హనుమకొండ, ఫిబ్రవరి 19: హనుమకొండ జిల్లా ఆత్మకూరు మండలంలోని ఆత్మకూరు గ్రామంలో మోడల్ సోలార్ విలేజ్ ప్రోగ్రాం కింద ఏర్పాటు చేసిన సౌర విద్యుత్ ఉత్పాదక యూనిట్ను పరకాల ఎమ్మెల్యే రేవూరి ప్రకాష్ రెడ్డి గురువారం ప్రారంభించారు.
ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ స్నేహ శబరీష్, కుడా చైర్మన్ ఇనగాల వెంకట్రామ్ రెడ్డి పాల్గొన్నారు.
లబ్ధిదారు ఇంటి పై ఏర్పాటు చేసిన సోలార్ ప్యానల్ వద్ద ఎమ్మెల్యే కొబ్బరికాయ కొట్టి యూనిట్ను ప్రారంభించారు. అనంతరం అధికారులు గ్రామంలో అమలు చేస్తున్న మోడల్ సోలార్ విలేజ్ పథకం వివరాలను ఆయనకు తెలియజేశారు.
గ్రామంలోని 1171 గృహ జ్యోతి సర్వీసులకు ప్రతి ఇంటిపై రెండు కిలోవాట్ల సామర్థ్యంతో సోలార్ యూనిట్లు ఏర్పాటు చేయనున్నట్లు తెలిపారు. ఉత్పత్తి అయ్యే సౌర విద్యుత్ గృహ అవసరాలకు వినియోగించి, మిగిలిన విద్యుత్ను నెట్ మీటర్ ద్వారా గ్రిడ్కు అనుసంధానం చేస్తారని పేర్కొన్నారు. దీంతో గృహ వినియోగదారులకు అదనపు ఆదాయం లభించే అవకాశం ఉందని అధికారులు వివరించారు.
అదేవిధంగా గ్రామంలో ఉన్న 468 వ్యవసాయ పంపుసెట్లకు 7.5 కిలోవాట్ల సామర్థ్యంతో సోలార్ యూనిట్లు అమర్చనున్నట్లు తెలిపారు. సోలార్ యూనిట్ల ఏర్పాటుకు సుమారు రూ.48.35 కోట్ల వ్యయం అవుతుందని, ఎంఎన్ఆర్ఈ రాయితీ మినహా మిగిలిన మొత్తం వ్యయాన్ని రాష్ట్ర ప్రభుత్వం భరించి, గృహాలకు మరియు వ్యవసాయ పంపుసెట్లకు ఉచితంగా అందజేస్తుందని తెలిపారు. ఈ అమలు కార్యక్రమాన్ని తెలంగాణ పునరుత్పాదక ఇంధన వనరుల అభివృద్ధి సంస్థ ద్వారా నిర్వహిస్తున్నట్లు చెప్పారు.
ఈ కార్యక్రమంలో స్థానిక సర్పంచ్ మహేశ్వరి, విద్యుత్ శాఖ ఎస్ఈ మధుసూదన్ రావు, డీఈ మల్లికార్జున్, టీజీ రెడ్కో డీఎం మహేందర్ రెడ్డి, తహసీల్దార్ జగన్మోహన్ రెడ్డి, ఎంపీడీవో శ్రీనివాసరెడ్డి తదితరులు పాల్గొన్నారు.

