Headlines

విద్యాభివృద్ధి రుణాల‌కు ఎఫ్ఆర్‌బీఎం నుంచి మిన‌హాయింపు ఇవ్వండి…

  • కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మ‌లా సీతారామ‌న్‌కు ముఖ్య‌మంత్రి ఎ.రేవంత్ రెడ్డి విజ్ఞ‌ప్తి
  • ముఖ్య‌మంత్రి విద్యా రంగంపై పెడుతున్న శ్ర‌ద్ధ‌కు కేంద్ర మంత్రి ప్ర‌శంస‌లు

ఢిల్లీ: తెలంగాణ విద్యా రంగాభివృద్ధికి తాము తీసుకుంటున్న చ‌ర్య‌ల‌కు మ‌ద్ద‌తుగా నిల‌వాల‌ని కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మ‌లా సీతారామ‌న్‌కు ముఖ్య‌మంత్రి ఎ.రేవంత్ రెడ్డి విజ్ఞ‌ప్తి చేశారు. తెలంగాణ‌లో అత్య‌ధిక సంఖ్య‌లో ఉన్న బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనారిటీ వ‌ర్గాల‌ పిల్ల‌ల‌కు నాణ్య‌మైన విద్య‌ను అందించేందుకు రాష్ట్ర ప్ర‌భుత్వం తీసుకుంటున్న చ‌ర్య‌ల‌ను కేంద్ర మంత్రికి సీఎం వివ‌రించారు. కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మ‌లా సీతారామ‌న్‌తో పార్ల‌మెంట్‌లోని ఆమె ఛాంబ‌ర్‌లో ముఖ్య‌మంత్రి ఎ.రేవంత్ రెడ్డి మంగ‌ళ‌వారం భేటీ అయ్యారు. ఈ సంద‌ర్భంగా తెలంగాణ‌వ్యాప్తంగా 105 శాస‌న‌స‌భ నియోజ‌క‌వ‌ర్గాల్లో నిర్మిస్తున్న‌ యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ స్కూళ్ల (YIIRS) ప్రాధాన్య‌త‌ను కేంద్ర మంత్రికి సీఎం తెలియ‌జేశారు. 5 నుంచి 12 త‌ర‌గ‌తుల వ‌ర‌కు ఉండే ఒక్కో YIIRSలో 2,560 మంది విద్యార్థులు ఉంటార‌ని, మొత్తంగా 105 పాఠ‌శాల‌తో 2.70 ల‌క్ష‌ల మంది విద్యార్థుల‌కు ప్ర‌త్య‌క్షంగా నాణ్య‌మైన విద్యాబోధ‌న ల‌భిస్తుంద‌ని సీఎం వివ‌రించారు. YIIRSలు స‌మీప ప్ర‌భుత్వ పాఠ‌శాల‌ల‌కు విద్యా హ‌బ్‌లుగా ఉండ‌డంతో ప‌రోక్షంగా ల‌క్ష‌లాది మంది విద్యార్థుల‌కు ప్ర‌యోజ‌నం క‌లుగుతుంద‌ని కేంద్ర మంత్రి నిర్మ‌లా సీతారామ‌న్‌కు సీఎం తెలియ‌జేశారు.

అత్యాధునిక వ‌స‌తులు, లేబొరేట‌రీలు, స్టేడియాలతో నిర్మించే ఈ 105 యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూళ్ల నిర్మాణానికి రూ.21 వేల కోట్ల వ్య‌య‌మ‌వుతుంద‌ని కేంద్ర మంత్రికి సీఎం తెలిపారు. అలాగే, రాష్ట్రంలోని జూనియ‌ర్‌, డిగ్రీ, సాంకేతిక క‌ళాశాలలు, ఇత‌ర ఉన్న‌త విద్యా సంస్థ‌ల్లో ఆధునిక ల్యాబ్‌లు, ఇత‌ర మౌలిక వ‌స‌తుల క‌ల్ప‌న‌కు మ‌రో రూ.9 వేల కోట్లు వెచ్చించ‌నున్న‌ట్లు కేంద్ర మంత్రికి వివ‌రించారు. మొత్తంగా రాష్ట్రంలో విద్యా రంగం స‌మ‌గ్రాభివృద్ధికి త‌మ ప్ర‌భుత్వం రూ.30 వేల కోట్లు వెచ్చించినున్న‌ట్లు కేంద్ర మంత్రి నిర్మ‌లా సీతారామ‌న్‌కు ముఖ్య‌మంత్రి ఎ.రేవంత్ రెడ్డి తెలిపారు. ఈ నిధుల స‌మీక‌ర‌ణ‌కు తాము ప్ర‌త్యేక ప్ర‌యోజ‌న సంస్థ (SPC) ఏర్పాటు చేయాద‌ల్చామ‌ని, దాని ద్వారా సేక‌రించే రుణాల‌కు ఎఫ్ఆర్‌బీఎం ప‌రిమితి నుంచి మిన‌హాయించాల‌ని కేంద్ర మంత్రికి సీఎం విజ్ఞ‌ప్తి చేశారు. విద్యా రంగంపై త‌మ ప్ర‌భుత్వం చేస్తున్న వ్య‌యాన్ని మాన‌వ వ‌న‌రుల అభివృద్ధికి చేస్తున్న పెట్టుబ‌డిగా భావించాల‌ని కేంద్ర మంత్రిని సీఎం కోరారు.

యంగ్ ఇండియా రెసిడెన్షియ‌ల్ స్కూళ్ల ఏర్పాటు… తెలంగాణ‌లో విద్యా రంగం అభివృద్ధిపై ముఖ్య‌మంత్రి ఎ.రేవంత్ రెడ్డి చూపుతున్న చొర‌వ‌ను కేంద్ర మంత్రి నిర్మ‌లా సీతారామ‌న్ ప్ర‌శంసించారు. YIIRS మోడ‌ల్ బాగుంద‌న్న కేంద్ర మంత్రి SPCకి సంబంధించిన వివ‌రాల‌ను అంద‌జేయాల‌ని సూచించారు. స‌మావేశంలో ఎంపీలు డాక్ట‌ర్ మ‌ల్లు ర‌వి, సురేశ్ షెట్కార్‌, చామ‌ల కిర‌ణ్ కుమార్ రెడ్డి, మందాడి అనిల్ కుమార్ పాల్గొన్నారు.

Share this post

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

IN ARTICLE

Trending Global

తెలంగాణలో మరిన్ని పెట్టుబడులు పెట్టండి…
ట్రంప్ నిర్ణయాలు కూర్చున్న కొమ్మను నరుక్కున్నట్లుగా ఉన్నాయా ?
వలసలను వ్యతిరేకిస్తూ లండన్ లో భారి ప్రదర్శన
మోదీతో చర్చల కోసం ట్రంప్ ఎదురుచూపులు