తమ టాలెంట్ తో అదరగొట్టిన సుందరిమణులు
కళలకు, టాలెంట్ కు ఎల్లలు లేవని నిరూపించారు మిస్ వరల్డ్ కంటెస్టంట్లు. మిస్ వరల్డ్ టాలెంట్ గ్రాండ్ ఫైనల్ ఈవెంట్ శిల్పకళా వేదికగా ముగిసింది. టాలెంట్ గ్రాండ్ ఫినాలేలో మిస్ ఇండోనేషియా నెంబర్ వన్ గా (పియానో) నిలిచారు. ఆ తర్వాత రెండో స్థానంలో మిస్ కామెరూన్ (సింగింగ్), మూడో స్థానంలో మిస్ ఇటలీ (బ్యాలే నృత్యం) నిలిచారు.
ముందుగా అమెరికా కంటెస్టెంట్ నృత్యంతో కార్యక్రమం ప్రారంభమైంది. ఇటీవల అత్యంత ప్రజాదరణ పొందిన ‘రాను బొంబయికి రాను’… అనే తెలంగాణ పాటకు మిస్ నైజీరియా చేసిన ఇండో ఆఫ్రికన్ డాన్స్ టాలెంట్ బాగా ఆకట్టుకొంది. దీనికి ఆహుతులు చప్పట్లతో అభినందనలు వ్యక్తం చేశారు.
ఆ తర్వాత ఇండోనేషియా పోటీదారు పియానో మ్యూజిక్ తో మరిపించారు. ఫ్లోర్ డాన్స్ ద్వారా ఎస్టోనియా కంటెస్టెంట్ ఆహుతులను ఆకట్టుకున్నారు. ఐ లవ్ స్టోరీస్ అనే అద్భుత గీతం పాడిన బ్రెజిల్ కంటెస్టంట్ అలరించారు. ఐస్ స్కేటింగ్ తో అద్భుత విన్యాసాలు ప్రదర్శించారు నెదర్లాండ్ మిస్ వరల్డ్ కంటెస్టెంట్. చెక్ రిపబ్లిక్ సుందరీమణి కూడా పియానోపై తన ప్రతిభను ప్రదర్శించారు. అర్బన్ డాన్స్ మూవ్ మెంట్స్ తో అర్జెంటీనా కాంటెస్టెంట్ ఆకట్టుకున్నారు.
సంప్రదాయ సింహళీ నృత్యంతో మిస్ శ్రీలంక తన టాలెంట్ ను ప్రదర్శించారు. ట్రినిటాడ్ కంటెస్టెంట్ ఏరోబిక్స్ ప్రదర్శనతో మెప్పించారు. అందరికంటే భిన్నంగా తన టాలెంట్ తో మెప్పించారు వేల్స్ కంటెస్టెంట్, అత్యవసరమైన సమయాల్లో రోగులను కాపాడే కార్డియో పల్మనరీ రెససిటేషన్ (సీసీఆర్) ఎలా చేయాలో వినూత్నంగా ప్రదర్శించారు. కెన్యా కాంటెస్టెంట్ జుంబా డీజే ద్వారా ఉర్రూతలూగించింది.
ఇక ఇండియన్ కంటెస్టెంట్ మిస్ ఇండియా నందిని గుప్తా బాలీవుడ్ హిట్ సాంగ్ రామ్ లీలా సినిమాలోని దోల్ భాజే సాంగ్ తో స్టేజ్ ను, ఆహుతులనే కట్టిపడేశారు.
చివరగా మొత్తం ఇరవై నాలుగు మంది పోటీదారులు రాను బొంబాయికి రాను అంటూ తెలుగు పాట కి స్టేజి దద్ద రిల్లే పెర్ఫార్మన్స్ చేశారు.





