ఉద్యమకారులు, నిరుద్యోగులతో చెలగాటం ఆడొద్దు
ఉద్యమకారులకు ఇచ్చిన మాటను ప్రభుత్వం నెరవేర్చాలి
జస్టిస్ చంద్రకుమార్
ప్రజాస్వామ్య తెలంగాణ కోసం మరో ఉద్యమం చేయాలి
పాశం యాదగిరి
తెలంగాణ రాష్ట్ర సాధనలో కీలకపాత్ర పోషించి ఎన్నో త్యాగాలు చేసిన తెలంగాణ ఉద్యమకారులను తెలంగాణ ప్రభుత్వం అన్ని విధాలుగా ఆదుకోవాలని, ఉద్యమకారులు, నిరుద్యోగులతో చెలగాటం నిప్పుతో చెలగాటం ఆడినట్లు అవుతుందని జస్టిస్ చంద్రకుమార్ అన్నారు. రాష్ట్ర రాజధాని హైదరాబాద్ సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో బుధవారం ఆల్ ఇండియా ఒబిసి జాక్ చైర్మన్ సాయిని నరేందర్ అధ్యక్షతన జరిగిన తెలంగాణ రాష్ట్ర ఉద్యమకారుల రౌండ్ టేబుల్ సమావేశానికి ఆయన ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడారు. సాధించుకన్న తెలంగాణలో ఉద్యమకారులు ఎన్నో కష్టాలు పడుతున్నారని, కాంగ్రెస్ పార్టీ మానిఫెస్టోలో పొందుపరచిన అంశాలైన ఉద్యమకారులను గుర్తించి వారికి ఇళ్ల స్థలాలు ఇవ్వడం, విద్యార్థులు, ఉద్యమకారులపై కేసులను ఎత్తివేయాలని, అమరుల కుటుంబాలకు ఉద్యోగంతో పాటు 25 వేల రూపాయల పెన్షన్ ఇవ్వడం కోసం వెంటనే ప్రకియ ప్రారంభించాలని అన్నారు. ఉద్యమకారుల గుర్తింపు కోసం చట్టబద్ధమైన కమిటీని నియమించి మార్గదర్శకాలను ప్రకించాలని, భౌతికంగా నష్టపోయిన వారికి, ఉద్యోగ అర్హత వయసు కోల్పోయిన వారికి ఉపాధి కల్పించాలని, ఉద్యమకారులకు 25 లక్షల వరకు ఆరోగ్య బీమా కల్పించి ఆరోగ్య భద్రత కల్పించాలని, ఉద్యమకారులకు బస్సుల్లో, రైళ్లలో ఉచిత ప్రయాణం కల్పించాలని, స్థానిక సంస్థల్లో ప్రాతినిధ్యం, ఉద్యమకారుల సంక్షేమం కోసం ప్రత్యేక కార్పొరేషన్ ఏర్పాటు, నామినేటెడ్ పదవుల్లో ప్రాధాన్యత కల్పించాలని ప్రభుత్వానికి సూచించారు. ప్రపంచంలో ఎక్కడైనా స్వేచ్ఛ, స్వాతంత్రం, వెలుగు లభించిందంటే ఉద్యమకారుల పోరాటాలు, త్యాగాల వల్లనేనని అలాంటి ఉద్యకారులను ఆదుకోవడంలో ప్రభుత్వం అలసత్వం వీడాలని అన్నారు. ఉద్యమకారుల ఆకాంక్షలు సాధించుకోవడానికి మరో ఉద్యమానికి తెలంగాణ ప్రజలు సిద్ధం కావాలని పిలుపునిచ్చారు.
ఈ కార్యక్రమంలో పాల్గొన్న సీనియర్ న్యాయవాది పాశం యాదగిరి, అరుణోదయ విమలక్క, సాంస్కృతిక సమాఖ్య చైర్మన్ వెన్నెల గద్దర్ మాట్లాడుతూ తెలంగాణ వస్తె ప్రజల జీవితాలు బాగుపడుతాయని నక్సలైట్లు ప్రాణ త్యాగాలు చేశారని, ఎన్నో ఉద్యమాలు జరిగాయని, తెలంగాణలో నేటికి భూ పంపిణీ జరగలేదని, ఫార్మా కంపెనీల, కాలుష్యం ఆగలేదని, ఓపెన్ కాస్ట్ ల విద్వంసం ఆగలేదని, ఆధిపత్య వర్గాల దోపిడీ ఆగలేదని అన్నారు. గద్దర్, మారోజు వీరన్న లాంటి త్యాగధనులు కలలు కన్నా తెలంగాణ కోసం ఉద్యమకారులు మరో ప్రజాస్వామిక ఉద్యమానికి సిద్ధం కావాలని పిలుపునిచ్చారు. ఉద్యమకారులు ఉద్యమాలతో పాటు రాజకీయ యుద్ధానికి సిద్ధం కావాలని, రాజకీయ అధికారం ద్వారానే ప్రజలకు నిజమైన స్వేచ్ఛ, స్వాతంత్రాలు లభిస్తాయని అన్నారు.
ఈ కార్యక్రమానికి న్యాయవాది సామాజిక తెలంగాణ ఫ్రంట్ అధ్యక్షులు వెన్నపూజ పరుషరాజు స్వాగత వచనాలు పలుకగా వివిధ సంఘాల నాయకులు బత్తుల సిద్ధేశ్వర్లు, పసునూరి రవీందర్, మన్నారం నాగరాజు, పటేల్ వనజ, ఏటిగడ్డ అరుణ, అంబు రాథోడ్, బుల్లెట్ వెంకన్న, రఫీ, డాక్టర్ చీమ శ్రీనివాస్, గోధుముల కుమారస్వామి, చాపర్తి కుమార్ గాడ్గే, సోహర బేగం, కోలా జనార్దన్ గౌడ్, రామగిరి ప్రకాష్, సింగారపు అరుణ, కొంగర నరహరి, పోత సునీత, మందల వరలక్షి, దురిశెట్టి వెంకటలక్ష్మి, తాటికొండ సద్గుణ, సాదం రాజన్న, సుజ్జి, సాయిరాం, కేడెల ప్రసాద్, ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు.