎన్ ఆర్ఐ. డా. సతీష్ కత్తుల
తెలంగాణలో మరిన్ని పెట్టుబడులు పెట్టండి…
ట్రంప్ నిర్ణయాలు కూర్చున్న కొమ్మను నరుక్కున్నట్లుగా ఉన్నాయా ?
వలసలను వ్యతిరేకిస్తూ లండన్ లో భారి ప్రదర్శన