ఆసుపత్రుల పరిసరాల నుంచి వీధి కుక్కల తొలగింపు
– తొలిరోజు 277 వీధి కుక్కల పట్టివేత
– స్టెరిలైజేషన్ అనంతరం జీహెచ్ఎంసీ ఆధ్వర్యంలోని జంతు సంరక్షణ కేంద్రాలకు తరలింపు
హైదరాబాద్, నవంబర్ 8, 2025:
సుప్రీం కోర్టు ఇటీవల (నవంబర్ 7, 2025) ఇచ్చిన ఆదేశాల మేరకు పాఠశాలలు, ఆసుపత్రులు, క్రీడా సముదాయాలు, రవాణా కేంద్రాలు వంటి ప్రజా ప్రదేశాల నుంచి వీధి కుక్కలను తొలగించాలన్న సూచనలపై గ్రేటర్ హైదరాబాద్ మునిసిపల్ కార్పొరేషన్ (జీహెచ్ఎంసీ) కమిషనర్ ఆర్ వి కర్ణన్ సత్వరమే స్పందించారు.
ఈ నేపథ్యంలో కమిషనర్ ఆదేశాల మేరకు నగరంలోని ప్రభుత్వ ఆసుపత్రుల పరిసర ప్రాంతాల్లో వీధి కుక్కల పట్టివేత కార్యక్రమాన్ని జీహెచ్ఎంసీ వెటర్నరీ విభాగం ప్రారంభించింది.
డ్రైవ్ మొదటి రోజైన శనివారం మొత్తం 277 వీధి కుక్కలను పట్టుకున్నారు.
సుప్రీం కోర్టు ఆదేశాల ప్రకారం, శస్త్రచికిత్స (స్టెరిలైజేషన్) అనంతరం ఈ కుక్కలను ఆసుపత్రుల ప్రాంగణాల్లో తిరిగి వదలకుండావాటిని జీహెచ్ఎంసీకి చెందిన జంతు సంరక్షణ కేంద్రాలకు తరలించారు. అక్కడ వాటికి శస్త్రచికిత్స, టీకాలు, సంరక్షణ, మరియు పర్యవేక్షణ చర్యలు చేపడతామని అధికారులు తెలిపారు.
జీహెచ్ఎంసీ తొలుత ప్రభుత్వ, ప్రైవేట్ ఆసుపత్రులలో ప్రారంభించి , తరువాత పాఠశాలలు, కళాశాలలు, రవాణా కేంద్రాలు వంటి ఇతర పబ్లిక్ ప్లేస్ లకు వరకు విస్తరించనున్నట్లు స్పష్టం చేసింది.

