న్యాయవాదుల అభివృద్ధి, హక్కుల కోసం ఐ ఎల్ పి ఎ కృషి
ఐ ఎల్ పి ఎ రాష్ట్ర నాయకులు సాయిని నరేందర్
ములుగు న్యాయవాదులతో ఐ ఎల్ పి ఎ సమాలోచన
ఐ ఎల్ పి ఎ ములుగు జిల్లా కమిటి ఏకగ్రీవ ఎన్నిక
నిత్యం ప్రజల హక్కులు, న్యాయం కోసం పని చేస్తున్న న్యాయవాదులకు న్యాయం జరగడం లేదని, నూతనంగా న్యాయవాద వృత్తిలోకి వస్తున్న న్యాయవాదుల అభివృద్ధి కోసం, న్యాయవాదుల హక్కుల కోసం ఐ ఎల్ పి ఎ కృషి చేస్తుందని ఇండియన్ లీగల్ ప్రొఫెషనల్స్ అసోసియేషన్ రాష్ట్ర నాయకులు సాయిని నరేందర్ అన్నారు. ములుగు బార్ అసోసియేషన్ అధ్యక్షులు వేణుగోపాలాచారి ఆధ్వర్యంలో బుధవారం న్యాయవాదులతో ఐ ఎల్ పి ఎ జరిపిన సమాలోచన సమావేశంలో ఆయన పాల్గొని మాట్లాడారు. న్యాయవాద వృత్తిలోకి నానాటికి పెరుగుతున్న న్యాయవాదులకు వృత్తి మెలకువలు అవసరమని, చాలా రంగాల్లో ఉద్యోగులు, వృత్తిదారులకు శిక్షణ ఇవ్వడానికి శిక్షణా కేంద్రాలలో వారి వృత్తి నైపుణ్యాలను పెంచుతారని, జ్యుడీషియరీ లో కూడా న్యాయమూర్తులకు, ఉద్యోగులకు శిక్షణ ఇస్తారని, న్యాయవాదులకు శిక్షణ ఇచ్చే కేంద్రాలు మాత్రం భారత దేశంలో లేవని అన్నారు. శిక్షణ లేకపోవడం వల్ల నూతనంగా న్యాయవాద వృత్తిలోకి వచ్చిన వారికి ఎన్నో ఇబ్బందులు ఏర్పడుతున్నాయని గమనించిన ఐ ఎల్ పి ఎ గత ఐదు సంవత్సరాలుగా పూలే, అంబేద్కర్ భావజాలంతో న్యాయవాదులకు నిరంతర శిక్షణ ఇచ్చి ఎంతో మంది న్యాయవాదులను వృత్తిలో ప్రావీణ్యులను చేసిందని, పోటీ పరీక్షలకు హాజరయ్యే వారికి సైతం నిరంతర తరగతులు నిర్వహించి ప్రయోజకులను చేసిందని ఆయన తెలిపారు. ప్రజలకు న్యాయం కోసం నిరంతరం పనిచేస్తున్న న్యాయవాదులకు రక్షణ చట్టం, జూనియర్ న్యాయవాదులకు స్టైఫండ్, ఇన్సూరెన్స్ తదితర అంశాలపై ఐ ఎల్ పి ఎ నిక్కచ్చిగా పోరాటం చేస్తుందని తెలిపారు. జ్యుడిషియరీలో రూల్ ఆఫ్ రిజర్వేషన్ కోసం కూడా పోరాటం చేస్తామని, న్యాయవాద శిక్షణ కోసం అకాడమీ నిర్మాణం కోసం పోరాటం చేస్తామని తెలిపారు.
ఈ కార్యక్రమంలో నూతనంగా ఎన్నికైన ఐ ఎల్ పి ఎ ములుగు జిల్లా అధ్యక్షులు కొండి రవీందర్, ఐ ఎల్ పి ఎ బార్ అధ్యక్షులు సూర్యనారాయణ లు మాట్లాడుతూ న్యాయవాదుల అభివృద్ధి, హక్కుల కోసం ఐ ఎల్ పి ఎ చేస్తున్న కృషి చాలా గొప్పదని నూతనంగా ఏర్పడిన ములుగు జిల్లాలో ఐ ఎల్ పి ఎ కార్యకలాపాలను విస్తరించి సామాజిక చైతన్యంలో ముందుంటామని తెలిపారు.
ఈ కార్యక్రమంలో న్యాయవాదులు కూనూరు రంజిత్ గౌడ్ , ఎగ్గడి సుందర్ రామ్, మేకల మహేందర్, కన్నోజు సునీల్ కుమార్ తదితరులు పాల్గొన్నారు.
ఐ ఎల్ పి ఎ ములుగు జిల్లా కమిటీ
ఐ ఎల్ పి ఎ ములుగు జిల్లా అధ్యక్షులుగా కొండి రవీందర్, ఉపాధ్యక్షులుగా మేకల అశోక్, ప్రధాన కార్యదర్శిగా శ్రీ రంగోజు భిక్షపతి, కోశాధికారిగా రంగోజు సూర్యం, సహాయ కార్యదర్శులుగా ఒరుగంటి రాజేందర్, మేకల మానస, కార్యనిర్వాహక సభ్యులుగా బి.ప్రతాప్, ఎస్ చిరంజీవి, జి శ్రావ్య, సి హెచ్ కావ్య, డి సంజీవలను ఎన్నుకున్నారు.
ములుగు బార్ కమిటి
ఐ ఎల్ పి ఎ ములుగు బార్ కమిటి అధ్యక్షులుగా బొల్లి సారంగపాణి, ప్రధానకార్యదర్శిగా బానోత్ స్వామిదాస్, ఉపాధ్యక్షులుగా కన్నోజు సునీల్ కుమార్, కోశాధికారిగా మహ్మద్ మన్సూర్ అలీ, సంయుక్త కార్యదర్శులుగా ప్రణయ్ ప్రసాద్, చిల్పాక కావ్య, కార్యనిర్వాహక కమిటి సభ్యులుగా ఏలూరు రవిప్రసాద్ రెడ్డి, పాండవుల అర్చన, మంద విజయ్ కుమార్, బూలుగు చంద్రయ్య లను ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. రెండు కమిటీలకు గౌరవ అధ్యక్షులుగా ములుగు బార్ అసోసియేషన్ అధ్యక్షులు చక్రవర్తుల వేణుగోపాల్ చారిని ఎన్నుకున్నారు. నూతనంగా ఎన్నికైన ఐ ఎల్ పి ఎ కమిటీకి రాష్ట్ర నాయకులు సాయిని నరేందర్ అభినందనలు తెలిపారు.