గురువారం 9 దేశాలకు చెందిన ప్రపంచ సుందరి పోటీ దారులు యాదాద్రి భువనగిరి జిల్లాలోని యాదాద్రి శ్రీ లక్ష్మీనరసింహస్వామి ఆలయాన్ని సందర్శించారు. తెలుగువారి కట్టు,బొట్లకు ఏమాత్రం తీసుపోని విధంగా లంగా వోణీలు, చీరకట్లతో సంప్రదాయబద్ధంగా సాయంత్రం ఐదు గంటలకు ఆలయానికి చేరుకోగా ప్రభుత్వ విప్ ఆలేరు శాసనసభ్యులు బీర్ల ఐలయ్య ఆలయ అధికారులు ప్రపంచ సుందరి మణులను సాదరంగా ఆహ్వానించారు.

ప్రోటోకాల్ అతిథిగృహంలో ప్రొజెక్టర్ ద్వారా ఆలయ విశిష్టతను ఆలయ వైస్ చైర్మన్ కిషన్ రావు ప్రపంచ సుందరీ మణులకు వివరించారు. అనంతరం సుందరీ మణులను ఆలయ సందర్శనకు ఆలయంలోకి తీసుకువెళ్లారు.
అఖండ దీపమండపం వద్ద ప్రపంచ సుందరిమణులు దీపారాధన చేశారు.
కోలాటం, సాంప్రదాయ భజన శాస్త్రీయ నృత్యాల మధ్య తూర్పు రాజగోపురం చేరుకొని ఆలయం ఆగ్నేయ మూలలో ఫోటో షూట్ లో పాల్గొన్నారు.

తూర్పు మహాగోపురం వద్ద వేద పండితులు స్వాగతం పలుకగా త్రితల రాజగోపురం, ఆంజనేయస్వామి గుడి, ధ్వజస్తంభం ద్వారా ఆలయంలోకి ప్రవేశించిన ప్రపంచ సుందరీమణులు.
ప్రధాన ఆలయంలో పూజలు నిర్వహించి శ్రీ లక్షినరసింహాస్వామి వారిని దర్శించుకున్నారు.
ఈ సందర్భంగా వేద పండితులు ఆశీర్వచనం ఇచ్చి ప్రసాదం తో పాటు శ్రీ లక్ష్మీనరసింహాస్వామి ప్రతిమ నమూనాతో సిద్ధం చేసిన జ్ఞాపిలను ప్రపంచ సుందరీమణులకు అందజేసారు. ఆలయ శిల్పకళ కు ముద్దు లైన ప్రపంచ సుందరిమణులు మంత్రముగ్దులై ఆలయ శిల్పకళా సంపద కనపడేలా ఫోటోలు దిగారు. కోలాటం పాటలతో యువతులు నృత్యాలు చేయగా వాటిని చూసి మైమరిచిపోయిన ప్రపంచ సుందరీమణులు కోలాట కర్రలు తీసుకుని కోలాటం పాటలకు లయబద్ధంగా కోలలు కలుపుతూ చేసిన నృత్యాలు అందరిని ఆకర్షించాయి.

అనంతరం అందరిని పలకరిస్తున్నట్టుగా చేతులు ఊపుతూ చిరునవ్వులు చిందిస్తూ ఆలయ అధికారులు ఏర్పాటుచేసిన బ్యాటరీ వాహనాలలో ఆసీనులై ప్రోటోకాల్ వసతి గృహం వరకు చేరుకుని వారికి ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన ప్రభుత్వ బస్సులలో తిరుగు ప్రయాణమయ్యారు.
ఈ కార్యక్రమంలో అదనపు కలెక్టర్ వీరారెడ్డి ఆర్డిఓ కృష్ణారెడ్డి పోలీస్ శాఖ అధికారులు తదితరులు పాల్గొన్నారు.