ప్రభుత్వంలో ఓకీలక మంత్రి పైనా మరికొందరు ఐఏఎస్ అధికారుల పైనా పరువుకుభంగం కలిగే వార్త కథనాలు ప్రసారం చేశారనే ఆరోపణలపై ఎన్టీవీ ఇన్పుట్ ఎడిటర్ దొంతు రమేష్, జర్నలిస్టు సుధీర్ అరెస్టు వ్యవహారంలో తెలంగాణ ప్రభుత్వానికి గట్టి ఎదురుదెబ్బ తగిలింది.
వీరిద్దరిపై పోలీసులు సమర్పించిన రిమాండ్ రిపోర్ట్ సరిగాలేదని 14వ మెజిస్ట్రేట్ కోర్టు తిరస్కరించడంతో పాటు వారిని ఇరవైవేల రూపాయల పూచీకత్తుపై విడుదల చేయాలని ఆదేశించింది.
బ్యాంకాక్ వెళ్లేందుకు విమానాశ్రయానికి వచ్చిన దొంతు రమేష్ను అక్కడే పోలీసులు అరెస్టు చేశారు. అదే సమయంలో సీనియర్ జర్నలిస్ట్ చారి, దళిత జర్నలిస్ట్ సుధీర్లను పోలీసులు వారి ఇళ్లలోకి వెళ్లి అదుపులోకి తీసుకున్నారు. ఈ పరిణామం జర్నలిస్టు వర్గాల్లో తీవ్ర కలకలం రేపింది.
జర్నలిస్టులను అరెస్టు చేసిన తీరు సరికాదని, ఇది పత్రికా స్వేచ్ఛపై దాడి అంటూ వివిధ మీడియా సంఘాలు, రాజకీయ పార్టీలు తీవ్రంగా ఖండించాయి. అరెస్టైన జర్నలిస్టుల కుటుంబాలు తీవ్ర ఆందోళనలో ఉన్నాయని, వెంటనే వారిని విడుదల చేయాలని డిమాండ్ చేశాయి. రాష్ట్రవ్యాప్తంగా పలు జర్నలిస్టు సంఘాలు నిరసనలకు దిగాయి.
ఈ నేపథ్యంలో జర్నలిస్టులను మేజిస్ట్రేట్ ముందు హాజరు పరచిన పోలీసులు రిమాండ్ కోరగా, కోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. ప్రాథమిక ఆధారాలు సరిపోవడం లేదని, అరెస్టు సమయంలో తప్పనిసరిగా ఇవ్వాల్సిన నోటీసులు ఇవ్వకపోవడం వంటి విధి విధానాల్లో లోపాలు ఉన్నాయని పేర్కొంది. ఈ తరహా చర్యలు పత్రికా స్వేచ్ఛకు భంగం కలిగించేలా ఉంటాయని వ్యాఖ్యానిస్తూ రిమాండ్ను తిరస్కరించింది. దొంతు రమేష్, సుధీర్లను బెయిల్పై విడుదల చేయాలని ఆదేశాలు జారీ చేసింది.
దీంతో ఈ కేసులో తెలంగాణ ప్రభుత్వానికి న్యాయస్థానంలో ఎదురుదెబ్బ తగిలినట్టయింది. NTV జర్నలిస్టులపై పోలీసులు తీసుకున్న చర్యలపై ఇప్పుడు సర్వత్రా చర్చ జరుగుతోంది.
ఈ సందర్భంగా సీనియర్ జర్నలిస్ట్ దొంతు రమేష్ మాట్లాడుతూ, తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తరువాత బీఆర్ఎస్ ప్రభుత్వ కాలంలో ఒక్క వర్కింగ్ జర్నలిస్టును కూడా అరెస్ట్ చేయలేదని గుర్తు చేశారు. కానీ ప్రస్తుత రేవంత్ రెడ్డి ప్రభుత్వం, జర్నలిస్టులు చేసిన తప్పు ఏమీ లేకపోయినా వారిని అరెస్ట్ చేసి 24 గంటలు మానసిక క్షోభకు గురిచేసిందని ఆవేదన వ్యక్తం చేశారు.

