జనవరి 25 నుంచి ఫిబ్రవరి 1 వరకు ప్రత్యేక బస్సు సర్వీసులు
మెదారం (ములుగు జిల్లా):
ఆసియా ఖండంలోనే అతిపెద్ద గిరిజన జాతరగా పేరుగాంచిన మెడారం సమ్మక్క–సారలమ్మ జాతర–2026ను పురస్కరించుకుని తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ (TGRTC) విస్తృత స్థాయిలో రవాణా ఏర్పాట్లు చేపట్టింది. ఈ జాతర జనవరి 28 నుంచి 31, 2026 వరకు జరగనుండగా, భక్తుల సౌకర్యార్థం టీజీఆర్టీసీ జనవరి 25 నుంచి ఫిబ్రవరి 1 వరకు ప్రత్యేక బస్సు సర్వీసులు నిర్వహించనుంది.
జాతర సందర్భంగా మెదారానికి భారీ సంఖ్యలో భక్తులు తరలివచ్చే అవకాశమున్న నేపథ్యంలో, ఈసారి సుమారు 20 లక్షల మంది భక్తులు ఆర్టీసీ బస్సుల ద్వారా ప్రయాణించే అవకాశం ఉందని అధికారులు అంచనా వేస్తున్నారు. గతంలో 2024 జాతర సమయంలో టీజీఆర్టీసీ 3,491 బస్సులు నడిపి 16.82 లక్షల మంది ప్రయాణికులను గమ్యస్థానాలకు చేర్చింది.
4,000 ప్రత్యేక బస్సులు
ఈసారి జాతర కోసం రాష్ట్రవ్యాప్తంగా అన్ని జిల్లాల నుంచి, హైదరాబాద్ నగరంతో కలిపి మొత్తం 4,000 బస్సులను మెదారం రూట్లలో నడపనున్నారు. వరంగల్, కరీంనగర్, ఆదిలాబాద్, ఖమ్మం అనే పూర్వ జిల్లాలతో పాటు హైదరాబాద్ నుంచి కూడా 51 ప్రధాన ట్రాఫిక్ జనరేటింగ్ పాయింట్లను గుర్తించి అక్కడి నుంచి ప్రత్యేక బస్సులు నడపనున్నారు.
మహిళలకు ఉచిత ప్రయాణం
ప్రభుత్వం అమలు చేస్తున్న మహాలక్ష్మి ఉచిత ప్రయాణ పథకం ప్రకారం, మహిళా భక్తులు మెదారం జాతరకు ఆర్టీసీ బస్సుల్లో ఉచితంగా ప్రయాణించవచ్చు అని టీజీఆర్టీసీ స్పష్టం చేసింది.
తాత్కాలిక బస్టాండ్, క్యూ లైన్లు
మెదారంలో జిల్లా యంత్రాంగం కేటాయించిన 50 ఎకరాల భూమిలో తాత్కాలిక బస్టాండ్ ఏర్పాటు చేశారు. అక్కడ భక్తుల సౌకర్యార్థం మొత్తం 50 క్యూ లైన్లు ఏర్పాటు చేయగా, ఇవి కలిపి సుమారు 9 కిలోమీటర్ల పొడవు ఉన్నాయి. ఒకేసారి సుమారు 20 వేల మంది ప్రయాణికులు క్యూ లైన్లలో నిలబడే అవకాశం ఉంది.
అదే విధంగా ప్రయాణికుల నిరీక్షణ, సిబ్బంది విశ్రాంతి, బస్సుల నిర్వహణ కోసం 1.10 లక్షల చదరపు అడుగుల విస్తీర్ణంలో తాత్కాలిక షెడ్లు ఏర్పాటు చేశారు. బస్సుల పార్కింగ్ కోసం మెదారం, కమారం ప్రాంతాల్లో కలిపి 25.76 ఎకరాల్లో పార్కింగ్ సౌకర్యం కల్పించగా, దాదాపు 1,000 బస్సులు అక్కడ నిలపవచ్చు.
భద్రత, పర్యవేక్షణ
జాతర నిర్వహణలో భాగంగా 10,441 మంది సిబ్బందిని విధుల్లో నియమించారు. ఇందులో 7,000 మంది డ్రైవర్లు, 1,811 మంది కండక్టర్లు, 759 మంది భద్రతా సిబ్బందితో పాటు ఇతర సిబ్బంది, 153 మంది అధికారులు ఉన్నారు.
బస్సుల నిరంతర కదలిక కోసం 12 జీపులు, 8 ద్విచక్ర వాహనాలతో రూట్ ప్యాట్రోలింగ్ ఏర్పాటు చేశారు. హనుమకొండ–తాడ్వాయి మార్గంలో ఇరుకైన ప్రాంతాలు, వాగుల వద్ద ప్రత్యేక గార్డులను నియమించారు. మెదారం బస్టాండ్లో కమాండ్ కంట్రోల్ సెంటర్ ఏర్పాటు చేసి, 76 సీసీ కెమెరాల ద్వారా ట్రాఫిక్ను పర్యవేక్షించనున్నారు.
తాగునీరు, వైద్య సౌకర్యాలు
ప్రయాణికుల కోసం తాత్కాలిక బస్టాండ్లో తాగునీరు, మరుగుదొడ్లు ఏర్పాటు చేశారు. అదేవిధంగా పూర్తిస్థాయి వైద్య శిబిరం, అంబులెన్సులు, వైద్యులు, మందులు అందుబాటులో ఉంచనున్నారు.
సాధారణ సర్వీసులపై ప్రభావం
జాతర కోసం భారీ సంఖ్యలో బస్సులు మళ్లించడంతో, జనవరి 25 నుంచి ఫిబ్రవరి 1 వరకు రాష్ట్రంలోని కొన్ని ప్రాంతాల్లో, హైదరాబాద్లో సాధారణ ఆర్టీసీ సర్వీసులు కొంత మేర తగ్గే అవకాశం ఉందని టీజీఆర్టీసీ అధికారులు తెలిపారు.



I?¦ve been exploring for a bit for any high quality articles or weblog posts on this sort of space . Exploring in Yahoo I finally stumbled upon this site. Studying this information So i?¦m happy to show that I’ve an incredibly good uncanny feeling I discovered just what I needed. I most no doubt will make certain to don?¦t omit this website and provides it a glance regularly.