ఐ.ఎల్.పి.ఎ నిజ నిర్ధారణ బృందం
గ్రామ అభివృద్ధి కమిటీల పేరుతో దౌర్జన్యాలకు పాల్పడుతూ విలేజ్ డెకాయిట్ కమిటీలుగా మారిన వి.డి.సి లపై న్యాయ పోరాటం చేస్తామని ఇండియన్ లీగల్ ప్రొఫెషనల్స్ అసోసియేషన్ బృంద నాయకులు పొన్నం దేవరాజ్ గౌడ్, శాంసన్, వి ఎం కృష్ణ, సాయిని నరేందర్, అనంత ఆంజనేయులు, రాజారామ్, సుమలత, కందుకాల సురేష్, వెంకటేష్ ప్రసాద్, రాజశేఖర్ లు తెలిపారు. నిజామాబాద్ జిల్లా మోర్తాడు మండలం తాళ్ళరాంపూర్ లో భారత్ ముక్తి మోర్చా నాయకులు రాజేష్ రక్షక్ అధ్యక్షతన సోమవారం జరిగిన నిజ నిర్ధారణ సమావేశంలో వారు పాల్గొని బాధిత ప్రజల నుండి వివరాలు తెలుసుకొని మాట్లాడారు.
మోర్తాడ్ మండలంలో వి.డి.సి నాయకులు గత సంవత్సరం కాలంగా ఎన్నో దౌర్జన్యాలకు పాల్పడుతూ అణగారిన ప్రజలను సంఘ బహిష్కరణలు చేసి భయ బ్రాంతులకు గురి చేస్తున్నారని వాపోయారు. గత సంవత్సర కాలం నుండి తాళ్ళరాంపూర్ లో ఆధిపత్య కులాల వారు వి డి సి పేరుతో భూమి సమస్యను సృష్టించి, గౌడ కులస్తులను తాళ్ళు ఎక్కాలని బలవంతం చేశారని, తాళ్ళు ఎక్కకుంటే ఐదు లక్షల రూపాయల అపరాధ రుసుము చెల్లించాలని ఒత్తిడి చేశారని వాపోయారు. పెనాల్టీ కట్టనందుకు గౌడ కులస్తులను గ్రామ బహిష్కరణ చేశారని, తాటి చెట్లను, ఈత వనాన్ని తగలబెట్టి భయబ్రాంతులకు గురి చేశారని తెలిపారు. వి.డి.సి నాయకులు అంతటితో ఆగకుండా శ్రీరామ నవమి రోజున నవమి ఉత్సవాల్లో పాల్గొన్న గౌడ మహిళలను ఆ ఉత్సవాల నుండి అగౌరవంగా బహిష్కరించి అవమానించారని బాధిత మహిళలు తెలిపారు. వి.డి.సి ల దౌర్జన్యాలపై గత మూడు నెలల నుండి పోలీసులకు ఎన్ని పిర్యాదులు చేసినా ఎలాంటి చర్యలు తీసుకోవడం లేదని, అధికారులు, ప్రజా ప్రతినిధులు, వి.డి.సి నాయకులు అందరూ ఆధిపత్య కులాల వారైనందునే వారికి అన్యాయం జరుగుతుందని తెలిపారు. జనబలం కలిగిన ఆధిపత్య కులాల దౌర్జన్యాలకు చిన్న కులాల వారు ఎన్నో బాధలు పడుతున్నారని, వి.డి.సి పేరున ఆధిపత్య కులాల వారు ఆర్థిక దోపిడీకి పాల్పడుతున్నారని, ప్రశ్నించిన వారిపై దాడులు చేస్తున్నారని తెలిపారు. పోలీసులు ప్రకటనలకే పరిమితమవుతున్నాని, స్థానిక ఎమ్మెల్యే ఇతర నాయకులు ఎవరూ కూడా స్పందించడం లేదని అన్నారు.

ఈ సందర్భంగా ఐ.ఎల్.పి.ఎ బృంద నాయకులు మాట్లాడుతూ వి.డి.సి దుర్మార్గాలకు వ్యతిరేకంగా పోరాడాలని, జనబలం కలిగిన కులాల ఆధిపత్యం పోవడానికి న్యాయ పోరాటం చేయాల్సిన అవసరముందని అన్నారు. ఏక కాలంలో సామాజిక, రాజకీయ, న్యాయ పోరాటం చేయాలని, ప్రజా సంఘాల నాయకులతో గ్రామాల్లో సదస్సులు ఏర్పాటు చేసి ప్రజలను చైతన్యం చేసినప్పుడు ప్రజలు ధైర్యంగా ముందుకు వస్తె ఇలాంటి అసాంఘిక ఆధిపత్య శక్తులను కట్టడి చేసి వి.డి.సి లను నిర్మూలన చేయవచ్చని అన్నారు. రాజ్యంగేతర శక్తిగా తయారైన వి.డి.సి లు రాజ్యాంగ హక్కులను పక్కకు నెట్టి అక్రమ పాలన కొనసాగుస్తుంటే స్థానిక పాలకులు, ఎమ్మెల్యేలు చోద్యం చూస్తున్నారని అన్నారు. ప్రతి వృత్తి కులాల నుండి పెద్ద ఎత్తున డబ్బు వసూళ్లు చేస్తున్నారని, అలాంటి హక్కు వారికి ఎక్కడిదని అన్నారు. ఆధిపత్యంతో గ్రామంలోని ప్రభుత్వ భూములు, అసైన్డ్ భూములపై ఆధిపత్యం చెలాయిస్తున్నారని, గతంలో పేదలకు కేటాయించిన భూములను సైతం వి.డి.సి నాయకులు గ్రామ అభివృద్ధి పేరుతో లాక్కుంటూ దౌర్జన్యాలకు పాల్పడుతున్నారని అన్నారు. ఎన్నో పోరాటాలకు నిలయమైన తెలంగాణలో ఇలాంటి సామాజిక దుర్మార్గాలు జరగడం సిగ్గు చేటని అన్నారు. రాష్ట్రంలో ఎక్కడ లేని విధంగా నిజామాబాద్, ఆదిలాబాద్ జిల్లాల్లో ఇలాంటి దుర్మార్గాలు జరుగుతున్నా ఈ ప్రాంత నాయకులు ఏమి చేస్తున్నట్లని, ప్రజల ఓట్ల కోసం ఇల్లు ఇల్లు తిరిగే నాయకులు ఇలాంటి దౌర్జన్యాలు జరుగుతుంటే ఎందుకు స్పందించడం లేదని ప్రశ్నించారు.
ఇండియన్ లీగల్ ప్రొఫెషనల్స్ అసోసియేషన్ నిర్వహించిన నిజ నిర్ధారణ కమిటీ ముందు భారతీయ విద్యార్థి మోర్చా రాష్ట్ర అధ్యక్షులు శ్రీధర్ బట్టు, భారత్ ముక్తి మోర్చా రాష్ట్ర కార్యదర్శి రాజేష్ రక్షక్, మాజీ సర్పంచ్ రామాగౌడ్,మాజీ ఎంపీటీసీ సుదర్శన్ , గౌడ సంఘం అధ్యక్షులు ప్రభాకర్ గౌడ్, నాయకులు లలిత, కళ్యాణి, సంతోష , మౌనిక, నారాగౌడ్, సత్యనారాయణ , శ్రీనివాస్ , పెద్ద గంగాధర్ , తదితరులు పాల్గొన్నారు.