హైదరాబాద్లో రాష్ట్ర మీడియా అక్రిడిటేషన్ కమిటీ సమావేశం
అర్హులైన జర్నలిస్టులకు కార్డుల మంజూరు – ఏప్రిల్ మొదటివారంలో తిరిగి సమావేశం కానున్న కమిటీ.
హైదరాబాద్, మార్చి 24:
హైదరాబాద్లోని ఎఫ్డీసీ బోర్డు రూమ్లో ఈ రోజు రాష్ట్ర మీడియా అక్రిడిటేషన్ కమిటీ (ఎస్ఎంఏసీ – స్టేట్ మీడియా అక్రిడిటేషన్ కమిటీ) సమావేశం జరిగింది. ప్రెస్ అకాడమీ, ఎస్ఎంఏసీ చైర్మన్ కె. శ్రీనివాస్ రెడ్డి, సమాచార–పౌర సంబంధాల శాఖ ప్రత్యేక కమిషనర్, ఎస్ఎంఏసీ కో-చైర్పర్సన్ సీహెచ్ ప్రియాంకతో కలిసి అక్రిడిటేషన్ కమిటీ సమావేశం నిర్వహించారు. అక్రిడిటేషన్ కోసం జర్నలిస్టులు సమర్పించిన దరఖాస్తులను కమిటీ సభ్యులు సమగ్రంగా పరిశీలించారు.
జర్నలిస్టుల నుంచి అందిన ప్రతి దరఖాస్తును కమిటీ సభ్యులు క్షుణ్ణంగా పరిశీలించి, అర్హులైన జర్నలిస్టులకు అక్రిడిటేషన్ కార్డులను మంజూరు చేశారు. ఈ సందర్భంగా కమిటీ చైర్మన్ శ్రీనివాస్ రెడ్డి మాట్లాడుతూ ప్రభుత్వం నిర్దేశించిన మార్గదర్శకాల ప్రకారం అర్హులైన వారికి అక్రిడిటేషన్ కార్డులు జారీ చేస్తామని, అర్హత కలిగిన ప్రతి జర్నలిస్టుకు కార్డు మంజూరులో ఎలాంటి లోపం ఉండదని స్పష్టం చేశారు.

అక్రిడిటేషన్ కమిటీ సమావేశాన్ని వచ్చే నెల మొదటివారంలో నిర్వహించనున్నట్లు తెలిపారు. ఇంకా దరఖాస్తు చేసుకోని అర్హులైన జర్నలిస్టులు ఆన్లైన్ ద్వారా తమ దరఖాస్తులను సమర్పించాలని సూచించారు. జిల్లాల వారీగా కలెక్టర్లు పంపే ‘జిల్లా మీడియా అక్రిడిటేషన్ కమిటీ (డీఎంఏసీ)’ ప్రతిపాదనలను కూడా పరిశీలించి ఆమోదం తెలుపుతుందని వెల్లడించారు. ఈ మేరకు జిల్లా స్థాయిలో అక్రిడిటేషన్ ప్రక్రియను త్వరితగతిన పూర్తి చేయాలని కలెక్టర్లను కోరారు.
సమాచార–పౌర సంబంధాల శాఖ డైరెక్టర్ కిషోర్ బాబు, అదనపు డైరెక్టర్ డి.ఎస్. జగన్ పాటు ఇతర కమిటీ సభ్యులు సమావేశంలో పాల్గొన్నారు.

