ట్రంప్ గొప్పలు వాస్తవాలు విశ్లేషణలు
2025 ఏప్రిల్ 22న జమ్మూ కశ్మీర్లోని పహల్గాంలో జరిగిన ఉగ్రవాద దాడి తర్వాత భారత్-పాకిస్తాన్ మధ్య ఉద్రిక్తతలు తారాస్థాయికి చేరి యుద్ధం మొదలైన నేపద్యంలో ప్రపంచమంతా ఆసక్తిగా ఒకింత ఆందోళనగా ఎదురుచూసింది. రెండు చిరకాల దాయాది దేశాలు రెండు అణ్వాయుధ నిల్వలు కలిగిన దేశాలు ఆవేశ క్షణాల్లో ఎలంటి నష్టాలు జరుగుతాయోనని మానవత్వం ఒకింత కలవరానికి గురైన మాటవాస్తవం. పహల్గాం లో ఉగ్రవాదులు పర్యాటకులను నిర్దాక్షిణ్యంగా కిరాతకంగా కాల్చిచంపిన ఘటన భారతీయుల్లో తీవ్ర భావోద్వేగాలు రగిలించాయి. ఈనేపద్యంలో భారత్ “ఆపరేషన్ సిందూర్” ద్వారా పాకిస్తాన్ ఆక్రమిత కశ్మీర్లో ఉగ్రవాద స్థావరాలపై ప్రతీకార దాడులు చేసింది. పాకిస్తాన్ కూడ జవాబుగా ప్రతీకార దాడులతో సరిహద్దుల్లో కాల్పులు, డ్రోన్ దాడులు తీవ్రమయ్యాయి.
ఇక భీకర యుద్ధం మిగిలే ఉన్నదన్న సమయంలో మే 10, 2025న రెండు దేశాలు కాల్పుల విరమణకు అంగీకరించాయి, కానీ అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఈ ఒప్పందానికి తన మధ్యవర్తిత్వమే కారణమని ట్రూత్ సోషల్లో ప్రకటించారు.
ట్రంప్ వాదనలు
అమెరికా సుదీర్ఘ చర్చల ద్వారా భారత్, పాకిస్తాన్లను కాల్పుల విరమణకు ఒప్పించిందని, ఇందుకు “కామన్ సెన్స్, గ్రేట్ ఇంటెలిజెన్స్” ఉపయోగించారని ట్రంప్ పేర్కొన్నారు.
వాణిజ్య ఒప్పందాలను ఆయుధంగా వాడి, కాల్పుల విరమణ జరగకపోతే వాణిజ్యాన్ని ఆపేస్తానని హెచ్చరించినట్లు ట్రంప్ చెప్పుకొచ్చారు.
కశ్మీర్ వివాదంపై మధ్యవర్తిత్వం చేసేందుకు సిద్ధంగా ఉన్నానని కూడ స్వతహాగా తనకు తాను పెత్తనం ఇచ్చుకుంటూ ఓస్టేట్ మెంట్ కూడ పడేశాడు.
భారత్ స్పందన
కాని ట్రంప్ లేదా అమెరికా మధ్యవర్తిత్వాన్ని భారత్ అధికారికంగా ప్రస్తావించలేదు. కాల్పుల విరమణ భారత్, పాకిస్తాన్ సైనిక, దౌత్య చర్చల ఫలితమని ప్రకటన చేసింది.
ట్రంప్ వాణిజ్య ఒప్పందాలతో ప్రభావితం చేశారన్న వాదనను భారత్ తిరస్కరించింది.
కశ్మీర్ భారత్లో అంతర్భాగమని, మూడో పక్ష జోక్యం అంగీకరించబోమని కుండబద్దలు కొట్టింది. ట్రంప్ వ్యాఖ్యలపై నెటిజన్లు, రాజకీయ నాయకులు ఆగ్రహం వ్యక్తం చేయడమే కాదు దుమ్మెత్తి పోసారు. అసలు భారత పౌరుల్లో మెజార్టి శాతం భారత్,పాకిస్తాన్ మధ్య యుద్ధ విరమణను అంగీకిరంచలేదనే విషయం సామాజిక మాద్యమాల్లో వ్యక్తం అయింది.
ట్రంప్ ప్రకటనపై పాకిస్తాన్ స్పందన
పాకిస్తాన్ కాల్పుల విరమణను ధ్రువీకరించింది, కానీ ట్రంప్ పాత్రను మాత్రం స్పష్టంగా గుర్తించలేదు.
కొంతమంది పాకిస్తానీలు ఈ ఒప్పందాన్ని తమ “విజయం”గా చిత్రీకరించారు, కానీ అమెరికా మధ్యవర్తిత్వం గురించి అధికారికంగా ఎక్కడా చెప్పలేదు.
అంతర్జాతీయ విశ్లేషణ
అమెరికా విదేశాంగ మంత్రి మార్కో రుబియో, ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్లు భారత్, పాకిస్తాన్ అధికారులతో చర్చలు జరిపినట్లు నివేదికలు ఉన్నాయి. రుబియో పాకిస్తాన్ ఆర్మీ చీఫ్తో మాట్లాడిన ఫోన్ కాల్ కీలకమైనదని విశ్లేషకులు భావిస్తున్నారు.
అమెరికా దౌత్య ప్రయత్నాలు, వాణిజ్య ప్రోత్సాహకాలు కొంత ప్రభావం చూపి ఉండవచ్చని అంతర్జాతీయ మీడియాసైతం విశ్లేషించింది.
భారత విశ్లేషకులు ట్రంప్ పాత్రను అతిశయోక్తిగా చూపడం పట్ల విస్ఆమయం వ్యక్తంచేసారు. ఆయన రాజకీయ లబ్ధి కోసం ఈ సందర్భాన్ని వాడుకుంటున్నారనే అభిప్రాయాలు వ్యక్తం అయ్యాయి.
ఫైనల్
ట్రంప్ పాత్ర పూర్తిగా గప్పాలు అని చెప్పలేము, ఎందుకంటే అమెరికా దౌత్య ప్రయత్నాలు కొంత దోహదపడి ఉండవచ్చు. అయితే, ట్రంప్ తన వ్యక్తిగత ప్రభావాన్ని ఎక్కువ చేసిచెప్పుకోవడం, కశ్మీర్ విషయంలో మధ్యవర్తిత్వం చేస్తాననడం రాజకీయ ఉద్దేశంతో కూడినవని స్పష్టమవుతోంది. భారత్ తన స్వతంత్ర నిర్ణయాలతో ఈ ఒప్పందాన్ని సాధించిందని, అమెరికా జోక్యం పరిమితంగానే ఉందని భారత అధికారిక స్పందనల మేరకు అర్దం అవుతోంది. రెండు దేశాల సరిహద్దు ప్రాంతాల్లో శాంతిని పునరుద్ధరణకు పునాదులు పడడం అహ్వానించ దగ్గపరిణామమే అయినా పాకిస్తాన్ విషయంలో భారత్ మాత్రం ఎప్పటికి నమ్మకంగా ఉండే పరిస్థితి లేదు. సందట్లో సడేమియా అంటూ ట్రంప్ ఎంతగా గొప్పలకు పోయినా భారత్ మాత్రం పాకిస్తాన్ విషయంలో ఖచ్ధృచిత మైన ధృఢమైన సంకల్పంతో ఉందనేది దేశ ప్రధాన మంత్రి నరేంద్ర మోది దేశ ప్రజలనుద్దేశించి ఇచ్చిన సందేశంలో స్పష్టంగా ఉంది.