మెగా నగరాల ప్రాజెక్టులకు పీఎంఓలో ప్రత్యేక సింగిల్ విండో టాస్క్ ఫోర్స్ ఏర్పాటు చేయాలని విజ్ఞప్తి
హైదరాబాద్: దేశంలోని ప్రధాన మహానగరాలకు సంబంధించిన జాతీయ ప్రాధాన్యత గల ప్రాజెక్టులకు వేగంగా అనుమతులు మంజూరు చేసే విధంగా ప్రధానమంత్రి కార్యాలయం (పీఎంఓ)లో ప్రత్యేక సింగిల్ విండో టాస్క్ ఫోర్స్ ఏర్పాటు చేయాలని తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రధాని నరేంద్ర మోడీని కోరారు.
ప్రధాని నరేంద్ర మోడీ తెలంగాణ పర్యటన సందర్భంగా హైదరాబాద్లో నిర్వహించిన అభివృద్ధి కార్యక్రమాల ప్రారంభోత్సవ సభలో సీఎం రేవంత్ రెడ్డి ఈ ప్రతిపాదనను వెల్లడించారు.
ఢిల్లీ, ముంబై, చెన్నై, కోల్కతా, బెంగళూరు, హైదరాబాద్ నగరాలకు సంబంధించిన కీలక ప్రాజెక్టులకు త్వరితగతిన క్లియరెన్స్లు ఇవ్వడానికి ప్రత్యేక వ్యవస్థ అవసరమని సీఎం పేర్కొన్నారు. దేశ ఆర్థికాభివృద్ధిలో ఈ ఆరు మహానగరాలు కీలక పాత్ర పోషిస్తున్నాయని ఆయన అన్నారు.
మెగా నగరాల అభివృద్ధి ద్వారా యువతకు పెద్దఎత్తున ఉపాధి అవకాశాలు లభిస్తాయని సీఎం రేవంత్ రెడ్డి అభిప్రాయపడ్డారు. కేంద్ర ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించి నగరాభివృద్ధి ప్రాజెక్టులను వేగవంతం చేయాలని ఆయన విజ్ఞప్తి చేశారు.

