స్ట్రీట్ వెండర్ కోవాబన్ వలీకీ ప్రముఖులు మద్దతుగా నిలిచారు. మంత్రి నారా లోకేష్ వలీకి మద్దతుగా ట్వీట్ చేసాడు. త్వరలో కల్సి కోవాబన్ రుచి చూస్తా నని పేర్కొన్నాడు. నారా లోకేష్ వలీ జీవనోపాదికి సహాయం చేసే అవకాశం ఉందంటున్నారు.
ఇదిలా ఉంటే జనసేన పార్టీ ప్రధాన కార్యదర్శి నాగబాబు వలీకి మద్దతుగా నిలిచి 25 వేల సహాయం చేసాడు.
అమరావతి: పొట్టకూటి కోసం, కుటుంబ పోషణ కోసం వీధుల్లో చిన్నచిన్న వ్యాపారాలు చేసుకుంటున్న సాధారణ పౌరులను భయభ్రాంతులకు గురిచేయడం సమాజానికి మంచిది కాదని కె. నాగబాబు పేర్కొన్నారు. ఇటీవల ఒక చిరువ్యాపారిపై జరిగిన దాడి ఘటనను ఖండిస్తూ ఆయన ప్రకటన విడుదల చేశారు.
ఈ ఘటన తరువాత అనేకమంది చిరువ్యాపారులు ఆందోళనకు గురవుతున్నారని ఆయన తెలిపారు. శివరాత్రి సందర్భంగా వ్యాపారం చేసుకునే అవకాశం కోల్పోయానని బాధితుడు వ్యక్తం చేసిన నేపథ్యంలో, వ్యక్తిగతంగా రూ.25 వేల ఆర్థిక సహాయం అందజేసినట్లు నాగబాబు వెల్లడించారు.
చిరువ్యాపారులు విక్రయించే ఆహార పదార్థాల నాణ్యతను పరిశీలించడానికి ఫుడ్ సేఫ్టీ అథారిటీలు ఉన్నాయని, ఏవైనా సందేహాలు ఉంటే సంబంధిత అధికారులను సంప్రదించాలని ఆయన సూచించారు. చట్టాన్ని చేతిలోకి తీసుకోవడం సమంజసం కాదని స్పష్టం చేశారు.
వలి వంటి చిన్న వ్యాపారులకు కూటమి ప్రభుత్వం అండగా నిలుస్తుందని నాగబాబు భరోసా ఇచ్చారు. ఐటీ మరియు విద్యాశాఖ మంత్రి శ్రీ నారా లోకేష్, వ్యవసాయ శాఖ మంత్రి శ్రీ అచ్చం నాయుడు, ఎంఎస్ఎంఈ శాఖ మంత్రి శ్రీ కొండపల్లి శ్రీనివాస్లు కూడా ఈ దాడిని ఖండిస్తూ ప్రకటనలు విడుదల చేయడం ఆనందదాయకమని అన్నారు.
ఈ ఘటనను మతపరమైన కోణంలో చూడకూడదని ఆయన విజ్ఞప్తి చేశారు.
తక్కువ లాభంతో ఎక్కువ అమ్మకాలు చేస్తూ రోజువారీ ఖర్చులు సమకూర్చుకోవడమే చిరువ్యాపారుల లక్ష్యమని పేర్కొన్నారు. పెద్దగా మూలధనం లేకపోయినా, స్వయం ఉపాధి సాధించాలనే సంకల్పంతో కూడళ్లలో, జాతర్లలో, జనసంద్రం ఎక్కువగా ఉండే ప్రాంతాల్లో చిన్నచిన్న దుకాణాలు పెట్టుకుని జీవనం సాగిస్తున్న వారు దేశవ్యాప్తంగా కోట్ల సంఖ్యలో ఉన్నారని చెప్పారు.
అర్బన్ ప్రాంతాల్లో 40 శాతానికి పైగా పేద ప్రజలు చిరువ్యాపారులు విక్రయించే ఆహార పదార్థాలపైనే ఆధారపడుతున్నారని అధికారిక లెక్కలు సూచిస్తున్నాయని నాగబాబు పేర్కొన్నారు. చిన్న వ్యాపారులను రక్షించడం ప్రభుత్వ బాధ్యత అని, వారికి భరోసా కల్పించేందుకు కూటమి ప్రభుత్వం కట్టుబడి ఉందని ఆయన స్పష్టం చేశారు.

